ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం ఒకటి లేదా కొన్ని కుటుంబాల చేతుల్లోనే మిగిలిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని వదులుకుని కాంగ్రెస్లోనో, బీజేపీలోనో విలీనం అయితే ప్రజలకు అదనంగా ఒరిగేదేమైనా ఉంటుందా?
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్రపై మరోసారి చర్చ మొదలైంది. శివసేన -ఉద్ధవ్ వర్గం నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రస్థావనకు కారణమయ్యాయి. కాంగ్రెస్ నుంచి విడిపోయి ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు మళ్లీ కాంగ్రెస్లో విలీనం కావాలని, అప్పుడే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
భారతదేశం వంటి విభిన్న సామాజిక, భాషా, సాంస్కృతిక నేపథ్యం కలిగిన దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. స్వాతంత్ర్యం అనంతరం మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఏకపక్ష ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆ ఆధిపత్యానికి వ్యతిరేకంగా రాష్ట్రాల ప్రత్యేక ప్రయోజనాలను కాపాడేందుకు అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదం, పంజాబ్లో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి డిమాండ్లు ఇందుకు ఉదాహరణలు.
1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ రాజకీయాల చరిత్రలో ఒక మైలురాయి. కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఆధిపత్యానికి సవాల్ విసిరింది. ఇదే తరహాలో తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీలు తమ రాష్ట్రాల్లో బలమైన రాజకీయ శక్తులుగా ఎదిగాయి.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎంత ఉందో గణాంకాలే చెబుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కలిపి 65 శాతం స్థానాలు గెలుచుకున్నప్పటికీ, మిగిలిన 35 శాతం స్థానాలు ప్రాంతీయ పార్టీల ఖాతాలోకి వెళ్లాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ప్రధాన రాజకీయ శక్తులుగా ఉన్నాయి. కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినా ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకంగా మారుతోంది.
అయితే, ప్రాంతీయ పార్టీల బలహీనతలకు కూడా కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది కుటుంబ రాజకీయాలు. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే, బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీలపై కుటుంబ ఆధిపత్య ఆరోపణలు మామూలే. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకత్వ మార్పిడి సహజ ప్రక్రియ. కానీ ఒకే కుటుంబం చుట్టూ పార్టీ తిరుగుతుంటే కొత్త నాయకత్వం ఎదగడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఫలితంగా ప్రజల్లో నిరాశ పెరుగుతుంది.
ఇటీవలి ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ఒడిశాలో 24 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ పరాజయం పాలైంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించకపోతే ఎంత బలమైన పార్టీ అయినా వెనుకబడుతుందనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే, ఈ పరిస్థితులను చూసి ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? కాంగ్రెస్ కూడా ప్రస్తుతం కుటుంబ ఆధారిత రాజకీయాలను నెరపుతోందనే విమర్శలను ఎదుర్కొంటున్నది. అక్కడ నిర్ణయాధికారం కొద్దిమంది నాయకుల చేతుల్లోనే కేంద్రీకృతమైందనే విమర్శలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని వదులుకుని కాంగ్రెస్లోనో, బీజేపీలోనో విలీనం అయితే ప్రజలకు అదనంగా ఒరిగేదేమీ ఉండదు.
నిజానికి ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడున్న సవాల్ బీజేపీ లేదా కాంగ్రెస్తో పోటీ కాదు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే. రాష్ట్రాల అభివృద్ధి, ఉపాధి కల్పన, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ఆ పార్టీలు ప్రజల్లోకి వెళ్ళాలి. కుల, మత, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి రాజకీయాలను ప్రోత్సహించాలి.
ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం కూడా అవసరం. తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే దేశ అభివృద్ధిపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ఆర్థిక వికేంద్రీకరణ, సమాఖ్య వ్యవస్థ బలోపేతం వంటి అంశాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. అప్పుడే అవి నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా ఎదగగలవు.
ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఎంత అవసరమో, బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులు కూడా అంతే అవసరం. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు చెక్ పెట్టగల సామర్థ్యం ప్రాంతీయ పార్టీలకే ఉంది. అయితే అందుకు అవి తమ అంతర్గత బలహీనతలను అధిగమించి ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలి. రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రబిందువుగా చేసుకుని ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో తమ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకోగలవు. లేకపోతే ప్రజలే వాటిని రాజకీయ చరిత్రలో కలిపేస్తారు.

