తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మరిపిస్తున్నది. రోజుకో మలుపుతో రోజురోజుకు మరింత ఉత్కంఠను రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలతో మొదలైన ఈ కేసు, ఇప్పుడు ఆ పార్టీ అగ్ర నేతల వరకూ చేరింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న పోలీసు అధికారులను, బాధితులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం… నిన్న మాజీ మంత్రి హరీశ్ రావును, నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు పిలిచింది. మరి ‘రేపు ఎవరు?’ అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. సర్వత్రా ఉత్కంఠతోపాటు ఆసక్తి రేపుతోంది.
హైదరాబాద్, జనవరి 22 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణలో గత ప్రభుత్వ కాలంలో పోలీస్ విభాగాన్ని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులు, పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు, మీడియా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి, నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇది జాతీయ, రాష్ట్ర భద్రత, శాంతి భద్రతల పేరుతో జరిగిందా? లేక పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అనే అంశాలే దర్యాప్తులో కీలకంగా మారాయి. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ కేసుతో సంబంధముందన్న ఆరోపణలతో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను, పలువురు నేతలను, బాధితులను ‘సిట్’ విచారించింది. హరీష్ రావు నిన్నటి విచారణ ఈ కేసులో కీలక మలుపు. అప్పట్లో ఆయన కీలక మంత్రిగా ఉండటంతో, సిట్ అడిగిన ప్రశ్నలు రాజకీయ ఆదేశాల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ‘ఆ పెద్దాయన ఎవరం’టూ ప్రశ్నించినట్లు గుప్పుమంది. హరీష్ రావు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఇది పూర్తిగా రాజకీయ కక్షతో కూడిన కేసని, కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని వ్యాఖ్యానించారు. అయితే, దర్యాప్తు సంస్థలు మాత్రం సాంకేతిక ఆధారాలు, అధికారుల వాంగ్మూలాల ఆధారంగా విచారిస్తున్నామని చెబుతున్నాయి.
ఇక నేడు కేటీఆర్ ను విచారిస్తుండటం ఈ కేసును ఆసక్తికరంగా మార్చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ, మున్సిపల్ పరిపాలన వంటి కీలక శాఖలను నిర్వహించిన కేటీఆర్, ప్రభుత్వంలో రెండో అధికార కేంద్రంగా వ్యవహరించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశం ఆయనకు తెలియకుండా జరిగిందా? లేదా వ్యవస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేటీఆర్ కూడా ఈ కేసును రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ, తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ‘రేపు ఎవరు?’ అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. ‘పెద్దాయన’ చెప్పాడనే వాంగ్మూలాలు రావడాన్ని బట్టి చూస్తే, అప్పటికీ, ఇప్పటికీ బీఆర్ఎస్ లో, అప్పటి ప్రభుత్వంలోనూ కేసీఆర్ నే ‘పెద్ద సారు’, ‘పెద్దాయన’ అని సంబోధించేవారు. ఆయితే ఆ పెద్దాయన కేసీఆరేనా? అన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల నేతలు, ప్రముఖులు, సొంతపార్టీలోని పెద్దలు వగైరా దాదాపు ఆరు వేల మంది ఫోన్లు ట్యాప్ అయినట్లుగా వెల్లడవడాన్ని బట్టి, అంతటి స్థాయిలో నిఘా వ్యవస్థ పనిచేయాలంటే అత్యున్నత రాజకీయ అనుమతి అవసరమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆ అత్యున్నత అధికారం ఆనాడు కేసీఆరే నిర్వర్తించారు. అయితే, కేసీఆర్ను నేరుగా ఈ కేసుతో అనుసంధానించేలా ఇప్పటివరకు అధికారిక ప్రకటనలేవీ లేవు. అయినప్పటికీ, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఎవరెవరి పాత్ర బయటపడుతుందన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.
రాజకీయంగా ఈ కేసు కాంగ్రెస్కు ఒక ఆయుధంగా మారినట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ మాత్రం ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య అని, ఎన్నికల్లో ఓడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని విమర్శిస్తోంది. ఈ పరస్పర ఆరోపణల మధ్య, ప్రజలు మాత్రం అసలు నిజం ఏమిటన్నదానిపై స్పష్టత వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.
న్యాయపరంగా చూస్తే, ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత సున్నితమైన విషయం. చట్టబద్ధమైన అనుమతులు, స్పష్టమైన కారణాలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వ్యక్తిగత గోప్యత హక్కును మౌలిక హక్కుగా గుర్తించింది. అలాంటి పరిస్థితిలో, ఈ కేసులో ఆరోపణలు నిజమైతే, ఇది కేవలం రాజకీయ కేసు కాకుండా, ఒక పెద్ద రాజ్యాంగ సంక్షోభంగా కూడా మారే అవకాశం ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో దీర్ఘకాల ప్రభావం చూపే అంశంగా మారింది. ఇది బీఆర్ఎస్ నాయకత్వానికి పెద్ద సవాల్గా మారుతుందా? లేక కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఎదురుదెబ్బ అవుతుందా? అన్నది మరికొద్ది రోజుల్లోనైనా తేలుతుందా? చూడాలి మరి.

