చిరకాల మితృత్వానికి ప్రతీక
కుటుంబంతో కలిసి పంచుకున్న ఙ్ఞాపకాలు
PADMA SHREE|పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు సత్కారం
‘అడుగు’ |ADUGU అభివృద్ధి చెందాలని ఆశీర్వాదం
అవును అతడు దళిత దీన జనోద్ధారకుడు. ఆపన్నుల హస్తం, పేదల పెన్నిధి. దళితుల గుండె చప్పుడు. ఉద్యమాలకు ఊపిరి, అసాధ్యాలకు సుసాధ్యమైన సారథి. ఎమ్మార్పీఎస్ రథసారథి. ప్రధాని మనసు దోచి, వర్గీకరణ బిల్లుకు ఎస్ అనిపించిన కార్యసాధకుడు. పద్మశ్రీని వరింప చేసుకున్న వరదాత. అతడెవరో కాదు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ.
పాలకుర్తి, ఆగస్టు 12 (అడుగు న్యూస్):
మందకృష్ణ మంగళవారం ఒక కార్యక్రమంలో భాగంగా పాలకుర్తికి వచ్చారు. ఈ సందర్భంగా పాలకుర్తిలోనే ఉన్నాడని తెలిసి తన చిరకాల మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, ప్రజా సంబంధాల నిపుణుడు, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళారు. అక్కడ వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. తేనీరు సేవించారు.

ఈ సందర్భంగా ఆనాటి తన ఉద్యమ ప్రస్థానంలోని కొన్ని ఘట్టాలను మార్గంతో పంచుకున్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడుగా మంద కృష్ణ, జర్నలిస్టు ఉద్యమకారుడిగా మార్గంలకు, వృత్తి రీత్యా ఎదురైనప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా వరంగల్ ఎస్సీ రిజర్వు కావడానికి అగ్రకులాలను ఎదురించిన సందర్భాలను మననం చేసుకున్నారు. ఉద్యమాలు, ఉద్యోగాల కారణంగా కొంత కాలంగా కలుసుకోలేకపోయిన వారు కలిసి గత జ్ఞాపకాలను కలబోసుకున్నారు. అనుబంధాన్ని పంచుకున్నారు.

మార్గం అడుగు డిజిటల్ మీడియా ఏర్పాటు చేశారని తెలుసుకొని అడుగు వార్తాపత్రికను, డిజిటల్ మీడియా వెబ్ సైట్ ని చూసి ప్రత్యేకంగా అభినందించారు. పాఠాలు రాసి, బోధన చేసి ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేసిన మార్గం ఆ అనుభవంతో డిజిటల్ మీడియాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డిజిటల్ మీడియా దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అడుగు డిజిటల్ మీడియా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మార్గం కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడిపారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా మంద కృష్ణ ను మార్గం కుటుంబం శాలువాతో సత్కరించింది.

ఈ సందర్భంగా మార్గం కుటుంబ సభ్యులు మార్గం సతీమణి రమ, కుమారుడు సాయి సందీప్ తేజ, కూతురు సాత్విక, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు లెనిన్, చెరిపెల్లి అశోక్, ప్రముఖ వాస్తు, హస్త సాముద్రిక, జోతిష్య శాస్త్ర నిపుణులు మద్దికుంట్ల సోమయ్య, అందె రవి, గాదెపాక సెక్రటరీ యాకయ్య, కోతి సుధాకర్, ఎమ్మార్పీఎస్ నాయకులు, వికలాంగులు, అభిమానులు, తదితరులు ఉన్నారు.


