దేశ రాజధాని ఢిల్లీ నడి బొడ్డున ఎర్రకోట సమీపంలో బాంబు పేలుళ్ళు ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి. దేశం క్షేమమేనా? మనం భద్రమేనా? దేశాధ్యక్షులు, ప్రధాని, మంత్రులు, దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యులు నివాసముండే చోటే బాంబులు పేలి, తల్ల‘ఢిల్లి’న వైనం విస్మయం కలిగించకమానదు. అత్యంత రక్షణాత్మక చర్యలు తీసుకునే చోటే బాంబులు పేలితే మిగతా నగరాలు, గ్రామాల పరిస్థితి ఏంటి? భారత దేశం భద్రంగానే ఉందా? భూగోళంపై అత్యంత జనాభా కలిగిన దేశంలో జనం పరిస్థితేంటి? అనుకోకుండా జరిగే సంఘటనలు వేరు, అదే పనిగా జరుగుతుండటం వేరు. పాలకులేం చేస్తున్నారు? నిఘా, రక్షణ, పోలీసు వ్యవస్థలేం చేస్తున్నాయి? మొన్న పెహల్గాం, నిన్న ఢిల్లీలో బాంబ్ పేల్చారు. మరి రేపు? మన చుట్టూ ఉన్న దేశ ప్రజలను రక్షించడం కూడా మన కర్తవ్యం కావాలి. ప్రతి ఒక్కరు చైతన్యంతో మెలగాలి. మనమంతా ప్రభుత్వానికి, అధికారులకు అండగా నిలవాలి. ఏకోన్ముఖంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
దేశ రాజధాని ఢిల్లీ నడి బొడ్డున ఎర్రకోట సమీపంలో బాంబు పేలుళ్ళు ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి. దేశం క్షేమమేనా? మనం భద్రమేనా? దేశాధ్యక్షులు, ప్రధాని, మంత్రులు, దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యులు నివాసముండే చోటే బాంబులు పేలి, తల్ల‘ఢిల్లి’న వైనం విస్మయం కలిగించకమానదు. అత్యంత రక్షణాత్మక చర్యలు తీసుకునే చోటే బాంబులు పేలితే మిగతా నగరాలు, గ్రామాల పరిస్థితి ఏంటి? భారత దేశం భద్రంగానే ఉందా? భూగోళంపై అత్యంత జనాభా కలిగిన దేశంలో జనం పరిస్థితేంటి? అనుకోకుండా జరిగే సంఘటనలు వేరు, అదే పనిగా జరుగుతుండటం వేరు. పాలకులేం చేస్తున్నారు? నిఘా, రక్షణ, పోలీసు వ్యవస్థలేం చేస్తున్నాయి? ఇవి సహజంగా వచ్చే ప్రశ్నలు.
ఢిల్లీలో ఉగ్రదాడులు ఈరోజే మొదలైనవేమీ కావు. 1990 నుంచే పెచ్చరిల్లాయి. 1996 మే 21న లజపత్ నగర్ మార్కెట్లో బాంబ్ పేలుడులో 13 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. 2001 డిసెంబర్ 13 న సాయుధ లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేశారు. భద్రతా దళాలు వీరిని సమర్ధంగా ఎదుర్కొని, ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. ఈ దాడికి కీలక సూత్ర, పాత్రధారి అఫ్జల్ మహ్మద్కు, భారత సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. ఈ దాడితో భారత పాక్ సంబంధాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమై, 2001-02 నాటి సైనిక మోహరింపుకు దారితీసింది.
2005 అక్టోబర్ 29న సరోజనీనగర్, పహర గంజ్, గోవింద్ పురి ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. 60-70మంది చనిపోయారు. 200 మంది గాయపడ్డారు. 2008 సెప్టెంబర్ 13న కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, గ్రేటర్ కైలాష్ మార్కెట్లలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. 25-30 మంది వరకు మృతులు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. తాజాగా, 2025 నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో కారు బాంబ్ పేలుడు జరగడంతో కనీసం 12 మంది మరణించి, 20కి పైగా గాయపడ్డారు. ఉగ్రవాద దాడిగా పోలీసు విచారణ చేపట్టారు.
అయితే, తాజా దాడులతో ఇస్లామిక్ టెర్రరిస్ట్ ముష్కరులు మరోమారు భారత్కు సవాల్ విసిరారు. మనలో ఒకరుగా, మనలోనే, మనతోనే ఉంటూ, ముష్కరులు మనలను మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దాడులు కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. కశ్మీర్ అసెంబ్లీపై దాడి, హైదరాబాద్, ముంబై సహా దేశంలోని అనేక చోట్ల నుంచి పుల్వామా, పెహల్గాం దాకా, ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిఘా వర్గాలు ఉగ్రవాదులను గుర్తించి, వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న గంటల్లోనే ఎర్రకోట వద్ద మారణహోమం జరిగింది. ఈ ఘటన మరోసారి జాతి యావత్తునూ ఉలిక్కిపడేలా చేసింది.
పెహల్గాం దాడి తరవాత పాక్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పటి నుంచి ఇలాంటిది ఏదో ఉగ్రదాడి తప్పదన్న సంకేతాలు, హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. దేశంలో కొందరు ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం, కొందరు ఉగ్రవాదులతో కలిసి ఉగ్రదాడులకు పాల్పడటం చేస్తున్నారు. హైదరాబాద్లో పట్టుబడ్డ ముష్కరుడు సామూహికంగా ప్రజలను అంతం చేసే ప్రణాళికలో ఉన్నట్లు తేలింది. మంచినీళ్లు, ప్రసాదాల్లో విషం కలిపి చంపే అతిపెద్ద కుట్రను పోలీసులు ఛేదించారు. ఢిల్లీ ఘటన స్థలాన్ని సందర్శించి, ఆ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్ర మూకులను ఏ కలుగులో దాక్కున్నా వదిలేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు.
ఇక దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. ఉగ్రవాదులతో హైదరాబాద్ కే ఏదో విధంగా సంబంధాలుంటున్నాయి. ఉగ్రవాదులు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనేక దర్యాప్తుల్లో తేలింది. తాజా, ఢిల్లీ బాంబు పేలుళ్లలోనూ హైదరాబాద్ లింకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ హైదరాబాద్ లో బాంబు దాడులు జరగడం తెలిసిందే.
ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఢిల్లీ సహా హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆయా నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. అనుమానిత వ్యక్తులు, వస్తువులు, వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నగర సీపీ సజ్జనార్ సూచించారు. గుంపులు గుంపులుగా తిరగవద్దని వీలైనంత వరకు ప్రజలు ఇంటికే పరిమితం కావడం మంచిదని హెచ్చరించారు.
మొన్న పెహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరుతో హత్యాకాండకు తెగించారు. ఇప్పడు ఢిల్లీలో బాంబ్ పేల్చారు. మరి రేపు? ఉగ్ర మూకలు జన సమ్మర్థ ప్రాంతాలనే టార్గెట్ చేస్తున్నారు. జన సమూహాలు అధికంగా ఉండే పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ప్రార్థనా మందిరాలు వంటి చోట్ల అప్రమత్తంగా ఉండాలి. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ తో పాటు, ఢిల్లీ మెట్రో స్టేషన్లలో భద్రతా సంస్థలు నిఘా వేశాయి. పుకార్లను నమ్మకూడదని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు భరోసా ఇస్తున్నారు. భద్రతను కల్పించడం, రక్షించడం కేవలం పోలీస్ లేదా ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, మనల్ని మనం రక్షించుకుంటూ, మన చుట్టూ ఉన్న దేశ ప్రజలను రక్షించడం కూడా మన కర్తవ్యం కావాలి. ప్రతి ఒక్కరు చైతన్యంతో మెలగాల్సి ఉంది. ఇదే సమయంలో మనమంతా ప్రభుత్వానికి, అధికారులకు అండగా నిలవాలి. ఏకోన్ముఖంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి.

