ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని స్థిరంగా బలోపేతం చేసుకునే అవకాశంగా ఉపయోగించుకోవాలి. ఆహార ధాన్యాలు, పప్పులు, నూనె గింజల విషయంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ, దిగుమతులను తగ్గించుకునే దిశగా ఆలోచన చేయాలి.
ఇటీవలి కాలంలో భారత్ పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించింది. అయినప్పటికీ రైతులకు తగిన మద్దతు లభించడం లేదు. కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఆ ధరకు పంటలను కొనుగోలు చేసే వ్యవస్థ సరిగా లేదు. ఫలితంగా రైతులు తమ పంటలను తక్కువ ధరలకు మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో శనగ, మక్కజొన్న పంటలకు డిమాండ్ తగ్గింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనగ పంటను నిల్వ ఉంచుకున్న రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తుండగా, అప్పులు తీర్చాల్సిన ఒత్తిడితో కొంతమంది రైతులు తక్కువ ధరలకు పంటలను తెగనమ్ముకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ సంస్థల పాత్ర కీలకం. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పండుతున్న కందులు, శనగలు, పెసలు, మక్కజొన్న వంటి 25 రకాల పంటలను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. దేశంలోని 24 వేల స్థానిక మార్కెట్లు, 125 ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ల నిర్వహణలో కూడా స్పష్టమైన ప్రణాళిక లేదు. నిజానికి రైతుల నుంచి పంటలను సక్రమంగా సేకరించి, ప్రజలకు ఆహార ధాన్యాల రూపంలో సరఫరా చేసే వ్యవస్థ బలహీనమైంది.
దిగుమతుల విధానం కూడా రైతులకు ప్రతికూలంగానే ఉంది. దేశంలో పప్పులు, నూనె గింజలు పండుతున్నప్పటికీ, భారీగా దిగుమతులు కొనసాగుతుండటం రైతులకు నష్టం కలిగిస్తోంది. దిగుమతులు పెరగడం వల్ల దేశీయ మార్కెట్లో ధరలు పడిపోతాయి. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతుంది. దేశీయ ఉత్పత్తి తగిన స్థాయిలో ఉన్నప్పుడు పప్పులు, నూనెల దిగుమతులపై తాత్కాలిక నియంత్రణ విధించాల్సిన అవసరం ఉంది.
వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చాలా తక్కువ. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రూ.60 వేల కోట్ల వరకు ఖర్చే చేయలేదు. ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం కూడా ఆందోళనకరం. ధరల నియంత్రణకు తగిన వ్యవస్థే లేకపోవడం వల్ల రైతులకు తగిన ధరలు అందకపోగా, వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రైతులు కంపెనీల నుంచి కొనుగోలు చేసే విత్తనాలు సరిగ్గా మొలకెత్తకపోయినా, తగిన దిగుబడి ఇవ్వకపోయినా రైతులకు నష్టపరిహారం అందడం లేదు. 2001 విత్తన చట్టం ప్రకారం విత్తనాల నాణ్యత లోపిస్తే కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొత్త విధానాల్లో కంపెనీలపై చర్యలు బలహీనంగా ఉండటం వల్ల రైతులే నష్టాన్ని భరించాల్సి వస్తోంది.
పంటల బీమా పథకాల అమలులో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి ఏడాది పంట బీమా కోసం రూ.15 వేల కోట్ల వరకు నిధులు కేటాయించినప్పటికీ రైతులకు అందుతున్న ప్రయోజనం పరిమితంగానే ఉంది. పెద్ద మొత్తంలో నిధులు బీమా కంపెనీలకే లాభంగా మారుతున్నాయయి. వాతావరణ సమాచారం, పంట అంచనాల విషయంలో కూడా ప్రైవేటు కంపెనీల డేటాపైనే ఆధారపడటం మరో సమస్యగా మారింది.
వ్యవసాయంలో వినియోగించే పురుగు మందుల ధరల నియంత్రణలో లేవు. అధిక ధరలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ నియంత్రణలో లోపాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో దేశానికి అవసరమైంది సమగ్ర వ్యవసాయ విధానం. దేశీయంగా పండుతున్న పంటలకు సరైన ధరలు ఇవ్వడం, రైతుల నుంచి పంటలను సమర్థవంతంగా కొనుగోలు చేయడం, ప్రజలకు సరసమైన ధరలకు ఆహార ధాన్యాలను అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దిగుమతులు, ఎగుమతుల విషయంలో కూడా దేశీయ ఉత్పత్తి ప్రయోజనాలను కాపాడే విధంగా విధానాలు అవలంబించాలి.
దేశం ఆర్థికంగా బలపడాలంటే వ్యవసాయ రంగం బలంగా ఉండాలి. రైతు ఆనందంగా ఉంటేనే ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతాయి. అందుకే ఇప్పుడే సమగ్ర వ్యవసాయ విధానంపై విస్తృత చర్చ జరిపి, రైతు ప్రయోజనాలను కాపాడే దిశగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

