సినిమాలు ఒక వినోద సాధనం. వినోదం పేరుతో సాగే లక్షల కోట్ల వ్యాపారం. వ్యాపారానికి లాభనష్టాలే తప్ప కష్టసుఖాలు తెలియవు. మనకేంటన్నదే తప్ప మానవీయత ఇసుమంతైనా ఉండదు. వెలుగు జిలుగుల సినిమావాళ్లకి మిగులు గుబులే తప్ప బడుగు జీవుల వెతలు చితలు ఎంత మాత్రం పట్టవు. సినిమా వేలం వెర్రిలో సగటు ప్రేక్షకుడే గల్లంతవుతున్నాడు. ప్రేక్షకుడి జేబులకు బొక్కలు పెట్టి, చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. వారిని వెర్రి పుష్పాలను చేస్తున్నారు. ఈ విషయాన్ని పుష్ప 2 సినిమా ప్రివ్యూ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటన మరోసారి నిరూపించింది.
కళాత్మక, సైద్ధాంతిక, సాంకేతికతల ఆధారంగా వినోదాన్ని పంచే సినిమాలు ప్రేక్షకుల ఆదరణతో వ్యాపారాత్మకంగా మారాయి. తమని సినీ నటుల్లో, వారి పాత్రల్లో ఊహించుకుంటూ వాళ్ళకి ఫ్యాన్స్ అయిన ప్రేక్షకుల పిచ్చి బలహీనతలతో ఆర్థికంగా బలంగా మారారు. మామూలు బాబులు, బడాబాబులయ్యారు. వాళ్లే ప్రొడ్యూసర్లు, హీరోలుగా మారి లేని ఇమేజ్ ని సృష్టించుకుని సినిమాలు తీస్తున్నారు. దీంతో సీనీ నటులకు స్టార్ డమ్ ఆపాదించబడింది. ముఖంలో కవలికలు పలికించలేని వాళ్లు కూడా వెకిలి చేష్టలు, మకిలి మాటలతో ఎవరికి వారే తలా తోకలు తగిలించుకుని స్టార్లైపోయారు.
సాధారణంగా పబ్లిక్ ఫిల్మ్ ప్రీమియర్ కు ముందు కార్పొరేట్ ప్రమోషన్ల ప్రయోజనాల కోసం ఎంపిక చేసిన ప్రేక్షకులకు సినిమాని ప్రదర్శించడమే ప్రివ్యూ. ప్రేక్షకుల స్పందనను అంచనా వేసి, అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడానికి వీలుగా ఈ ప్రివ్యూ షోలని వేస్తారు. దర్శక నిర్మాతలు, అప్పుడప్పుడు హీరో, హీరోయిన్లు ప్రివ్యూలకు రావడం పరిపాటి. కానీ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట మాత్రం అసాధారణం.
లక్ష్యాలు, నిర్లక్ష్యాలు ఎలా ఉన్నా, ఓ మహిళ ప్రాణం పోవడం, ఓ పసివాడు చావుబతుకుల్లో ఉండటం వరకైతే వాస్తవం. ఈ ఘటన తర్వాత పరిణామాలే అత్యంత అసహ్యంగా ఉన్నాయి. ఈ ఘటన పర్యవసానంగా సంభవించిన అంశం పక్కకుపోయి, మిగతా అంశాలన్నీ ముందుకు రావడం మన సమాజంలో పేరుకుపోతున్న నీచ సంస్కృతికి నిదర్శనం. ఈ ఘటనపై ఓ నటుడు, ఆ నటుడి తండ్రి, నిర్మాతలు, సినిమా వాళ్ళు, పోలీసులు, అభిమానులు, ప్రభుత్వం, ప్రతిపక్షం, రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నేతలు, మీడియా, నెటిజన్లు తమకు తోచిన విధంగా చేతులకు, మూతులకు పని చెప్పేశారు. దీంతో అసలు సంఘటన మరుగున పడింది. అనవసర రాద్ధాంతాలు రాజ్యమేలుతున్నాయి.
ఒక పోలీసు అధికారి చేత ఉచ్చ తాగించిన ఓ స్మగ్లర్ హీరోగా తీసిన పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ లో ఆ హీరో తన పేరు మరచిపోయాడన్న కక్షతో సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా చేయించాడని, ప్రభుత్వమే ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ విషయాన్ని ముందుకు తెచ్చిందని, నంద్యాలకు వెళ్లి వైసిపి శిల్ప మోహన్ రెడ్డి కొడుకు శిల్ప రవి చంద్ర రెడ్డి కోసం ఆ హీరో ప్రచారం చేశాడన్న కోపంతో ఎ.పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ద్వారా రేవంత్ రెడ్డికి చెప్పి చేయిస్తున్నారన్న దాకా వెళ్లింది. పుష్ప 2 కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిందన్న విషయమే తెలియదని, అసలు ఆ హీరో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ప్రేక్షకులదే నిర్లక్ష్యం, కాదు పోలీసులదే నిర్లక్ష్యం, థియేటర్ యాజమాన్యందే నిర్లక్ష్యం, బౌన్సర్ల అతి అంటూ వాదోపవాదాలు. ఇక రాజకీయ పార్టీలైతే, అధికార పక్షం సీఎం మాట్లాడాడు కాబట్టి ప్రతిపక్షం వ్యతిరేకించాలి. ఎంఐఎం మాట్లాడింది కాబట్టి బిజెపి ఎండగట్టాలి. ఆయా జెండాలవి సింగిల్ పాయింట్ ఎజండాలు.
అత్యంత దురదృష్టం ఏంటంటే, జరిగిన సంఘటన పట్ల ఎవరూ చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. సమస్యను సమస్యలా చూడటంలేదు. దౌర్భాగ్యంగా రాజకీయం రుద్దుతున్నారు. కారణం ఏదైనా అసెంబ్లీలో అక్బరుద్దీన్ ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి జవాబిస్తూ మానవీయంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో బాధితుల పట్ల ఆ సినిమా, మొత్తం సినిమా వాళ్ళ అమానవీయ పద్ధతిని ఎండగట్టారు. తల్లి చనిపోయి, చావుబతుకుల మధ్య ఉన్న ఆ బాబును కనీసం పరామర్శించని పుష్ప హీరోని పరామర్శిస్తున్న సినిమావాళ్ళని చీల్చి చెండాడాడు. ఆ వెంటనే ప్రెస్ మీట్ లో సదరు హీరో మాట్లాడిన మాటలు మరింత జుగుప్సాకరంగా ఉన్నాయి. తను, తన సినిమా ప్రమోషన్, ఈ రేంజ్ కి చేరి, సక్సెస్ ని ఎంజాయ్ చేయలేని నిస్సహాయతను వెల్లగక్కడమే తప్ప, తన సినిమాని చూడటానికి వచ్చి బలైన బాధిత కుటుంబం పట్ల కనీసం జాలి, కరుణ, మానవతను ప్రదర్శించలేకపోయాడు. చికిత్స పొందుతున్న పసివాడిని పట్టించుకోలేదు. పైగా పరామర్శకు కోర్టు కేసును అడ్డంగా వాడుకున్నారు. ఓయు స్టూడెంట్స్ దాడి చేస్తే తప్ప కనీసం దండుగ కట్టలేదు. ఇంత జరిగినా సినిమావాళ్లకి సక్సెస్ మీట్లు, కలెక్షన్ల యావే తప్ప ప్రజలు, ప్రేక్షకులు, ఫ్యాన్స్ డోంట్ కేర్.
ఇప్పుడే కాదు గతంలోనూ ప్రకృతి వైపరీత్యాలు వంటి విపత్కర విషమ పరిస్థితుల్లోనూ వీళ్ళ బండారాన్ని బయట పెట్టకున్నారు. ఇలాంటి రీల్ హీరోలనా మనం రియల్ హీరోలుగా అభిమానిస్తున్నది? ఇంత స్వార్థపరులకా మనం సాగిలపడుతున్నది. పశు పక్షాదులకున్న పాటి జాలిలేని వీళ్ళనా మనం అనుకరిస్తున్నది. వాళ్లు మనల్ని పనీపాటాలేని దద్దమ్మల్లా, ఫోన్లకు పరిమితైన ముద్దపప్పుల్లా, సినిమా వ్యామోహంతో సిల్వర్ స్ర్కీన్లకు అతుక్కుపోయే పురుగుల్లా, ఫస్ట్ రోజే టికెట్లు కొని సినిమాలు చూసే నిబ్బల్లా, పరమ శుంఠల్లా చూస్తున్నారు. పుష్పాలాంటి సినిమాల సిరీస్ లతో మన చెవుల్లో పుష్పాలు పెట్టి మనల్ని ఎర్రి పువ్వుల్ని చేస్తున్నారు.
హలో! ఫ్యాన్స్.. అంతా నాన్ సెన్స్!! మనం పొలిటికల్ వాళ్ళకి ఓటు బ్యాంకులా, సినిమావాళ్ళకు క్యాష్ బ్యాంకులా మాత్రమే కనిపిస్తాం. సినిమా వినోదం మాత్రమే. అంతకు మించితే విషాదం కూడా. జెర సోచో! తస్మాత్ జాగ్రత్త!!

– డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ

