పరీక్షల నిర్వహణలో ఇలాంటి వైఫల్యాలు చోటుచేసుకోవడం కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆటాడుకోవడమే. నీట్ పేపర్ లీక్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చట్టాలు తేవాలి. ఎన్టిఏ పనితీరుపై స్వతంత్ర సమీక్ష జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాలకు మళ్లీ వైద్య ప్రవేశ పరీక్షల నిర్వహణలో అధికారం ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలి. ముఖ్యంగా విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి పొందడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. విద్యా వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. ఈ నెల 3న జరిగిన నీట్ (యూజీ)–2026 పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని బయటపడటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షను రద్దు చేసింది. సీబీఐ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ పరిణామం దేశంలోని పరీక్ష రాసిన 22 లక్షల మంది విద్యార్థులను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టి వేసింది. కష్టపడి చదివిన విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడగా, తల్లిదండ్రులపై ఆర్థిక, మానసిక భారం మరింత పెరిగింది. పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకం కూడా తీవ్రంగా దెబ్బతిన్నది.
ఇటీవల నీట్, యూజీసీ నెట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పేపర్ లీక్లు, అవకతవకలు వరుసగా వెలుగులోకి రావడం ఆందోళనకరం. ఈసారి మాత్రమే కాదు, గతంలోనూ నాలుగు సార్లు నీట్ పరీక్షకు సంబంధించి అక్రమాల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టిఏ పనితీరు, పరీక్షల నిర్వహణ సామర్థ్యం, భద్రతా వ్యవస్థలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 46కు పైగా పరీక్షలను కేవలం 400 మంది సిబ్బందితో సమన్వయం చేయడం ఎంతవరకు సమర్థవంతమన్న సందేహం కూడా ఉత్పన్నమవుతోంది.
ఎన్టిఏ ప్రకారం పరీక్షల భద్రత కోసం జీపీఎస్ ట్రాకింగ్ వాహనాలు, బయోమెట్రిక్ ధృవీకరణ, ఎ.ఐ ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణ, 5జీ జామర్లు వంటి ఆధునిక చర్యలు అమలు చేశామని చెబుతున్నారు. అయితే, పేపర్లు ముందుగానే బయటకు రావడం ఈ భద్రతా వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం.రాజస్తాన్ లోని సీకర్ ప్రాంతంలో పరీక్షకు దాదాపు 42 గంటల ముందే వాట్సాప్ ద్వారా “గెస్ పేపర్” పేరిట ప్రశ్నలు చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఆ పేపర్లోని కెమిస్ట్రీ, బయాలజీ విభాగాల్లో 120 నుంచి 140 ప్రశ్నలు అసలు పరీక్షలో రావడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రశ్నాపత్రాలను రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించినట్లు సమాచారం. పలువురు నిందితులను అరెస్టు చేసినప్పటికీ అసలు సూత్రధారులు ఎవరన్నది ఇంకా స్పష్టం కాలేదు.
పరీక్షల నిర్వహణలో ఇలాంటి వైఫల్యాలు చోటుచేసుకోవడం కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆటాడుకోవడమే. వైద్య విద్య వంటి అత్యంత పోటీ రంగంలో ఒక్క మార్క్ కూడా కీలకం. అలాంటి పరిస్థితిలో ముందుగానే ప్రశ్నాపత్రాలు పొందిన విద్యార్థులు 720 మార్కుల్లో 600కు పైగా సాధించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల కృషిని అవమానపరచడమే అవుతుంది.
ఈ వివాదంతో మరోసారి నీట్ విధి, విధానాలపైనే ప్రశ్నలు చెలరేగుతున్నాయి. గతంలో ప్రతి రాష్ట్రం తమ అవసరాలకు అనుగుణంగా ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేది. అప్పుడు ఇలాంటి జాతీయ స్థాయి సంక్షోభాలు అరుదుగా ఉండేవి. కానీ 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రీకరణ విధానంలో భాగంగా నీట్ను దేశవ్యాప్తంగా అమలు చేసింది. దీంతో రాష్ట్రాల పరిధిలో ఉన్న వైద్య విద్య ప్రవేశ వ్యవస్థ పూర్తిగా కేంద్ర నియంత్రణలోకి వెళ్లింది. దీనిని మొదటి నుంచీ తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీలు నీట్ విధానాన్ని పునరాలోచించాలని తీర్మానాలు చేశాయి.
నీట్ విధానం పట్టణ ప్రాంతాల ధనిక, ఎగువ మధ్యతరగతి విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తోంది. ఖరీదైన కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ శిక్షణా సంస్థలు, కార్పొరేట్ విద్యా వ్యవస్థల సహకారం లేకుండా సామాన్య కుటుంబాల విద్యార్థులు పోటీలో నిలబడటం కష్టమవుతోంది. ఇప్పుడు పేపర్ లీక్లు కూడా జతకావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇటువంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన స్థాయిలో స్పందన కనిపించకపోవడం. పరీక్షల ముందు విద్యార్థులతో “పరీక్షా పే చర్చ” కార్యక్రమాలు నిర్వహించే నాయకత్వం, పేపర్ లీక్ల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక వేదనపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. గతంలో టెన్త్ లేదా ఇంటర్ పరీక్షల్లో చిన్న అవకతవక జరిగినా సంబంధిత మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేవారు. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు సంక్షోభంలో పడినా బాధ్యత స్వీకరించే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేపర్ లీక్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలి. ఎన్టిఏ పనితీరుపై స్వతంత్ర సమీక్ష జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అవసరమైతే రాష్ట్రాలకు మళ్లీ వైద్య ప్రవేశ పరీక్షల నిర్వహణలో అధికారం ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలి. ముఖ్యంగా విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి పొందడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలి. విద్యా వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది.

