OSD SUMANTH|సుమంత్ ARREST|అరెస్ట్ ప్రయత్నం, KONDA SUSMITHA|కొండా సుస్మిత ఆరోపణలు
CMసీఎం REVANTH REDDY|రేవంత్పై విరుచుకుపడిన కొండా కుటుంబం|KONDA FAMILY
హైదరాబాద్, అక్టోబర్ 16 (అడుగు న్యూస్):
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం చుట్టూ పెద్ద తుఫాను రేగింది. కాలుష్య నియంత్రణ మండలిలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తోంది. వరంగల్కు చెందిన సుమంత్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, సురేఖ నివాసం వద్ద రాత్రివేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో సురేఖ కుమార్తె కొండా సుస్మిత స్వయంగా రంగంలోకి దిగి, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుస్మిత మాట్లాడుతూ, మా ఇంటికి వచ్చారా? మా అమ్మను అరెస్ట్ చేసేందుకా? అని పోలీసులను ప్రశ్నించారు. అరెస్ట్పై అధికారులు సరైన కారణం చెప్పలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకంగా ఉండటం తప్పా? మా అమ్మపై కుట్ర జరుగుతోంది. బీసీ బిడ్డ అయిన మా అమ్మను సిస్టమాటిక్గా టార్గెట్ చేస్తున్నారు,” అంటూ సుస్మిత విరుచుకుపడింది.
ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తూ, రేవంత్ రెడ్డి గన్ ఇచ్చాడు, ఆ గన్ రోహిన్ రెడ్డి తీసుకొచ్చాడు. అదే గన్తో డెక్కన్ సిమెంట్స్ యజమానులను డబ్బుల కోసం బెదిరించారు. ఇప్పుడు మా నాన్నను ఆ కేసులో ఇరికిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ మా అమ్మ మంత్రి పదవిని తీసేయాలని ప్రయత్నిస్తున్నాడు. సుమంత్పై కేసు పెట్టి, దాన్ని మా అమ్మపై మళ్లించి ఆమెను రాజకీయంగా నాశనం చేయాలని చూస్తున్నాడు, అని సుస్మిత ఆరోపించారు.
ఇదిలావుండగా, మంత్రి సురేఖ వద్ద పనిచేస్తున్న సుమంత్ ఎవరు అనే అంశం కూడా పెద్ద చర్చగా మారింది. వరంగల్ జిల్లా వ్యక్తి అయిన సుమంత్, సురేఖ కుమార్తె సుస్మిత క్లాస్మేట్. కుటుంబానికి సన్నిహితుడిగా ఉండే సుమంత్ ఎన్నికల నాటి నుంచి కొండా కుటుంబానికి సహాయకుడిగా పనిచేశాడు. సురేఖ మంత్రిగా ఉన్న తర్వాత ఆయనను కాలుష్య నియంత్రణ మండలిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా నియమించి, తరువాత ఓఎస్డీ పోస్టును సృష్టించి నియమించినట్లు సమాచారం.
ఇటీవల సుమంత్ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఆయన సురేఖ అధీనంలోని దేవాదాయ శాఖ, అటవీ శాఖకు సంబంధించిన వ్యాపార, పారిశ్రామిక వర్గాలపై ఒత్తిడి తెచ్చి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టి బెదిరించాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సురేఖ కుమార్తె సుస్మిత మాట్లాడుతూ, మేము మంత్రి ఉత్తమ్ని సంప్రదించాం. ఆయన ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పారు. అంటే ఇది కుట్రే కదా! అని అన్నారు.
ఈ వివాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి సారించింది. సుమంత్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కల్పించుకుని, సురేఖను తన ఓఎస్డీని తొలగించాలని ఆదేశించారు. అదే సమయంలో సుమంత్ను అదుపులోకి తీసుకోవాలని టాస్క్ఫోర్స్కు ఆదేశాలు ఇచ్చారు. కానీ సురేఖ తన ఇంట్లోనే సుమంత్కు షెల్టర్ ఇచ్చారు. పోలీసులు సుమంత్ కోసం ఇంటికి వెళ్లినప్పుడు, సుస్మిత వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత సురేఖ తన కారులో సుమంత్ను తీసుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లడం మరో సంచలనం సృష్టించింది.
ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. దేవాదాయ శాఖలో ఉన్న ఫైల్స్ అన్నిటిని ప్రభుత్వానికి అప్పగించాలని సురేఖకు ఆదేశాలు ఇచ్చారు. అదికాకుండా సురేఖ నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని కూడా తొలగించారు. హన్మకొండలో ఆమె నివాసంలో మంత్రులకు ఇచ్చే కనీస భద్రతను కూడా వెనక్కి తీసుకున్నారు.
ఇదే సమయంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర పనులన్నీ రోడ్లు-భవనాల శాఖకు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ పనులు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండగా, ఇప్పుడు సురేఖ చేతుల నుంచి అవి వెళ్లిపోయాయి. ఈ నిర్ణయం టెండర్ల విషయంలో మంత్రుల మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ పరిణామాలన్నీ జరుగుతుండగా, సురేఖ కుటుంబం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. సీఎం రేవంత్, వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి కుట్ర చేస్తున్నారు. మా అమ్మను రాజకీయంగా తొలగించే ప్రయత్నం జరుగుతోంది అని సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు మంత్రి సురేఖ కూడా మీడియా ముందుకు వచ్చి సుమంత్ వ్యవహారంపై తన వైఖరిని వెల్లడించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె భర్త కొండా మురళీ మాట్లాడుతూ, ఈ వ్యవహారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం గమనార్హం.
ఇక కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. కొండా దంపతులు సీఎంపై నేరుగా ఆరోపణలు చేస్తే, వారు మంత్రి పదవిలో కొనసాగగలరా? అనే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం కోల్పోయిన మంత్రి సురేఖ పార్టీ, ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమని నేతలు అంచనా వేస్తున్నారు. ఆమెను కేబినెట్ నుంచి తప్పించడం లేదా స్వయంగా రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేకపోవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ మొత్తం వివాదం వెనుక మరిన్ని రాజకీయ సమీకరణాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కొండా కుటుంబం రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలకు బలయ్యిందని, సురేఖను క్రమంగా బయటికి నెట్టివేయాలని ఒక వర్గం ప్రయత్నిస్తోందని సమాచారం. ఇప్పటికే పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సురేఖను ఎమ్మెల్యే క్వార్టర్స్ కు పిలిచి భేటీ అవ్వాలని సూచించారు. ఇదే సమయంలో సుమంత్ భార్య మనీషా కూడా సురేఖను కలిసి మాట్లాడినట్లు సమాచారం.
మొత్తం చూస్తే, సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద సంక్షోభంగా మారింది. మంత్రి పదవి, పార్టీ భవిష్యత్తు, రాజకీయ ప్రభావం అన్నీ ఇప్పుడు సస్పెన్స్లో ఉన్నాయి. సుమంత్ అరెస్ట్, బలవంతపు వసూళ్ల ఆరోపణలు, సీఎం రేవంత్పై నేరుగా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కలిపి తెలంగాణ రాజకీయాల్లో విపరీతమైన చర్చకు దారితీశాయి. ఈ తుఫాను ఎటు దారి తీస్తుందో, కొండా కుటుంబం రాజకీయ భవితవ్యం ఏ దిశలో సాగుతుందో సమయమే చెప్పాలి.

