తస్మాత్ జాగ్రత్త!
-హెచ్చరించిన అఖిల పక్షాలు
-వరంగల్ కూరగాయల మార్కెట్ లో ముమ్మరంగా సంతకాల సేకరణ
అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ కోసం లక్ష సంతకాల సేకరణలో భాగంగా గురువారం అఖిల పక్షం సారథ్యంలో లక్ష్మీపురంలోని వరంగల్ కూరగాయల మార్కెట్లో సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా సాగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తక్కెళ్లపల్లి రాజేశ్వర రావు, మిల్లు, వివిధ కార్మిక, ప్రజా సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. నేరుగా కూరగాయలు అమ్ముతున్న, ఇతర కార్మికుల వద్దకు వెళ్ళ విషయం చెప్పి, సంతకాలు సేకరించారు.

ఈ సందర్భంగా ప్రదీప్ రావు, తక్కెళ్లపల్లి రాజేశ్వర రావు, తదితర అఖిల పక్ష నేతలు మాట్లాడుతూ, 80 సంవత్సరాలుగా మిల్లు కార్మిక భవనం అనేక ఉద్యమాలకు సాక్షిగా నిలిచింది. వేలాది మంది కార్మికులకు నీడ నిచ్చింది. ఆదరించింది. అలాంటి భవనాన్ని కొందరు స్వార్థపరులు కబ్జాదారుల కు అప్పగించారు. అన్యాక్రాంతం చేశారు. గత ప్రభుత్వ హయాం లోనే ఆ భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి పరుల పాలు చేశారు. అదే మాయలో పడి, మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, బడా వ్యాపారవేత్త కలిసి ఆ భవనాన్ని కూల్చి కమర్షియల్ కాంప్లెక్స్ కు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ విషయమై ఇప్పటికే కార్మిక లోకం కన్నెర్ర చేసింది. భారతీయ జనతా పార్టీతో సహా అఖిలపక్ష నేతలతో కలిసి ఆ పనులను నిలిపివేసి అది కార్మికులకు చెందే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అది కమర్షియల్ కాంప్లెక్స్ అని నేను రాలేదు. ఏదో ఓ సిటీలో జరుగుతున్న భూమి పూజకు వచ్చానని మాయ మాటలు చెప్పి కొండా మురళి తప్పించుకోవాలని చూశాడు. తానెప్పుడూ కార్మికులకు అండగా ఉంటానని, తన సొంత డబ్బులతో మళ్లీ ఆ యొక్క కార్మిక భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చి నెల రోజులు పూర్తి అయినా పట్టించుకోవడం లేదు. పైగా కోర్టు నుంచి స్టే తెచ్చుకునే విధంగా బడా వ్యాపారవేత్తకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. కొండా మురళి… మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని వరంగల్ ప్రజానీకం గమనిస్తున్నది. ఆ కార్మిక భవన స్థలం జోలికి వెళ్లిన బిఆర్ఎస్ పార్టీకి వరంగల్ ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో, అదే గతి మీకు పడుతుంది. తస్మాత్ జాగ్రత్త! అని హెచ్చరించారు. కార్మిక భవన స్థలంలోనే కొత్త భవనం నిర్మించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకు ఎలాంటి త్యాగాలకైనా వెనుతిరగబోమని ఆయన చెప్పారు.

ఇప్పటికే లక్ష సంతకాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ కూరగాయల మార్కెట్లో చేపట్టే కార్యక్రమం మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చింది.

