రిజర్వేషన్లు లేని అన్ని స్థానాలను ఓసీలే ఎగరేసుకుపోతూ ఉంటే, సమాజంలో సమానత్వం, సమాన అవకాశాలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వెరసి ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేనట్లా? 10శాతం లేని ఓసీలు ఈబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లను వారం రోజుల్లోనే దక్కించుకున్నప్పుడు లేని రాజ్యాంగ సవరణకు వ్యతిరేకత, ఇప్పుడెందుకు? అప్పుడు సాధ్యమైన రాజ్యాంగ సవరణ ఇప్పుడెందుకు కాదు? ఒకవేల రాజ్యాంగ సవరణ ఆలస్యమైతే, ప్రస్తుత, రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని చోట్ల కూడా వారికి ఎక్కువ సంఖ్యలో ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా సమానత్వం సాధించవచ్చు కదా?
బీసీలను లేదా ఒక వర్గాన్ని రాజకీయాలకు, రాజకీయ పదవులకు దూరం చేయడం రాజకీయ పార్టీలకే మంచిది కాదు. ఆ వర్గాలే రేపు ఆయా రాజకీయ పార్టీల పునాదులను పెకిలించ గలవని గ్రహించాలి.
రాజకీయాల్లో, పార్టీల్లో, పదవులు ఇప్పటికీ ఒకటి రెండు పై వర్గాల చేతుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనిని మార్చకుండా, రాజకీయాల్లో సమానత, సమాన అవకాశాలు లేకుండా, మన రాజ్యాంగంలో మనమే రాసుకున్నట్లు దేశంలో, సమాజంలో సమానత్వం ఎలా సాధ్యం? మన ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తికి రాజకీయ సమాన అవకాశాలే అసలైన మార్గం. ఈ మార్గంలో మన రాజకీయ పార్టీలు పయనిస్తాయా? లేక పలాయనం చిత్తగిస్తాయా?
మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ తీవ్ర చర్చకు కేంద్ర బిందువైంది. రిజర్వేషన్లు 50శాతానికి మించరాదన్న రాజ్యాంగ నిబంధనకు లోబడి హైకోర్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను తిరస్కరించింది. సుప్రీం కోర్టు సమర్ధించింది. హైకోర్టు సూచన మేరకే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని కొన్ని పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. నిజానికి రిజర్వేషన్ల అమలు బాధ్యత రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంది. సమాజంలో బలహీన వర్గాల పేరుతో బలమైన వర్గాల మెజార్టీ ఓట్లతోనే ఎవరైనా గెలుస్తున్నారు. ఓడుతున్నారు. కానీ, వారిని గెలిపిస్తున్న బలమైన బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించడానికి మాత్రం అంగీకరించడం లేదు. రాజకీయ పార్టీల సంకల్పబలం లేకుండా రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి మన రాజ్యాంగంలో ఏమాత్రం కనిపించడం లేదు.
ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన రిజర్వేష్ల ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పిస్తున్నారు. లేకపోతే వారికావకాశాలు దక్కేవి కావు. జనాభాలో సామాజిక వర్గాలను పరిశీలిస్తే, బలహీన వర్గాలే బలమైన వర్గాలు. ప్రభుత్వాలు చూపిస్తున్న లెక్కలకు తక్కువగా కనీసం 42శాతం రిజర్వేషన్లకు కూడా అంగీకరించకుండా బీసీలను ఏవిధంగా అభివృద్ధి చేస్తారు? ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేష్లను బట్టి, రిజర్వేషన్లు ఉంటే తప్ప అవకాశాలివ్వరని తేలిపోయింది. ఎస్సీ, ఎస్టీ తప్ప రిజర్వేషన్లు లేని అన్ని స్థానాలను ఓసీలే ఎగరేసుకుపోతూ ఉంటే, సమాజంలో సమానత్వం, సమాన అవకాశాలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వెరసి ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేనట్లా? 10శాతం లేని ఓసీలు ఈబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లను వారం రోజుల్లోనే దక్కించుకున్నప్పుడు లేని రాజ్యాంగ సవరణకు వ్యతిరేకత, ఇప్పుడెందుకు? అప్పుడు సాధ్యమైన రాజ్యాంగ సవరణ ఇప్పుడెందుకు కాదు? ఒకవేల రాజ్యాంగ సవరణ ఆలస్యమైతే, ప్రస్తుత, రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని చోట్ల కూడా వారికి ఎక్కువ సంఖ్యలో ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా సమానత్వం సాధించవచ్చు కదా?
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, తటస్థులకు టిక్కెట్లు ఇచ్చి, వారిని ప్రజా ప్రతినిధులుగా నిలబెట్టారు. ఆ ప్రభంజనంలో కల్వకుర్తిలో ఎన్టీఆర్ సహా, ఎన్.జీ రంగా లాంటి మహామహులు కూడా ఓడిపోయారు. అందువల్లే ఆ రోజుల్లో కొత్తతరం రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకుంది. అది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు, బలహీన వర్గాల రాజకీయ ప్రస్థానానికి నాందీ పలికింది.
మండల్ కమిషన్ తీర్పు, ఇందిరా సహాని కేసు పరిణామాలు రిజర్వేషన్లపై స్పష్టతనిచ్చినా, వాస్తవిక రాజకీయాల్లో వాటి అమలు కష్టసాధ్యమే అయింది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ల అమలుకు అప్పటి సీఎం జయలలిత చేసిన కసరత్తు, రిజర్వేషన్ల పరిమితి, రాజ్యాంగ అనుకూలతల మధ్య పోరాటమే జరిగింది. ఇవన్నీ చట్టపరమైన ప్రయోగాలు. అయితే, అమలుకు సాధ్యం కాని సత్యదూరాలు మాత్రం కాదు. బీసీలను లేదా ఒక వర్గాన్ని రాజకీయాలకు, రాజకీయ పదవులకు దూరం చేయడం రాజకీయ పార్టీలకే మంచిది కాదు. ఆ వర్గాలే రేపు ఆయా రాజకీయ పార్టీల పునాదులను పెకిలించ గలవని గ్రహించాలి. ఇందుకు తెలంగాణ ఉద్యమం, తమిళనాట బీసీల ఆధిపత్యమే ప్రబలమైన ఉదాహరణలు.
ఇక సర్పంచ్ పదవి అనేది రాజకీయాలకు, రాజ్యాంగ పదవులకు తొలి మెట్టు. గ్రామాల ప్రగతే దేశ ప్రగతి కాబట్టి, దేశం లాగే, గ్రామాభివృద్ధి బాధ్యతను చేపట్టే పదవిగా ఎంతో ప్రాధాన్యతతో కూడింది. అందువల్ల రాజకీయ పార్టీలన్నీ సమాజంలో సంఖ్యా బలంగా ఉన్న సామాజిక వర్గాలకు, అందునా చదువుకున్న, నిజాయితీగల, సేవాతత్పరత ఉన్న అభ్యర్థులను నిలబెట్టాలి. రిజర్వేషన్ లేని గ్రామాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులను ప్రోత్సహించాలి. ఇలా చేస్తేనే ప్రజాస్వామ్యంలో పాతనీరు పోయి కొత్త నీరు వస్తుంది.
తెలంగాణ శాసనసభలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన అన్ని పార్టీలు, అదే స్పూర్తితో బీసీ అభ్యర్థులకు అవకాశాలిచ్చి, గెలిపించుకోవాలి. “సర్పంచ్లకు పార్టీ గుర్తు ఉండదు” అనే నెపంతో వారిని పక్కన పెట్టడం వల్ల అసెంబ్లీ తీర్మానాలకు కూడా విలువలేకుండా పోతుంది. రాజ్యాంగ స్ఫూర్తిపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఇప్పుడు కానిది ఎప్పుడూ కాదు కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పటి ఎన్నికల్లోనే తగిన నిర్ణయాలు తీసుకుంటే, భవిష్యత్తు రాజకీయ సామాజిక సమానత్వానికి పునాది పడుతుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలి. రాజకీయాల్లో, పార్టీల్లో, పదవులు ఇప్పటికీ ఒకటి రెండు పై వర్గాల చేతుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనిని మార్చకుండా, రాజకీయాల్లో సమానత, సమాన అవకాశాలు లేకుండా, మన రాజ్యాంగంలో మనమే రాసుకున్నట్లు దేశంలో, సమాజంలో సమానత్వం ఎలా సాధ్యం? మన ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తికి రాజకీయ సమాన అవకాశాలే అసలైన మార్గం. ఈ మార్గంలో మన రాజకీయ పార్టీలు పయనిస్తాయా? లేక పలాయనం చిత్తగిస్తాయా? ఈ పంచాయతీ ఎన్నికలే తేలుస్తాయి.

