ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్…మైండ్ బ్లాక్ అయి, ఇంకా పిచ్చిపిచ్చిగానే మాట్లాడుతోంది. కాళ్ళ బేరానికి వచ్చి, కాల్పుల విరమణ ఒప్పందం తెర మీదకి తెచ్చి, మరింత నష్టం జరక్కుండా ముందే జాగ్రత్తపడింది. లేకుంటే భారత్ చేతిలో చావుదెబ్బ తిని వుండేది. ఆ విషయం మరచి, మళ్లీ యుద్ధ ప్రేలాపనలు పేలుతోంది. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాటలే ఇందుకు నిదర్శనం. భారత్తో మళ్లీ యుద్ధం జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. అయితే, ఈసారి యుద్ధం వస్తే తాము అనుకూల ఫలితాలు సాధిస్తామంటూ బీరాలు పలికారు. ‘ఉద్రిక్తతలను కోరుకోవట్లేదు. కానీ, ముప్పు పొంచి ఉన్నమాట వాస్తవం. భారత్తో యుద్ధం అవకాశాలను కొట్టిపారేయ లేం. కానీ, ఈసారి యుద్ధం జరిగితే.. గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తాం’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్కు ఇటీవల భారత్ ఆర్మీ చీఫ్ గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి బదులిస్తూనే ఖవాజా ఈ విధంగా కవ్వింపులకు పాల్పడ్డారు. ఇటీవల భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, ‘భారత్ పూర్తి సన్నద్ధంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ 1.0లో మాదిరిగా ఈసారి సహనం ప్రదర్శించబోం. పాక్ ప్రపంచ పటంలో ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపి తీరాల్సిందే. లేదంటే ఆ దేశాన్ని చరిత్ర నుంచి తుడిచిపెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త!’ అని జనరల్ ద్వివేది గట్టిగా హెచ్చరించారు. అయితే, పాక్ ప్రగల్బాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పాక్ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదంతా కేవలం అమెరికా అండచూసుకునే అని వేరుగా చెప్పనక్కరలేదు. అమెరికా కూడా గతాన్ని మరచి పాక్కు పాలుపోసి పెంచుతోంది. ఇన్నాళ్లు కష్టకాలంలో ఆర్థికంగా, సైనికంగా రక్షిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్తాన్ నమ్మకద్రోహం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు అమెరికా పంచన చేరి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. రెండు వైరి దేశాల మధ్య పాక్ డేంజర్ గేమ్ ఆడుతోంది.
ఇటీవల, పాకిస్తాన్ అమెరికాల మధ్య ఖనిజ ఒప్పందం కుదిరింది. దీంతో బలూచిస్తాన్ ప్రాంతంలోని రేర్ ఎర్త్ మినరల్స్, రాగి వంటి లోహాలను అమెరికా కొల్లగొట్టడానికి చూస్తోంది. దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా సహకరిస్తోంది. నిజానికి పాక్, ఇంతకాలం చైనాతో చెట్టాపట్టాలేసుకు తిరిగింది. ఆపరేషన్ సిందూర్ లో కూడా చైనా సాయం తీసుకుంది. అమెరికా దగ్గరకు పిలిచి ముద్దు చేయడంతో ఇప్పుడు చైనాకు చెక్ పెట్టి అమెరికా పంచన చేరింది.
అమెరికా, పాకిస్తాన్ స్నేహం భారత్కు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా మద్దతుతో పాక్ బలుపు మాటలు మాట్లాడుతోంది. ఇక పస్నీ ద్వారా భారత వ్యూహాత్మక ఓడరేవు చాబహార్ని కౌంటర్ చేయవచ్చు. అమెరికా స్నేహం పాకిస్తాన్కు మిలిటరీ, ఇంటెలిజెన్స్ వంటి వ్యూహాత్మక, సాంకేతిక సహకారాన్ని అందించవచ్చు. ఈ చర్యల ద్వారా పాకిస్తాన్ రక్షణ ఒప్పందాలను మెరుగు పరుచుకోవచ్చు. అమెరికా ద్వారా పాకిస్తాన్ భౌగోళిక రాజకీయ విశ్వాసాన్ని పెంచుకుంటోంది. భారత్తో పోలిస్తే అమెరికాతో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఈ చర్యలు ఇరాన్కు కూడా ప్రమాదకరమే. ఇరాన్ షిప్పింగ్ లైన్లపై అమెరికా నిఘా పెరుగుతుంది. అమెరికా, పాక్ బంధంపై భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ట్రంప్ ఇప్పుడు భారత్ను ఇబ్బంది పెట్టే ఏ చర్యను కూడా వదలడం లేదు. నిజానికి పాకిస్తాన్ ద్వారా అరేబియా సముద్రానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని 60 బిలియన్ డాలర్లతో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను ప్రారంభించింది. బలూచిస్తాన్లో గ్వాదర్ పోర్టును నిర్మించింది. అయితే, ఇప్పుడు ఈ గ్వాదర్ పోర్టుకు కేవలం 70 మైళ్ల దూరంలో అమెరికాతో కలిసి పస్నీ ఓడరేవును నిర్మించేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఇది భారత్ ఇరాన్లో నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు కేవలం 178 మైళ్ల దూరంలోనే ఉంది. చైనా, భారత్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు కీలమైన ఈ వ్యూహాత్మక స్థానంలో పాకిస్తాన్ అమెరికాకు అవకాశం కల్పిస్తోంది. ఈ ఓడరేవు అరేబియా, హిందూ మహా సముద్రంలోని సముద్ర భద్రతకు కూడా చిక్కులు కల్పిస్తుంది. ఈ పస్నీ ఓడరేవు ద్వారా బలూచిస్తాన్లోని ఖనిజ సంపదను అమెరికాకు తరలించవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. అయితే, ఇప్పటి వరకు దీనిపై రెండు దేశాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒక వేళ ఇదే కార్యరూపం దాల్చితే, చైనాతో పాటు భారత్ ప్రయోజనాలకు కూడా తీవ్ర భంగం కలగవచ్చు. దీని నిర్మాణానికి 1.2 బలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఓడరేవు బ్యాటరీ టెక్నాలజీ, క్షిపణుల తయారీ, అధునాతన ఎలక్టాన్రిక్స్ ఉత్పత్తుల్లో ఉపయోగించే రాగి, యాంటిమోనీ, నియోడైమియం వంటి ఖనిజాల ఎగుమతులకు గేట్వేగా మారుతుంది. సెప్టెంబర్ 8న పాకిస్తాన్ మిలిటరీ ఇంజనీరింగ్ కార్ప్స్ తో 500 మిలియన్ల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాకిస్తాన్ ఈ ఖనిజాల షిప్మెంట్ను మిస్సోరీకి చెందిన ఙా స్టాట్రజిక్ మెటల్స్ కి ఎగుమతి చేసింది. అమెరికాను మచ్చిక చేసుకుని భారత్పై పగతీర్చుకోవడానికి పాక్ వెనకాడకపోవచ్చు. ఆ దేశ రక్షణమంత్రి, ఆర్మీ చీఫ్లు అడపాదడపా చేస్తున్న వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిందే.

