కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానించింది. ఇది ప్రభుత్వం తీసుకున్న తెలివైన నిర్ణయంగా కనిపిస్తోంది. అటు రాజకీయ లబ్ధి, ఇటు కాగల కార్యాన్ని ఒడుపుగా జరిపించే నిర్ణయంగా భావించాలి. నేనుగా ప్రభుత్వం చేస్తున్నట్లుగా కాకుండా, దర్యాప్తు సంస్థల ద్వారానే కానించేయడంగా అనిపిస్తోంది. ఆలస్యంగా అయినా అవినీతిపై చర్యలకు సర్కార్ పూనుకున్నట్లయింది. నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలపై కూడా విశ్వాసం సన్నగిల్లుతోన్న ఈ దశలో ఈ నిర్ణయం ఫలితం ఏ విధంగా ఉండనుందనేది ఆకస్తిగా మారింది. ఏపీలో వైఎస్ వివేకా హత్య కేసు, ఐదేళ్లుగా దర్యాప్తు దశలోనే ఉంది. జగన్ అవినీతి వ్యవహారాల్లో కూడా ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇలా తేలని కేసులు, దర్యాప్తుదశలోనే జైలుకు వెళ్ళిన నిందితులు, రకరకాల స్థాయిల్లో పెండింగులోనే ఉన్నాయి.
నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ లు ఎందుకు అప్పుల్లో కూరుకు పోయాయో ఇప్పుడు అర్థమవుతున్నది. ప్రభుత్వాలపై ఎప్పటికప్పుడు కాగ్ నివేదికలు వస్తున్నా, వాటిపైగానీ, రాజకీయ అవినీతి ఆరోపణలపై విచారణలు సహజంగానే ఆలస్యంగా కొనసాగుతూ వస్తున్నాయి. పాలకులైతే చాలు, ఏమైనా చేయొచ్చనే దీమాను ప్రశ్నించే స్థాయిలో మన చట్టాలు, దర్యాప్తు సంస్థలు ఉన్నాయా? అన్నది స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళకు కూడా అనుమానంగానే ఉండటం మన దేశ ప్రజల దౌర్భాగ్యం. కమిషన్లు, సిట్ లు, దర్యాప్తు సంస్థలు ఇలా ఏయే విచారణలైప్పటికీ అవినీతి పాలకులకు ఏదో ఓ దారి దొరుకుతూనే ఉంది. జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట, బయట ఉండాల్సిన వాళ్ళు జైళ్ళల్లో మగ్గుతుండటం నయా ప్రజాస్వామ్య కొత్త రూపంగా తోస్తున్నది.
దర్యాప్తు సంస్థలకు దీటుగా గతంలో లోక్ పాల్, లోకాయుక్త వ్యవస్థలు ఉండేవి. రిటైర్డ్ జడ్జీలు వాటికి చైర్మన్లుగా ఉండేవారు. కేవలం రాజకీయ అవినీతి, పాలకులకు సంబంధించిన కేసులను వీరు విచారించేవారు. రాజకీయావసరాల కోసమే కొందరు నేతలు వాటిని నిర్వీర్యం చేశారు. వాటిని మరోసారి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
దేశంలో రాజకీయ అవినీతి బాగా వేళ్లూను కుంది. రాజకీయ నాయకులు పాలనను పక్కన పెట్టి అవినీతిలో మునిగి తేలుతున్నారు. ఒక్కసారి అధికారం వస్తే చాలు, తరతరాలకు తరగని ఆస్తులను మూటగట్టుకుంటున్నారు. పార్టీ ఏదైనా రాజకీయ నేతల పనంతా ఇదే అన్నట్లుగా ప్రస్తుత రాజకీయ, పరిపాలనా పద్ధతులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉండాల్సిందే. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో నిబద్ధతను చాటుకుని సర్వ స్వతంత్ర న్యాయ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలి. కేవలం రాజకీయ అవినీతిని విచారించేందుకు దీని అవసరం చాలావుంది.
కాళేశ్వరం నిర్మాణమే పెద్ద డొల్లని, అది కేవలం కమీషన్ల కోసం, కేసీఆర్ తన ఎర్రవల్లి ఎస్టేటు పొలాలను పారించుకునేందుకు నీటిని మళ్ళించిన కట్టడంగా తప్ప, ప్రజలకు ఉపయోగపడే కట్టడం కాదని మరోసారి తేలింది. నిపుణుల సూచనలు బేఖాతర్ చేస్తూ, అవినీతి కట్టడంగా, నియమనిబంధనలు పాటించకుండా, డీపీఆర్ ను కేంద్రానికి ఇవ్వకుండా, కేంద్రం నిధులే రాకుండా, ఏక పక్షంగా కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఓ కుటుంబం కమీషన్ కాసులకు కక్కుర్తిపడి కట్టిన కట్టడండా ఆ ప్రాజెక్టుపై సీఎం విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరైంది కాదని రిపోర్టులున్నాయని, తర్వాత కమిషన్ విచారణలోనే ఇదే తేలిందని సీఎం నిండు అసెంబ్లీ సభలో స్పష్టం చేశారు. అసెంబ్లీ కూడా అవినీతి జరిగిందని, సీబీఐ దర్యాపు జరపాలని తీర్మానించింది. పీసీ ఘోష్ కమిషన్ తేల్చేసింది తప్పైతే, కేసీఆర్ నిజాయితీ పరుడైతే కాళ్వేరం కమిషన్ను వ్యతిరేకించరు. హైకోర్టుకు వెళ్లి కమిషన్ను రద్దు చేయమని కోరరు. ఒకవేళ విచారణ జరిపినా దాన్ని సభలో పెట్టొద్దని, పెట్టినా చర్యలు తీసుకోవద్దని అభ్యర్థించరు. ఆందోళనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునివవ్వరు. ఇదీ అందరికీ అర్థమవుతున్న వాస్తవమే.
దాదాపు పదేళ్లు పాలించిన కేసీఆర్ కుటుంబం తెలంగాణను అప్పులకుప్పగా చేసినది కూడా నిజమేనని సీఎం పదే పదే అసెంబ్లీలోనే చెబుతున్నారు. శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సీఎం రేవంత్రెడ్డి సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయించడం ఒక విధంగా మంచిదే. ప్రభుత్వం, సీఎం ఏకపక్షంగా, కక్షపూరితంగా వ్యవహించే అవకాశం లేకుండా చేశారనుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ భాగస్వామ్యమై ఉన్నాయని.. అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్రెడ్డి చెప్పారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్నవారిని శిక్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటివరకు నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్… గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుపట్టాయి. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శషభిషలకు తావు లేకుండా కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75 శాతం నిధులిచ్చే నిబంధన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించింది. ఆ జాబితాలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కూడా ఉంది. ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చడం తోనే అవినీతికి తెరలేపారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాష్టాన్రికి గుదిబండగా మార్చిన కేసీఆర్, హరీశ్రావులే కాదు, ఇందులో భాగస్వామ్యం ఉన్న ఈటల, తుమ్మల, ఐఎఎస్ లు, అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కేబినెట్ లో మంత్రులుగా ఉన్నవాళ్ళంతా శిక్షార్హులే.
రాజకీయ నాయకులు తమ ఇష్టాను సారం డబ్బులు వెనకేసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం గురించి ఎన్డీఎస్ఏ ఎప్పుడో తేల్చిచెప్పింది. ఎన్డీఎస్ఏ నివేదికను ఎన్డీయే రిపోర్టని బీఆర్ఎస్ ఆనాడు ఎదురుదాడికి దిగింది. అలాగే పీసీ ఘోష్ కమిషన్ ను పీసీసీ కమిషన్ గా దాడి చేసింది. ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతోంది.
మొత్తంగా గోదావరిలో సభలో సీఎం చెప్పినట్లు రూ.లక్షన్నర కోట్లు కొట్టుకుపోయాయి. అప్పు, దానికి వడ్డీ మిగిలింది. దాన్ని కట్టే బాధ్యత ప్రజలపై పడింది. విచారణను అడ్డుకుంటున్న తీరు, బీఆర్ఎస్ అవినీతిని తేటతెల్లం చేస్తోంది. ఇందుకు బాధ్యులైన నేతలను, అందుకు సహకరించిన అధికారలును జైళ్లల్లో వేయాలి. ఈ కేసులను త్వరగా తేల్చి సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలి.
అవినీతిపై నిజానిజాల నిగ్గు తేల్చాల్సిందే!|EDITORIAL

