(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు)

లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు.
1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age).
2) చారిత్రక సంధియుగం (Proto-historic Age)
3) చారిత్రక యుగం (Historic Age)
1) చారిత్రక పూర్వయుగం :- లిపి లేని కాలము మరియు చరిత్ర అధ్యయనం చేయలేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటారు.
2) చారిత్రక సంధియుగం :- లిపి వుండి, లిపిని చదవలేని కాలం (పురావస్తు ఆధారాలు).
3) చారిత్రక యుగం :- లిపి వుండి, చరిత్రను సాహిత్యం ద్వారా అధ్యయనం చేయగలకాలం.
చారిత్రక పూర్వయుగం మానవ ఆవిర్భావంతో మొదలై లిపి వాడుకలోకి వచ్చేంత వరకు కొనసాగింది. భారతదేశములో మానవ ఆవిర్భావం ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో చెప్పడం కష్టతరం. 14 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవుడు మహారాష్ట్రలోని బోరి గుహల్లో జీవించాడని ఆధారాలు లభ్యమయ్యాయి.
చారిత్రక పూర్వయుగానికి 4 ప్రధాన సంస్కృతులు ఉన్నాయి. అవి
1) ప్రాచీన శిలాయుగ సంస్కృతి/ Paleolithic Culture (ఆది నుండి క్రీ.పూ. 10,000 వరకు)
2) మధ్య శిలాయుగ సంస్కృతి/ Mesolithic Culture (క్రీ.పూ. 10,000 నుండి 5000 వరకు)
3) నవీన శిలాయుగ సంస్కృతి/Neolithic Culture (క్రీ.పూ. 6000 నుండి 1500 వరకు)
4) తామ్ర శిలాయుగ సంస్కృతి/Chalcolithic Culture (క్రీ.పూ. 3000 నుండి 700 వరకు)
1) ప్రాచీన శిలాయుగ సంస్కృతి:
✓ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన తొలి ప్రదేశము రాబర్ట్ బ్రూస్ ఫూటే 1863 లో పల్లవరములో కనుగొన్నాడు. ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన మానవుడు స్ఫటిక శిల అనే రాయితో అనేక పనిముట్లు తయారుచేశాడు.
✓ ప్రాచీన శిలాయుగ మానవుడు హోమోసెపియన్ జాతి కంటే ముందున్న జాతికి చెందినవాడు. రామపుతికాస్ జాతికి చెందిన మానవ అవశేషాలు శివాలిక్ ప్రాంతంలో లభించాయి.
✓ ప్రాచీన శిలాయుగ అంతంలో (క్రీ.పూ. 10,000) ఆధునిక మానవుడైన ‘హోమోసెపియన్’ ఆవిర్భవించాడు. ఇది లాటిన్ పదం. దీనికి అర్థం వివేకవంతుడు లేదా పరిజ్ఞానం కలిగిన మానవుడు.
✓ ఈ కాలంలోని మానవుడు జంతువులను వేటాడుతూ మరియు పండ్లు, కాయలు, ఆకులు సేకరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకునేవాడు. ప్రాచీన శిలాయుగంలో ప్రజలు చిన్న చిన్న గుంపులుగా జీవిస్తూ సంచార జీవితాన్ని గడిపేవారు.
✓ ప్రాచీన శిలాయుగం ప్లిస్టాసిస్ లేదా మంచుయుగానికి చెందినది. క్రీ.పూ 10,000 కాలంలో మంచుయుగం అంతమై హోలీసిన్ యుగం ప్రారంభమైంది. దీని ద్వారా జీవనానికి కావాల్సిన పరిస్థితులు అనుకూలించాయి.
2) మధ్య శిలాయుగ సంస్కృతి:
మధ్య శిలాయుగంలో మానవుని జీవితంలో అనేక మార్పులు సంభవించాయి. ఆలోచనా పరిజ్ఞానం కలిగిన హోమోసెపియన్ మానవుడు ఆవిర్భవించడం మరియు జంతుజాల, వృక్షజాల అభివృద్ధికి అనుకూలమైన హోలీసిన్ యుగం ప్రారంభం కావడంతో అనేక మార్పులు ఈ కాలములోనే సంభవించాయి.
✓ ఈ కాలంలోనే కృత్రిమ గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో కుండల తయారీ కూడా ప్రారంభమైంది. భారతదేశంలో తయారుచేసిన తొలి కుండలు ఉత్తరప్రదేశ్ లో బయటపడ్డాయి.
✓ పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ‘ క్వార్టజైట్’ శిలలతో వీరు పనిముట్లను తయారుచేసేవారు. మధ్య శిలాయుగంలో పనిముట్లు పరిమాణంలో చిన్నవిగా ఉండడంతో వీటిని సూక్ష్మ శిలలు అని పిలిచేవారు.
✓ పశు పోషణ ఈ కాలంలో ఇంకొక ప్రధానమైన పరిణామము. మధ్య శిలాయుగానికి చెందిన ‘బగోర్ ‘ లో పశుపోషణకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఇక్కడ ప్రజలు జంతువులను పోషించారు అని భావించవచ్చు. భారతదేశంలో ఇవే తొలి పశుపోషణకు సంబంధించిన ఆధారాలు.
3) నవీన శిలాయుగ సంస్కృతి:
ఈ యుగము భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వేరువేరు కాలాల్లో ప్రారంభమైంది. వాయువ్య భారతదేశంలో క్రీ.పూ. 7000, గంగా మైదాన ప్రాంతంలో క్రీ.పూ. 5000, దక్షిణ భారతదేశంలో క్రీ.పూ. 2000 లో నవీన శిలాయుగం ప్రారంభమైంది.
✓ ఇది భారతదేశంలో మధ్య శిలాయుగానికి మరియు తామ్ర శిలాయుగానికి మరియు సింధు నాగరికతలకు సమకాలీనంగా కొనసాగిందని భావించవచ్చు. ఈ కాలంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోవడంతో దీనిని నవీన శిలాయుగం అంటారు.
✓ మానవుడు ఈ కాలంలోనే వ్యవసాయాన్ని ప్రారంభించాడు. మానవుడు ఆహారాన్ని వేటాడే దశ నుండి ఉత్పత్తి చేసే దశకు ఈ కాలములోనే చేరుకున్నాడు.
✓ దీని వలన సంచార జీవితం అంతమై స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపాడు. గ్రామీణ వ్యవస్థలు ఈ కాలంలోనే ప్రారంభమయ్యాయి. నాగరికత ప్రారంభమవడానికి మార్గం సుగమమైంది. ఈ నవీన శిలాయుగం గురించి ‘సర్ జాన్ లుబ్బాక్ ‘ తను రాసిన “What Happened In History” అనే పుస్తకంలో పూర్తిగా ‘శిలాయుగ విప్లవం’ అని సంబోధించాడు.
నవీన శిలాయుగం నాటి కొన్ని ప్రధాన ప్రదేశాలు:
i) మెహర్ గర్: ఇది ప్రస్తుత పాకిస్తాన్ లో ఉంది. భారత ఉపఖండంలోనే వీరు తొలిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఇక్కడి ప్రజలు గోధుమలు, బార్లీ, పత్తిని పండించారు.
– ప్రపంచంలో పత్తిని పండించిన తొలి ప్రజలు వీరే అని భావించవచ్చు.
– తొలి కుమ్మరి చక్రం కూడా ఇక్కడే లభించింది. దీనితో పాటు చిరాండ్, దక్షిణ భారతదేశం, మహాగర, కొల్దీవ వంటి ప్రాంతాల్లో అవశేషాలు బయల్పడ్డాయి.
4) తామ్ర శిలాయుగ సంస్కృతి:
తామ్ర అనగా రాగి అని అర్థం. తామ్ర శిలాయుగం లోని మానవుడు శిలా పనిముట్లను మరియు రాగి పనిముట్లను వినియోగించడం ప్రారంభించాడు. మానవుడు మొదటిగా ఉపయోగించిన లోహం రాగి. అనేక లక్షల సంవత్సరాలు శిలాయుగంలో జీవించిన మానవుడు క్రమంగా లోహాలను వినియోగించడం నేర్చుకున్నాడు. శిలాయుగం నుండి లోహ యుగానికి మారడానికి మానవునికి లక్షల సంవత్సరాలు పట్టింది.
భారతదేశంలో లోహ యుగ సంస్కృతి బయల్పదిన ప్రాంతాలు:
i) మాల్వ సంస్కృతి: మధ్యప్రదేశ్ లోని మాల్వ ప్రాంతంలో లింగము, ఎద్దును పూజించడం మరియు యజ్ఞయాగాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి.
ii) అహర్ సంస్కృతి: రాజస్థాన్ లో మొట్టమొదటిసారిగా అహర్ సంస్కృతికి సంబంధించిన అవశేషాలు బయల్పడ్డాయి. రాజస్థాన్ లోని ఖేత్రి ప్రాంతంలో ఆ కాలంనాటి ప్రజలు రాగి నిక్షేపాలను వినియోగించారు మరియు కాల్చిన ఇటుకలను కూడా ఉపయోగించారు. వీటితో పాటు
జోర్వే, హస్తినాపూర్, గంగా-యమున ప్రాంతాల్లో కూడా ఈ సంస్కృతికి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి.
పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న చిత్రలేఖనాలలో మధ్యప్రదేశ్ లోని భీంభెట్కా గుహలలో ఉన్న చిత్రలేఖనాలు చారిత్రక పూర్వయుగానికి సంబంధించినవి. ఈ భీంభెట్కా గుహలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇక్కడ ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం మరియు తామ్ర శిలాయుగానికి సంబంధించిన చిత్రాలు లభించాయి. ఇందులో ఏనుగులు, పులులు, చిరుతలు, వాటిని వేటాడే మానవుల దృశ్యాలు అధికంగా ఉన్నాయి.
ఆ కాలంలో రకరకాల రంగురాళ్లను ఉపయోగించి పొడిగా మార్చి రంగును తయారుచేసి ఈ చిత్రాల్లో వాడారు. కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఈ రంగులు చెక్కుచెదరకుండా ఉన్నాయి.

-బానోత్ కళ్యాణ్

