అడుగు ఎక్స్ క్లూజివ్
కమలంలో కథనోత్సాహం-3
తెలంగాణ కమల కుతూహలం!
మలి ఉద్యమ తొలి నేపథ్యం!
రాష్ట్ర ఏర్పాటులో అతి కీలకం!
సహకరించినా సగటు శూన్యం!?
అనుకూలతలకు ఆమడ దూరం!?
ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందన్నట్లు.. ఒక రకంగా టీడీపీ పుట్టి, బీజేపీ ని చావు దెబ్బ కొట్టింది. అయితే ఆ టీడీపీతోనే బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సిరావడం విధి విపరీతం? 1980లో ఆవిర్భవించిన బీజేపీకి, 1984 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. వాజ్ పేయి, అద్వానీ లాంటి వాళ్ళంతా ఓడారు. కానీ, హనుమకొండలో కాంగ్రెస్ ని, బీజేపీ ఓడించింది. కాకలు తీరిన పీవీని జంగారెడ్డి ఓడించారు. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూలాలు వేళ్ళూనుకుంటున్న బీజేపీ పరిస్థితి మూలనపడ్డట్లయింది. ఆతర్వాత తెలంగాణ సస్యశ్యామల, గోదావరి జల సాధన యాత్రలు, ఒక ఓటు రెండు రాష్ట్రాల కాకినాడ తీర్మానం, తెలంగాణ ఉద్యమంలో జంతర్ మంతర్ ఆందోళనలు, రాజీనామాలు, ప్రధాన ప్రతిపక్షంగా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి పలికిన మద్దతులేవీ బీజేపీకి ప్రజల్లో తగినంత ఆదరణను తేలేకపోయాయి. తెలంగాణ తెచ్చిన, ఇచ్చిన క్రెడిట్లను బిఆర్ఎస్, కాంగ్రెస్ లు కొట్టేయగా, సహకరించిన సగటు మార్కులు కూడా బీజేపీ పొందలేకపోయింది. తెలంగాణకు ముందే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉన్న బీజేపీ ఇప్పుడు తెలంగాణలో పాగా వేయడానికి పరితపిస్తున్నది. పాట్లు పడుతున్నది. పరిపరి విధాలుగా విఫల యత్నాలు చేస్తున్నది.
హైదరాబాద్ నిజాం పాలనలో ఉన్నప్పటికీ, ఇక్కడ స్వాతంత్ర్యోద్యమం, సాయుధ పోరాట యుద్ధం జరిగిన చరిత్రతోపాటు స్వయం సేవక్ సంఘ్ పరివార్ కార్యకలాపాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. బీజేపీకి మూలం జనసంఘ్ అయితే, జనసంఘ్ కి మూలం ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ కి మూలం తెలంగాణ? అవును. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ కుటుంబం తెలంగాణకు చెందిందే. వారి పూర్వీకులది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి. హెడ్గేవార్ తండ్రి బలీరాంపంత్ ముత్తాత నరహరశాస్త్రి కందకుర్తి గ్రామం నుండి నాగపూరుకు వెళ్ళి స్థిరపడ్డాడు. ఇప్పటికీ కందకుర్తిలో వారి పూర్వీకులు ఉన్నారు. అయితే, ఆర్ఎస్ఎస్ కి రాజకీయ విభాగంగా ఉండే జనసంఘ్ నుంచి బిజెపి ఆవిర్భవించింది. మొదట్లో తెలంగాణలో ఆ పార్టీకి ప్రజల్లో తగిన గుర్తింపు, ఆదరణ ఉండేది. అందులో భాగంగానే 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆపార్టీకి చెందిన మహామహులు మట్టికరచినప్పటికీ, హనుమకొండ పార్లమెంటు స్థానంలో బీజేపీ గెలిచింది. సీనీ నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న స్థాపించిన టిడిపి , ఒక విధంగా బీజేపీకి మరణశాసనమయిందనే చెప్పాలి. ఎన్టీఆర్ సినీ ప్రభంజనం ముందు 40 ఏళ్ళ కాంగ్రెస్ ప్రాభవమే మట్టి కొట్టుకుపోయింది. ఆ ప్రభావం బీజేపీపై కూడా పడింది. అదే సమయంలో విద్యార్థి నేతలుగా ఉన్న తూళ్ళ దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాం లాంటి వాళ్లనేక మంది టిడిపిలో చేరారు. దీంతో బీజేపీ తన కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంత వైరుధ్యాల కారణంగా తనకు శాపంగా పరిణమించిన టీడీపీతోనే పొత్తు పెట్టుకునే స్థితికి చేరింది. పైగా సంప్రదాయ, ఒకటి రెండు సామాజిక వర్గాల పార్టీగా ముద్రపడి, ఫక్తు రాజకీయ పార్టీల పద్ధతులకు విరుద్ధంగా వ్యవహారశైలి ఉండటంతో అదో ప్రత్యేక పార్టీగా మిగిలిపోయింది.
అధికారానికి సరిపోని ప్రజాదరణ
మోడీ నాయకత్వంలోకి పార్టీ వచ్చాక, పార్టీలో వయోపరిమితిని విధించడం వల్ల కొత్త తరానికి అవకాశాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. బయటి పార్టీల నేతలను ఆకర్షించానికి, పార్టీ విస్తఈతిని పెంచి, ప్రజల్లోకి మరింతగా చొచ్చుకుపోవడానికి దారి దొరికింది. దీంతో కేంద్రంలో అధికారంలోకి రావడం, రాష్ట్రాలను గెలుస్తుండటం వల్ల తెలంగాణ లాంటి చోట్ల కూడా బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతూ వస్తున్నది. తెలంగాణ ఆవిర్భవించిన 2014 లో కేవలం 8.52% ఓట్లతో 1 ఎంపీ స్థానాన్ని గెలిచిన బీజేపీ, 2019 లో 19.65% ఓట్లతో 4 ఎంపీ స్థానాలు, 2024 లో 35.08% ఓట్లతో 8 ఎంపీ స్థానాలు గెలిచింది. అదే అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే, 2014 లో కేవలం 4.13% ఓట్లతో 5 ఎమ్మెల్యేలను గెలిచిన బీజేపీ, 2018 లో 6.98% ఓట్లతో 1 స్థానాన్ని, 2023 లో 13.90% ఓట్లతో 8 ఎమ్మెల్యేలను గెలిచింది. కానీ, ఇది అధికారం చేజిక్కుంచుకోవడానికి సరిపోయే స్థితిలో లేదు. అందుకే అన్ని విధాలుగా బీజేపీ విఫల యత్నాలు చేస్తూనే ఉంది.
మలిదళ తొలి ఉద్యమాలు బీజేపీవే
పార్టీల పరంగా చూస్తే తెలంగాణ మలి ఉద్యమానికి తొలి అడుగు ఒక రకంగా బిజెపి ద్వారానే పడింది. 1992లోనే గోదావరి, కఈష్ణా జీవనదుల మధ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో అప్పటి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి, ఇప్పటి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ సస్యశ్యామల యాత్ర జరిగింది. విద్యాసాగర్ రావు ఆధ్వ్యంలో గోదావరి జల సాధన యాత్ర కూడా జరిగింది. 1997లో కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాల కోసం బీజేపీ తీర్మానించింది. ప్రజల్లో తెలంగాణ కాంక్ష అంతర్లీనంగా ఉన్నప్పటికీ, అక్కడక్కడ తెలంగాణ ఉద్యమవేదికలు పని చేస్తున్నప్పటికీ, అప్పటికి జనసభ ప్రత్యేక తెలంగాణ పిలుపునందుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టనేలేదు. ఆరోజుల్లో గ్రామాలల్లో యాత్రలో పాల్గొన్న నేతలకు రక్తపు తిలకాలతో ప్రజలు స్వాగతాలు పలికారు. అయితే ఆ సమయంలో బీజేపీకి తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా ఉద్యమాలేవీ ఉవ్వెత్తున ఉధఈతంగా జరగలేదు. ఇలా ఒకరకంగా మలిదశ ఉద్యమాన్ని బీజేపీ శ్రేణులే ప్రారంభించాయి. కానీ, బీజేపీని మిగతా పార్టీలు తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాయి. ఆ వ్యతిరేకతను తిప్పి కొట్టే నాయకత్వం బీజేపీకి లేకుండా పోయింది.
మోడీ మాటలు మాసేదెలా?
మరోవైపు రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఆ పార్టీకి కొంత నష్టం కలిగించాయి. తల్లిని చంపి బిడ్డకు ప్రాణం పోశారని, తలుపులు వేసి చీకట్లో ప్రక్రియను ముగించారని మోడీ అనడం వివాదమైంది. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానించినట్లయింది. తెలంగాణ ప్రజల మొదళ్ళలోకి వెళ్ళిన మోడీ మాటలను ఏ స్థాయిలో మరిపించగలరు?
అనుకూలంశాలు
అయితే, ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి కలిసి వచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. టీడీపీ దాదాపు లేకపోవడం, కమ్యూనిస్టులు బాగా వెనుకబడటం, మావోయిస్టులు దాదాపు తెలంగాణలో కనుమరుగవడం, ఎంఐఎం పరిమితంగా ఉండటం వంటివి బాగా కలిసి వచ్చే అంశాలు. తెలంగాణలో బిఆర్ఎస్ ది కుటుంబ పాలన కావచ్చు. కాంగ్రెస్ కలహాల కాపురం కావచ్చు. ఈ రెండింటితోనూ ప్రజలు విసిగిపోవడమేగాక, కొత్త దనాన్ని, కొత్త తరాన్ని కోరుకుంటున్నారు. ఈ ప్రజా విరక్తిని, తమ పట్ల అనురక్తిగా ఏ మేరకు ఓట్లు చేసుకుంటారనేది బీజేపీ నాయకత్వమే ఆలోచించుకోవాలి.

