ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి స్థాపనకు చర్చలే మార్గమని అందరూ చెప్పినా, ఆచరణలో మాత్రం యుద్ధ వాతావరణం పెరుగుతుండటం విరుద్ధ ధోరణిగా కనిపిస్తోంది.
మొన్న జరిగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు దాదాపు 20 గంటలపాటు కొనసాగి, 80 శాతం ఏకాభిప్రాయం సాధించాయి. అయినప్పటికీ, యురేనియం శుద్ధి అంశం చివరికి ఒప్పందానికి అడ్డంకిగా మారింది. అమెరికా 20 ఏళ్లపాటు యురేనియం శుద్ధి నిలిపివేయాలని ప్రతిపాదించగా, ఇరాన్ ఐదేళ్లకు మాత్రమే అంగీకరించింది. ఈ చిన్న తేడా పెద్ద విభేదంగా మారి చర్చలు నిలిచిపోవడం దురదృష్టకరం. ఇది ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాస లోప తీవ్రతకు పరాకాష్ట.
1979 తర్వాత ఈ స్థాయిలో జరిగిన అత్యున్నత సమావేశం విఫలమవడం అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికగా చూడాలి. చర్చలు పూర్తిగా విరమించలేదన్న ఆశ ఉన్నప్పటికీ, ఈ విరామం యుద్ధ మేఘాలను మరింత గాఢం చేసే ప్రమాదం ఉంది. పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న రాజకీయ అస్థిరత ఈ పరిణామాలతో మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇది కేవలం ఆ రెండు దేశాల సమస్యగా మిగలడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చమురు ధరలు ఇప్పటికే బ్యారెల్కు 113 డాలర్లకు చేరాయి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే కాదు. అభివృద్ధి చెందిన దేశాలకూ భారంగా మారుతోంది. గల్ఫ్ ప్రాంతంలో ఉత్పత్తి తగ్గుదల పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం, ఇరాక్లో చమురు ఉత్పత్తి 61% తగ్గగా, కువైట్లో 53%, యూఏఈలో 44%, సౌదీ అరేబియాలో 23% తగ్గింది. మొత్తం ఉత్పత్తిలో సుమారు 27% క్షీణత నమోదవడం గమనార్హం.
ఇక చమురు సరఫరాలో కీలకమైన పైప్లైన్లు దెబ్బతినడంతో రోజువారీ సరఫరా 7 మిలియన్ బ్యారెల్ల నుంచి 7 లక్షల బ్యారెల్లకు పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ప్రభావం కేవలం ఇంధన ధరల పెరుగుదలకే పరిమితం కాదు. రవాణా, ఉత్పత్తి, వ్యవసాయం వంటి అనేక రంగాలపై దీని ప్రభావం పడుతుంది. చివరకు దీనిని భరించాల్సింది సాధారణ ప్రజలే.
హర్ముజ్ జలసంధి పరిస్థితి కూడా కీలకంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో ప్రధాన భాగం ఇక్కడి ద్వారా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే సరఫరా, రవాణా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కొన్ని దేశాలు ఇప్పటికే తమ నౌకా రవాణాను కొనసాగిస్తున్నాయని చెప్పినా, పరిస్థితి స్థిరంగా మారే వరకు అనిశ్చితి తొలగదు.
ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాల పాత్ర అత్యంత కీలకం. అయితే ఇప్పటివరకు పెద్దగా సమన్వయంతో కూడిన స్పందనలేవీ కనిపించడం లేదు. ప్రతి దేశం తమ స్వప్రయోజనాల దృష్ట్యా మౌనంగా ఉండటం సమస్యను మరింత పెంచుతోంది. ముఖ్యంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రభావవంతమైన దేశాలు మధ్యవర్తిత్వానికి సిద్ధపడటం, శాంతి చర్చలకు మద్దతుగా నిలవడం, ఇరు దేశాలను పూర్తిగా యుద్ధ విరమణకు ఒప్పించడం వంటివి చేయాలి.
ఈ పరిస్థితిలో యుద్ధోన్మాదానికి ముగింపు పలకడం ఆవశ్యం. ఎంతటి సమస్యకైనా బల ప్రదర్శనల కంటే చర్చలే శాశ్వత పరిష్కారం కాగలవు. ఇరాన్ భద్రతా ఆందోళనలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, అణు వ్యాప్తిని నియంత్రించాలన్న అంతర్జాతీయ సమాజం ఆందోళనను కూడా గుర్తించాలి. ఇరువైపులా కొంత రాజీ అవసరం.
అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి, మధ్యవర్తిత్వం చేపట్టాలి. చర్చలను పునఃప్రారంభించేందుకు అనుకూల వాతావరణం సృష్టించాలి. చమురు సరఫరా మార్గాలను భద్రపరచడం, ఉత్పత్తి పునరుద్ధరణకు సహకరించడం కూడా అత్యవసరం.
ప్రపంచం ఇప్పటికే కరోనా వంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో మరో పెద్ద యుద్ధం మానవాళికి మోయలేని భారం అవుతుంది. అందువల్ల రాజకీయ నాయకులు భావోద్వేగాలకు లోనవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. శాంతి కోసం చేసిన ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా మారుతుంది.
యుద్ధం ఎవరికి ప్రయోజనం చేకూర్చదు. తాత్కాలిక లాభాల కోసం తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక నష్టాలను మిగులుస్తాయి. అందుకే యుద్ధోన్మాద మత్తు దిగిపోయి, శాంతి చర్చల మార్గం వైపు అడుగులు వేస్తేనే ప్రపంచశాంతి సాధ్యమవుతుంది.

