ఉగాది ఒక పండుగ మాత్రమే కాదు. కాల గమన తత్వాన్ని, జీవితత్వాన్ని, జీవిత సత్యాన్ని గుర్తుచేసే ఆత్మపరిశీలన. గతాన్ని గమనిస్తూ, వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ, భవిష్యత్తుకు కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఇది ఒక ఆహ్వాన శుభసూచక సమయం. పరాభవ నామ సంవత్సరం పరువు నిలిపి, ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సౌఖ్యం వెల్లివిరిసి, సిరిసంపదలు కలిగి, ప్రపంచమంతా ప్రశాంతత నెలకొనాలని ఆకాంక్షిద్దాం. ఉగాది శుభాకాంక్షలు!
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
కాల చక్రం నిరంతర ప్రవాహం. అది ఎవరి కోసం ఆగదు. ఎవరి చేతిలోనూ ఉండదు. అందుకే భారతీయ సంస్కృతిలో కాలాన్ని ‘విధి’గా దైవ స్వరూపంగా భావిస్తారు. పూజిస్తారు. ఈ కాల గమన చక్రాన్ని గుర్తిస్తూ, ప్రకృతి మార్పులతో అనుసంధానంగా దైనందిన జీవనాన్ని సర్దుబాటు చేసుకునే జ్ఞానం మన పూర్వీకులది. ఆ కాల జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన పండుగే యుగాది. తెలుగు వారి సంవత్సరాది. ఉగాది.
‘యుగాది’ అనే సంస్కృత పదం నుంచి పుట్టిన ఉగాది, ‘యుగానికి ఆది’ అనే అర్థాన్ని సూచిస్తుంది. చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగ, వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది. వసంతం అంటే ప్రకృతిలో పునరుజ్జీవనం. చెట్లు చిగురించి, కొత్త ఆకులతో పచ్చదనాన్ని, కొత్త ఉత్సాహాన్ని కురిపిస్తాయి. పూలు వికసించి సువాసనలు వెదజల్లుతాయి. కోయిలల కుహుకారాలు, నెమళ్ల నాట్యాలు జీవనోత్సాహాన్ని తెలియజేస్తాయి. ప్రకృతిలో చోటుచేసుకునే ఈ మార్పు, మానవ, సకలచరాచర జీవితాల్లో కూడా కొత్త ఆరంభాలకు సంకేతంగా నిలుస్తుంది.
పురాణాల ప్రకారం, ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడని విశ్వాసం. కాలం అనంతమైనదైనా, మనిషి తన అవసరాల కోసం దానిని విభజించుకున్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గమనాన్ని పరిశీలిస్తూ కాల గణనతో, కాలజ్ఞాన కాలమానం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోనే చంద్రమానం, సౌరమానం వంటి పద్ధతులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చంద్రమానం ఆధారంగా లెక్కించే తెలుగు సంవత్సరాది ఉగాది రూపంలో ప్రజల జీవితాల్లో స్థిరపడింది.
భారతీయ కాల గణనలో విషువత్తులు, సంక్రాంతులు ముఖ్యమైనవి. పగలు-రాత్రి సమానంగా ఉండే కాలాన్ని విషువత్తుగా పేర్కొన్నారు. ప్రకృతి చక్రంలో మార్పులను గమనిస్తూ రైతులు పంటలు పండించుకుంటున్నారు. సమాజం ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో పండుగలు కూడా కేవలం ఆచారాలు కాకుండా, జీవన విధానానికి మార్గదర్శకాలుగా మారాయి.
ఉగాది పండుగలో కనిపించే ప్రతి ఆచారంలో ఒక సందేశం దాగి ఉంటుంది. ఉదయం స్నానం చేసి, ఇళ్లను శుభ్రపరచి, మామిడి ఆకుల తోరణాలు కట్టడం పరిశుభప్రదతకు సూచికలు. కొత్త బట్టలు ధరించడం కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. ఉగాది పచ్చడికి ఈ పండుగలో ప్రత్యేక స్థానం ఉంది. వేపపువ్వు, బెల్లం, మామిడి, చింతపండు, మిర్చి, ఉప్పు…ఈ షడ్రుచులు.. జీవితపు ఆరు ప్రధాన పార్శ్వాలకు సంకేతాలుగా నిలిచాయి. సుఖం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం, విరక్తి.. ఈ అనుభవాలన్నింటినీ సమానంగా స్వీకరించాలనే తాత్పర్యాన్ని, సందేశాన్ని ఈ పచ్చడి మనకు అందజేస్తుంది.
ఇక పంచాంగ శ్రవణం కూడా ఉగాది రోజు ముఖ్యాంశం. కొత్త సంవత్సరంలో తిరిగే గ్రహగతులు, ఫలించే రాశిఫలాలు, అరుదెంచే ఆదాయ-వ్యయాలు, కలిగే శుభాశుభాలు వంటి అంశాలను ముందే తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తుకు సిద్ధం కావడమన్నది పంచాగశ్రవణం పరిగ్రహణంగా, పారంపర్యంగా జరుగుతున్నది. ఇది మూఢనమ్మకం కాదు. భవిష్యత్తు పట్ల అవగాహనతో, జాగ్రత్తగా ముందుకు సాగేందుకు ఒక శాస్త్రీయ మార్గం.
ఉగాది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. కర్ణాటకలో ఉగాది, మహారాష్ట్రలో గుడి పాడ్వా, తమిళనాడులో పుత్తాండు, కేరళలో విషు, పంజాబ్లో వైశాఖీ, బెంగాల్లో పొయ్లా బైశాఖ్గా ఈ పండుగను జరుపుకుంటారు. పేర్లు మారినా, భావం మాత్రం ఒకటే. కొత్త సంవత్సరానికి స్వాగతం, కొత్త ఆశలకు ఆరంభం.
ఆధునిక కాలంలో వేగంగా మారుతున్న జీవనశైలిలో, ఈ పండుగల ప్రాముఖ్యత మరింత పెరిగింది. మనం ప్రకృతితో, సంప్రదాయంతో దూరమవుతున్న తరుణంలో ఉగాది వంటి పండుగలు మన మూలాలను గుర్తు చేస్తాయి. ఇవి మనకు కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా, జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ, అన్ని కాలమాన భావోద్వేగాలను సమంగా చూసే దృక్పథాన్ని అందిస్తాయి.
మొత్తంగా, ఉగాది ఒక పండుగ మాత్రమే కాదు. కాల గమన తత్వాన్ని, జీవితత్వాన్ని, జీవిత సత్యాన్ని గుర్తుచేసే ఆత్మపరిశీలన. గతాన్ని గమనిస్తూ, వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ, భవిష్యత్తుకు కొత్త ఆశలతో ముందడుగు వేయడానికి ఇది ఒక ఆహ్వాన శుభసూచక సమయం. పరాభవ నామ సంవత్సరం పరువు నిలిపి, ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సౌఖ్యం వెల్లివిరిసి, సిరిసంపదలు కలిగి, ప్రపంచమంతా ప్రశాంతత నెలకొనాలని ఆకాంక్షిద్దాం. ఉగాది శుభాకాంక్షలు!

