ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వన్యప్రాణులు గ్రామాలు, పట్టణాలలో సంచరించడం ఆందోళనకరంగా మారింది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, ఏనుగులు, కోతుల దాడులు కూడా పెరిగిపోతున్నాయి. వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడానికి ప్రధాన కారణం అడవులు అంతరించిపోతుండటం. దశాబ్దాలుగా అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడం, ఖనిజాల తవ్వకం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు, రైలు మార్గాల విస్తరణ, రియల్ ఎస్టేట్ విస్తరణ వంటి చర్యలు సహజ జీవావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఒకప్పుడు విస్తారంగా ఉన్న అడవులు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి జంతువుల సంచార మార్గాలను మూసేశాయి. ఫలితంగా ఆహారం, నీరు దొరకక వన్యప్రాణులు గ్రామాల వైపు మళ్లుతున్నాయి.
ఇది మనిషి–వన్యప్రాణి సంఘర్షణ. ఒకవైపు గ్రామీణులు భయంతో జీవిస్తుండగా, మరోవైపు నిరపరాధ వన్యప్రాణులు కూడా హింసకు గురవుతున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన సమాజం, దానిని నిర్వీర్యం చేస్తుండటం అత్యంత బాధాకరం.
ప్రకృతి సమతౌల్యంలో అడవులు కీలకం. అడవులు వర్షపాతం నియంత్రణకు, భూగర్భజలాల పరిరక్షణకు, వాతావరణ సమతుల్యతకు, అనేక జీవజాతుల సంరక్షణకు ఆధారం. అడవులు తగ్గితే వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతాయి. వరదలు, కరువులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి సమస్యలు పెరుగుతాయి. గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం కూడా అదే గొలుసు కట్టులోని ఒక దుష్పరిణామం.
వన్యప్రాణులను శత్రువులుగా కాకుండా జీవవ్యవస్థలో భాగస్వాములుగా చూడాలి. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, జంతువులను హింసించకుండా అటవీశాఖకు సమాచారం అందించే విధానం అలవాటు చేయాలి. సోలార్ ఫెన్సింగ్, బయో ఫెన్సింగ్ వంటి సాంకేతిక చర్యలు విస్తృతంగా అమలు చేయాలి. పంట నష్టానికి త్వరితగతిన పరిహారం చెల్లించే పారదర్శక వ్యవస్థ అవసరం.
అటవీ సంరక్షణలో ప్రభుత్వ పాత్ర కీలకం. కేవలం సంఘటనల తర్వాత స్పందించడం కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళికతో అడవుల పునరుద్ధరణకు పాటుపడాలి. ఖాళీ భూముల్లో భారీ స్థాయిలో మొక్కలు నాటడం, సహజ అడవులను పునర్నిర్మించడం, వన్యప్రాణుల కోసం సంచార మార్గాలు-వైల్డ్లైఫ్ కారిడార్లను పరిరక్షించడం అత్యవసరం. అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నప్పుడు పర్యావరణ ప్రభావాన్ని కఠినంగా అంచనా వేయాలి. ఆతర్వాతే అనుమతులివ్వాలి.
“ఒక చెట్టు నరికితే పది చెట్లు నాటాలి” అనే భావన ఆచరణలోకి రావాలి. ప్రకృతి వనరులను దోచుకోవడం కాకుండా, బాధ్యతతో వినియోగించడం నేర్చుకోవాలి. పర్యావరణ పరిరక్షణను పాఠ్యాంశాలలో భాగం చేసి చిన్నప్పటి నుంచే అవగాహన పెంపొందించాలి.
ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పెద్దపులుల సంచారం ప్రజలను కంటిమీద కనుకు లేకుండా చేశాయి. అటవీశాఖ సిబ్బంది మత్తు ఇంజెక్షన్లతో వాటిని పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇవి తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. అడవుల పునరుద్ధరణ జరగనంత వరకు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.
ఈ ‘భూమి నాది’ అనే భావన మానవ అహంకారానికి ప్రతీక. నిజానికి మనం భూమికి అతిథులమే. ప్రకృతి మనకు ఇచ్చిన వరం అడవి. దాన్ని కాపాడుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలి. ప్రకృతిపై మనిషికి అధికారం లేదు. బాధ్యత మాత్రమే ఉంది అనే సత్యాన్ని గుర్తించాలి.
అభివృద్ధి తప్పనిసరి. కానీ అది ప్రకృతి విధ్వంసానికి దారితీయకూడదు. అడవులను కాపాడితే వన్యప్రాణులు సురక్షితంగా ఉంటాయి. వన్యప్రాణులు సురక్షితంగా ఉంటేనే మన జీవవ్యవస్థ సమతౌల్యంగా ఉంటుంది. జీవవ్యవస్థ సమతౌల్యంగా ఉంటేనే మనిషి భద్రంగా జీవించగలడు. వన్యప్రాణులను కాపాడటమంటే, మన భవిష్యత్తును కాపాడుకోవడమే.

