వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి మారాలి. వాతావరణ మార్పుల సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణ, నీటి వినియోగ ప్రణాళిక, మార్కెట్ ఆధారిత సాగు విధానాలను ప్రభుత్వాలు అమలు చేయాలి. రైతుకు ముందస్తు భరోసా, పంటకు గిట్టుబాటు ధర, పెట్టుబడికి రక్షణ కల్పించినప్పుడే సాగు రంగం స్థిరంగా సాగుతుంది. ఇందుకు తగ్గట్లుగా వ్యవహరించే చిత్త శుద్ధి ప్రభుత్వాలకు ఉందా?
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న వేళ రైతాంగం మరోసారి అనిశ్చితి, ఆందోళనల మధ్యే సాగుకు సమాయత్తమవుతోంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, మరోవైపు ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ స్థాయికంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు స్పష్టమైన పంట ప్రణాళికలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, మార్కెట్ భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు మాత్రం గతంలాగే నిమ్మకు నీరెత్తినట్లే కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 1.8 కోట్ల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరుగుతుంది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 65 శాతం ఈ సీజన్పైనే ఆధారపడి ఉంటుంది. అయితే, ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలి? నీటి లభ్యత ఎంత ఉంది? వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు ఏమిటి? వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ మార్గదర్శకత్వం ఇప్పటికీ అందడం లేదు. భూసార పరీక్షలు, భూవినియోగ ప్రణాళికలు, మార్కెట్ డిమాండ్ ఆధారిత సాగు వంటి అంశాలు ప్రభుత్వ నివేదికలకే పరిమితమవుతున్నాయి.
గత ఖరీఫ్లో తెలంగాణలో 1.3 కోట్ల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 90 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అయితే వర్షాభావం, అకాల వర్షాలు, తుపాన్లు, డ్రై స్పెల్ కారణంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అనేక జిల్లాల్లో దిగుబడులు 15 నుంచి 30 శాతం వరకు తగ్గినట్లు వ్యవసాయ వర్గాల అంచనా. అయినప్పటికీ రైతులకు తగిన పరిహారం, బీమా చెల్లింపులు, ఇన్పుట్ సబ్సిడీలు సమయానికి అందలేదు.
వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణాల్లో విత్తనాలు, ఎరువుల లభ్యత కూడా ఒకటి. రైతులకు అవసరమైన మొత్తం విత్తనాల్లో ప్రభుత్వాలు రాయితీపై అందించేవి సగటున 25 నుంచి 30 శాతం మాత్రమే. మిగిలిన అవసరాల కోసం రైతులు ప్రైవేట్ మార్కెట్ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వేరుశనగ, కంది, పెసర, మినుము విత్తనాల సరఫరా తరచూ ఆలస్యమవుతుండగా, తెలంగాణలోనూ డిమాండ్కు తగ్గట్టుగా పంపిణీ జరగడం లేదు. రాయితీ విత్తనాల పేరుతో బహిరంగ మార్కెట్ ధరలకే విక్రయించడం మరో విరుద్ధ విచిత్ర పరిస్థితి.
ఎరువుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దేశంలో ఏడాదికి 350 లక్షల టన్నుల యూరియా వినియోగం జరుగుతుండగా, రైతుల అవసరాల సమయంలో సరఫరాలో అంతరాయాలు తరచూ కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా యూరియా, డీఏపీ కొరత కారణంగా రైతులు రోజుల తరబడి ఎరువుల దుకాణాల ముందు క్యూల్లో నిలబడాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదే సమయంలో డీజిల్, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడంతో సాగు వ్యయం గణనీయంగా పెరిగింది. ఎకరానికి వరి సాగు ఖర్చు ప్రస్తుతం రూ.35 వేల నుంచి రూ.45 వేల మధ్యకు చేరిందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
ఉత్పత్తి మాత్రమే కాదు, మార్కెటింగ్ కూడా రైతుకు పెద్ద సమస్యగా మారింది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ అనేక పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. తెలంగాణలో మక్కజొన్న, జొన్న రైతులు తీవ్ర నష్టాలను చవిచూడగా, ఆంధ్రప్రదేశ్లో పప్పుధాన్యాలు, వేరుశనగ రైతులు ధరల పతనంతో ఇబ్బందులు పడ్డారు. కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ సమర్థవంతమైన కొనుగోలు వ్యవస్థ లేకపోవడంతో రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోతున్నారు.
కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రాష్ట్రాల్లో లక్షలాది మంది కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నప్పటికీ వారిలో ఎక్కువ మందికి గుర్తింపు కార్డులు లేవు. ఫలితంగా రుణాలు, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడం లేదు. వ్యవసాయ రంగంలో అత్యంత కీలక వర్గమైన కౌలు రైతుల సమస్యలను పరిష్కరించకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం సాధ్యం కాదు.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఎనిమిది రకాల నాణ్యమైన వరి వంగడాలను ప్రోత్సహించాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ చర్య. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో డిమాండ్ ఉన్న సన్న రకాల బియ్యం సాగును పెంచితే రైతులకు మద్దతు ధర కంటే అధిక ఆదాయం లభించే అవకాశం ఉంది. అయితే నిర్ణయాలు కేబినెట్ సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలుకావాలి. రైతులకు తగిన విత్తనాలు, సాంకేతిక సలహాలు, కొనుగోలు హామీలు కల్పించినప్పుడే ఫలితాలు కనిపిస్తాయి.
వ్యవసాయం కేవలం వర్షాలపై ఆధారపడే రంగం కాదు. అది శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి మారాలి. వాతావరణ మార్పుల సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణ, నీటి వినియోగ ప్రణాళిక, మార్కెట్ ఆధారిత సాగు విధానాలను ప్రభుత్వాలు అమలు చేయాలి. రైతుకు ముందస్తు భరోసా, పంటకు గిట్టుబాటు ధర, పెట్టుబడికి రక్షణ కల్పించినప్పుడే సాగు రంగం స్థిరంగా సాగుతుంది. ఇందుకు తగ్గట్లుగా వ్యవహరించే చిత్త శుద్ధి ప్రభుత్వాలకు ఉందా?

