“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తాయోయ్! అన్నాడు. అంతేగాక, “కార్మికలోకపు కళ్యాణానికి,. శ్రామిక లోకపు సౌభాగ్యానికి. సమర్పణంగా.. సమర్చనంగా.. త్రిలోకాలలో త్రికాలాలలో,. శ్రమైక జీవన సౌందర్యానికి. సమానమైనది లేనేలేదని ” శ్రీశ్రీ కీర్తించారు. కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి.. ఇవన్నీ శ్రమకు, శ్రామిక లోకానికి చిహ్నాలుగా, ఆ శ్రమయే సౌందర్యంగా ఆయన అభివర్ణించారు. శ్రమే సమాజ పురోగతికి మూలం కాగా, అదే శ్రమ దోపిడీకి గురవుతుండటం ఆందోళనకరం.
1886లో చికాగోలో జరిగిన హే మార్కెట్ సంఘటన ఒక కీలక మలుపు. రోజుకు 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన ఆందోళన రక్తపాతం దారితీసినా, అది ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కుల పోరాటానికి పునాది వేసింది. తరువాత 1889లో మే 1ను కార్మిక దినోత్సవంగా గుర్తించారు. భారతదేశంలో 1923లో మద్రాసులో మొదటిసారిగా మే డే జరుపుకోవడం కార్మిక చైతన్యానికి శ్రీకారం చుట్టింది.
భారతదేశంలో కార్మిక వర్గం విస్తృతమైంది. కేవలం కర్మాగార కార్మికులే కాదు, నిర్మాణ రంగం, వ్యవసాయం, రవాణా, సేవా రంగం, ఐటి రంగం ఇలా అన్ని రంగాల్లో పనిచేసేవారంతా కార్మికులే. దేశంలో 90% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అయితే, ఈ విభాగానికి సరైన చట్టపరమైన రక్షణ లేకపోవడం ప్రధాన సమస్య.
గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, లిబరలైజేషన్ విధానాల తర్వాత కార్మిక హక్కులు క్రమంగా బలహీనపడ్డాయి. 8 గంటల పనిదినం అనే ప్రాథమిక హక్కు ఉన్నప్పటికీ, అనేక రంగాల్లో కార్మికులు రోజుకు 10–12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఐటి రంగంలో ఈ పరిస్థితి తీవ్రమైంది. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఒత్తిడి, అనిశ్చితి యువతను మానసికంగా కూడా ప్రభావితం చేస్తున్నాయి.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాల విస్తరణతో శాశ్వత ఉద్యోగాలు తగ్గిపోయాయి. అనేక సంస్థల్లో 50% కంటే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. వీరికి పింఛన్, ఆరోగ్య భద్రత, ఇతర సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది.
మహిళా కార్మికుల పరిస్థితి మరింత ఆందోళనకరం. రాత్రి పూట పనిచేసే మహిళలకు సరైన భద్రత లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. పని గంటలు పెరగడం, ప్రయాణ భద్రత లేకపోవడం వంటి సమస్యలు వారిపై అదనపు భారం మోపుతున్నాయి.
విద్యా, వైద్య రంగాల్లో కూడా శ్రమదోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు రోజుకు 10–12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. అయినప్పటికీ, వారికి తగిన వేతనం లేదా భద్రత ఉండడం లేదు. పిల్లలపై కూడా అధిక ఒత్తిడి పెరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో మే 1ను కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, కార్మిక హక్కుల కోసం పోరాటానికి ప్రతీకగా నిలవాలి. 1916లో 8 గంటల పనిదినం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో హక్కులు సాధించబడ్డాయి. అయితే, అవే హక్కులు మళ్లీ ప్రమాదంలో పడుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో పాలకులు కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆరోగ్య భద్రత, పింఛన్, కనీస వేతనం, పని గంటల నియంత్రణ, ప్రతి కార్మికుడికి హక్కులుగా అమలు కావాలి. అసంఘటిత రంగానికి ప్రత్యేక చట్టాలు, అమలు వ్యవస్థలు అవసరం.
సమాజ పురోగతిని నిర్ణయించేది శ్రామిక వర్గమే. ఆ వర్గం బలహీనపడితే దేశ అభివృద్ధి అసాధ్యం. కాబట్టి, కార్మిక వర్గం సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మే డే స్ఫూర్తి ఇదే శ్రమకు గౌరవం, కార్మికుడికి న్యాయం.
ఇప్పటికైనా పాలకులు, సంస్థలు, సమాజం కలసి శ్రమదోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో, కష్టించి పనిచేసే చేతులు పిడికిళ్లుగా మారి ఉద్యమాల రూపంలో విస్ఫోటనం చెందడం అనివార్యం.

