ప్రజలపై అదనపు భారం మోపకుండా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వలేమా? ప్రస్తుత సీట్లలోనే 33 శాతం కేటాయింపు అమలు చేయడం సాధ్యమే. అంటే 543 సీట్లలో సుమారు 181 సీట్లు మహిళలకు ఇవ్వవచ్చు. దీనివల్ల కొత్తగా సీట్లు పెంచాల్సిన అవసరం ఉండదు. అయితే, ఈ విధానం అమలు చేస్తే ప్రస్తుత రాజకీయ నాయకులలో ప్రతిఘటన వస్తోంది. ఇదే కారణంగా సీట్ల పెంపు అనే ప్రత్యామ్నాయం ముందుకు తెస్తున్నారని భావించాలి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం, సమాన హక్కులు, ఆర్థిక బాధ్యతలు సమతుల్యంగా నడిచినప్పుడే పరిపాలన సజావుగా సాగి, బలపడుతుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు, డీలిమిటేషన్, లోక్సభ సీట్ల పెంపు వంటి అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. లోక్సభ సీట్లను 543 నుంచి 800కు పైగా పెంచే ప్రతిపాదనలు వెలువడుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ప్రజలపై ఎంతవరకు భారం మోపుతుందన్న ప్రశ్న సహజంగానే ముందుకు వస్తోంది.
మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ఆలస్యమైనా అత్యంత అవసరమైన సంస్కరణ. దేశ జనాభాలో సగం మహిళలే ఉన్నప్పటికీ, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ఈ అసమానతను సరిదిద్దేందుకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన సమంజసం. 2019 సాధారణ ఎన్నికల్లో 89.6 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో 46.5 కోట్ల మంది పురుషులు కాగా, 43.1 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 2024 నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లకు చేరగా, మహిళా ఓటర్లు 47.1 కోట్లకు పెరిగారు. అంటే కేవలం ఐదేళ్లలోనే మహిళా ఓటర్ల సంఖ్య సుమారు 4 కోట్లకు పైగా పెరిగింది. కొత్తగా చేరిన 2.63 కోట్ల ఓటర్లలో 1.41 కోట్ల మంది మహిళలే ఉండటం ఈ వర్గం రాజకీయంగా ఎంత చైతన్యవంతంగా మారిందో సూచిస్తోంది.
ఈ నేపథ్యంలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం అనివార్యం. అయితే, ఈ రిజర్వేషన్ అమలు పేరుతో లోక్సభ సీట్లను భారీగా పెంచడం సరైన పరిష్కారమా? అన్నది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే ఉన్న 543 సీట్లను 816కు పెంచాలన్న ప్రతిపాదన వస్తోంది. అంటే దాదాపు 50 శాతం పెంపు. ఇది కేవలం సంఖ్యల మార్పు మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే నిర్ణయం.
ప్రస్తుతం ఒక్కో ఎంపీపై ప్రభుత్వం చేసే ఖర్చును పరిశీలిస్తే జీతభత్యాలు, అలవెన్సులు, నివాస సదుపాయాలు, ప్రయాణ ఖర్చులు, సిబ్బంది ఖర్చులు, పెన్షన్లు వంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే ప్రతి ఎంపీపై సంవత్సరానికి కోట్ల రూపాయల వ్యయం జరుగుతోంది. ఎంపీల సంఖ్యను 543 నుంచి 800కు పైగా పెంచితే, ఈ ఖర్చు కూడా గణనీయంగా పెరగడం అనివార్యం. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల ద్వారానే ఈ ఖర్చులు భరించాల్సి ఉంటుంది.
మరైతే, ప్రజలపై అదనపు భారం మోపకుండా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వలేమా? ప్రస్తుత సీట్లలోనే 33 శాతం కేటాయింపు అమలు చేయడం సాధ్యమే. అంటే 543 సీట్లలో సుమారు 181 సీట్లు మహిళలకు ఇవ్వవచ్చు. దీనివల్ల కొత్తగా సీట్లు పెంచాల్సిన అవసరం ఉండదు. అయితే, ఈ విధానం అమలు చేస్తే ప్రస్తుత రాజకీయ నాయకులలో ప్రతిఘటన వస్తోంది. ఇదే కారణంగా సీట్ల పెంపు అనే ప్రత్యామ్నాయం ముందుకు తెస్తున్నారని భావించాలి.
అయితే, ప్రజాస్వామ్యంలో ప్రతినిధుల సంఖ్య పెరగడం ఒక్కటే పరిష్కారం కాదు. ప్రతినిధుల నాణ్యత, బాధ్యతాయుత పాలన, ఖర్చుల నియంత్రణ కూడా ముఖ్యమే. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలోనే అనేక లోపాలు ఉన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇచ్చే పెన్షన్ వ్యవస్థపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. కొంతమంది నేతలు ఒకటి కంటే ఎక్కువ పదవులు నిర్వహించి, ద్వంద్వ పెన్షన్లు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు అందని సదుపాయాలు ప్రజాప్రతినిధులకు అందడం పై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా చేయాల్సింది ఖర్చుల సంస్కరణ. జీతభత్యాలను సమీక్షించడం, పెన్షన్ విధానంలో మార్పులు చేయడం, అవసరం లేని సౌకర్యాలను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రజల నమ్మకాన్ని పొందాలి. ఖర్చులు పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటే ఆ నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది.
మరోవైపు, డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రాంతీయ అసమానతలు తలెత్తే అవకాశం ఉంది. జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే ఉత్తర భారత రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. దీని వల్ల దక్షిణ రాష్ట్రాలు రాజకీయంగా వెనుకబడతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని కూడా సమగ్రంగా పరిశీలించాలి.
మహిళల అభివృద్ధి కేవలం రిజర్వేషన్తోనే సాధ్యం కాదు. వారికి విద్య, ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాలు కల్పించడం అత్యవసరం. వడ్డీలేని రుణాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఆస్తి హక్కులు వంటి అంశాలు మహిళలను మరింత బలోపేతం చేస్తాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా స్వతంత్రంగా పనిచేసే వాతావరణం కల్పించాలి.
మొత్తానికి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడం సముచితం. కానీ దానికోసం లోక్సభ సీట్లను భారీగా పెంచడం కంటే, ప్రస్తుత సీట్లలోనే అమలు చేయడం, లేదా పరిమిత స్థాయిలో మాత్రమే పెంపు చేయడం ఉత్తమ మార్గం. అదే సమయంలో ప్రజాప్రతినిధుల ఖర్చులను తగ్గించడం, పారదర్శకత పెంచడం, ప్రాంతీయ సమతుల్యత కాపాడడం వంటి అంశాలను కూడా సమానంగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రజల కోసం ఉండాలి, కానీ, ప్రజలపై భారం మోపే విధంగా కాదు.

