సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా? ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నదా? ఇప్పటి డిజిటల్ యుగంలో ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నంబర్, ఒకే పాన్ కార్డు, ఒకే పాస్పోర్ట్ ఉంటున్నాయి. కానీ ఓటరు నమోదులో మాత్రం ఇంకా పాత పద్ధతులే కొనసాగుతున్నాయి. ఆధార్, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ఆధునిక విధానాలను సమగ్రంగా అనుసంధానం చేస్తే బోగస్ ఓట్ల సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు. సర్ ప్రక్రియపై అనుమానాలు, ఆరోపణలు సహజమే. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయగలిగితే భారత ప్రజాస్వామ్యం మరింత పటిష్టంగా మారుతుంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరించి, ఖచ్చితత్వాన్ని పెంచడానికి నిర్వహించే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్). మరణించిన, శాశ్వతంగా మారిపోయిన, డూప్లికేట్ ఓటర్ల పేర్లను తొలగించడం. అలాగే అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి, 2002 లేదా పాత ఓటరు జాబితాతో ప్రస్తుతం ఉన్న 2025/2026 జాబితాను మ్యాపింగ్ చేస్తారు. ఓటర్లు తమ ఆధార్ మరియు ఇతర వివరాలతో బీఎల్ఓలకు సహకరించి, తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవాలి. ఈ ప్రక్రియ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 2025-2026 కాలంలో కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభం కాకముందే రాజకీయ పార్టీల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ మినహా, కాంగ్రెస్, బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీలు తమ శ్రేణులను బూత్ స్థాయిలో అప్రమత్తం చేశాయి.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడం ఎంత ముఖ్యమో, ఓటరు జాబితాలు ఖచ్చితంగా ఉండటం కూడా అంతే అవసరం. అందుకే ఎన్నికల సంఘం కాలానుగుణంగా ఓటరు జాబితాలను సవరించే ప్రక్రియ చేపడుతూ వస్తోంది. ఇది కొత్తేమీ కాదు. 1951 నుంచి 2004 వరకు దేశవ్యాప్తంగా ఎనిమిది సార్లు ఇలాంటి ప్రత్యేక సవరణ కార్యక్రమాలు జరిగాయి. దాదాపు 21 ఏళ్ళ తర్వాత మళ్లీ పెద్ద ఎత్తున ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఇప్పటికే పలు రాష్ట్రల్లో పూర్తి చేసింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణాల వంతు వచ్చింది.
కొన్ని రాష్ట్రాల్లో లక్షలాది పేర్లు ఓటరు జాబితాల నుంచి తొలగించబడుతున్నాయన్న ఆరోపణలు రావడంతో రాజకీయం ఉద్రిక్తమైంది. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అలాంటి చర్యలను వ్యతిరేకించాలి. అదే సమయంలో బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు జాబితాల్లో కొనసాగడం, ఒకటికి మించి రాష్ట్రాల్లో ఓట్లు కలిగి ఉండటం కూడా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే అంశాలే. అందువల్ల ఓటరు జాబితాల ప్రక్షాళనను పూర్తిగా, గుడ్డిగా వ్యతిరేకించడం సమంజసం కాదు.
మన దేశంలో ఎన్నికల రాజకీయాలు ఓటర్ల జాబితాల చుట్టూనే తిరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం అనర్హులను ఓటర్లుగా చేర్చిన ఘటనలు ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు కూడా ఓటర్లయ్యారు. పశ్చిమ బెంగాల్లో లక్షల సంఖ్యలో అనుమానాస్పద నమోదులను గుర్తించారు. వారిని తొలగించారు.
ఇంకా ఒక కీలక సమస్య డబుల్ ఓట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు, తరువాత కూడా కొంతమంది రెండు రాష్ట్రాల్లో ఓటర్లుగా కొనసాగుతున్నారు. రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు వేసిన ఆరోపణలు కూడా వచ్చాయి. “ఒక వ్యక్తికి ఒకే ఓటు” అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాలంటే ఇలాంటి నమోదులను తప్పనిసరిగా తొలగించాల్సిందే.
అయితే ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా? ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నదా? ఇప్పటి డిజిటల్ యుగంలో ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నంబర్, ఒకే పాన్ కార్డు, ఒకే పాస్పోర్ట్ ఉంటున్నాయి. కానీ ఓటరు నమోదులో మాత్రం ఇంకా పాత పద్ధతులే కొనసాగుతున్నాయి. ఆధార్, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ఆధునిక విధానాలను సమగ్రంగా అనుసంధానం చేస్తే బోగస్ ఓట్ల సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు.
ఎన్నికల సంఘం ఓటర్లకు మరింత సౌకర్యవంతమైన వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది. చిరునామా మారినప్పుడు ఆన్లైన్లో సులభంగా వివరాలు సవరించుకునే అవకాశం కల్పించాలి. ఓటరు జీవించి ఉన్నాడని డిజిటల్ ధృవీకరణ చేసే విధానం రావాలి. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు ఆధార్తో అనుసంధానం చేసినట్లే, ఓటరు కార్డును కూడా ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేట్ నమోదులను అరికట్టవచ్చు.
భవిష్యత్తులో బయోమెట్రిక్ ఆధారిత ఓటింగ్ విధానం అమల్లోకి వస్తే ఎన్నికల పారదర్శకత మరింత బలోపేతం అవుతుంది. వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు ద్వారా ఓటు నమోదు జరిగితే నకిలీ ఓట్లకు పూర్తిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. అప్పుడు తరచూ భారీ ఎత్తున ఓటరు జాబితా ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.
ప్రస్తుతం రాజకీయ పార్టీల ప్రధాన బాధ్యత ప్రజల్లో అపోహలు సృష్టించడం కాదు, నివారించడం. అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడుతూ, అనర్హులను తొలగించడంలో ఎన్నికల సంఘానికి సహకరించాలి. రాజకీయ పార్టీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఓటరు జాబితాల సవరణ ఎన్నికల విశ్వసనీయతకు పునాది అనే విషయాన్ని గుర్తించాలి.
సర్ ప్రక్రియపై అనుమానాలు, ఆరోపణలు సహజమే. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం దానిని పూర్తిగా వ్యతిరేకించడం కంటే, పారదర్శకతను డిమాండ్ చేస్తూ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం అవసరం. ఆధునిక సాంకేతికత, ఖచ్చితమైన నమోదు విధానం, ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయగలిగితే భారత ప్రజాస్వామ్యం మరింత పటిష్టంగా మారుతుంది.

