లొంగిపోవడానికి పిల్చి…
ప్రశ్నించడానికి పట్టుకెళ్ళి…
నమ్మించి…నట్టడవిలో కాల్చి…
హిడ్మా దళం దగా పడిందా?
లొంగిన వాళ్ళను పోలీసులే మట్టుబెట్టారా?
హిడ్మా ఎన్ కౌంటర్ పై అనేక అనుమానాలు
పట్టుబడ్డాకే మట్టు పెట్టారంటున్న ప్రజాసంఘాలు
ఆ అవసరం మాకు లేదంటున్న పోలీసులు
అగ్రనేతలే లక్ష్యంగా పోలీసుల ప్రణాళిక
మావోయిస్టుల అంతానికే ఆపరేషన్ పన్నాగం
హిడ్మా లేఖ రాసిన ఆ జర్నలిస్టు ఎవరు?
ఆరా తీస్తున్న పోలీసులు, నిఘా వర్గాలు!
హైదరాబాద్, నవంబర్ 19 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కీలకం. ఆ పార్టీ గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్ జీఏ) ప్లాటూన్ 1 ప్రధాన కమాండర్, ప్రభుత్వం, పోలీసులకు మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్ కౌంటర్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఎన్ కౌంటర్ బూటకమని, పట్టుకెల్లి మట్టుబెట్టారని సీపీఐ, ప్రజా, పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆవసరం మాకు లేనే లేదని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ దశలో ఏపీలో వేర్వేరు చోట్ల పట్టుబడ్ట నక్సలైట్లు హిడ్మా ప్లాటూన్ సభ్యులేనని ఆ రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏడీజీ లద్దా ప్రకటించారు. వారిని బుధవారమే కోర్టులో హాజరు పరిచారు. ఈ ప్రకటనతోపాటు, నక్సల్స్ కదలికలపై అవగాహన ఉన్న వారి ఆలోచనలు, మారేడ్ మిల్లి అడవుల్లో జరిగిన హిడ్మా ఎన్ కౌంటర్ వంటి ఘటనలు, తాను లొంగిపోవడానికి హిడ్మా దళం నిర్ణయించుకుని, ఓ జర్నలిస్టుకు లేఖ రాశారన్న పుకార్లు వంటి ఈ వరుస పరిణామాలు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి.
మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ స్థాయిలో కీలకంగా ఉన్న హిడ్మా పోలీసులకు కొరకరానిక కొయ్యగా మారాడు. పోలీసులే చెబుతున్నట్లు వారికి భారీ నష్టం వాటిల్లిన అన్ని ఘటనలకు బాధ్యుడు హిడ్మానే. పైగా మావోయిస్టు పీఎల్ జీఏ ఒకటవ ప్లాటూన్ కు కమాండర్. మావోయిస్టు దాడుల చోదక శక్తిగా పని చేసిన, అంతటి వ్యక్తి దళమే బెజవాడలో పట్టుబడిందని కూడా ఏపీ పోలీసులే ప్రకటించారు. ఇదిలా వుంటే, బెజవాడలో హిడ్మా దళంగా భావిస్తున్న 50 మంది నక్సలైట్లు పట్టుబడగా, హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్ లు మారేడ్ మిల్లిలో ఎన్ కౌంటర్ అయ్యారు. ఈ రెండు మంగళవారం తెల్లవారుజామునే జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలు కాకతాలీయంగా జరిగినవా? కావాలనే చేసినవా? అనే అనుమానాలను ప్రజా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అరణ్యాల్లో సేఫ్టీ లేకే జనారణ్యంలోకి వచ్చిన నక్సల్స్ లో హిడ్మా, ఆయన భార్య, మరికొందరితో తిరిగి అడవుల్లోకి వెళ్ళారా? అలా చేసి ఉంటారా? పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన హిడ్మా అంత ఈజీగా దొరికాడా?
అయితే, హిడ్మా తన దళంతోపాటు లొంగిపోవడానికి సిద్ధపడి, ఓ జర్నలిస్టుకు లేఖ రాశాడన్నదాన్ని బట్టి చూస్తే, లొంగిపోవడానికే హిడ్మా సహా ఆయన దళం కానూరు న్యూ ఆటో నగర్ లో దిగిందా? హిడ్మా లొంగుబాటుకు దళాన్ని ఎవరు రప్పించారు? వారే వచ్చారా? వారిలో నుంచి హిడ్మా, ఆయన భార్య, మరికొందరు మాత్రమే ఎందుకు వేరుగా వెళ్ళారు? వారిని లొంగుబాటులో ప్రక్రియలో భాగంగానే జనారణ్యంలోకి రప్పించి, షెల్టర్ పై దాడి చేసి, హిడ్మా అతడి భార్యను మరికొందరిని పట్టుకెళ్ళి కాల్చి చంపారా? అనుమానాలు రాకుండానే మిగతా అతడి దళాన్ని అరెస్టు చేశారా? ఒకవేళ ఇవన్నీ తప్పైతే అసలు హిడ్మా సమాచారాన్ని ఇచ్చిందెవరు? లేక ఆయనంతట ఆయనే పోలీసులకు దొరికిపోయాడా? అన్న అనుమానాలు ప్రజా, పౌరహక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు హిడ్మా లేఖ రాసింది నిజమేనా? ఆయన రాసిందెవరికి? ఆ జర్నలిస్టు ఎవరు? అన్న కోణంలోనూ పోలీసులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయని తెలిసింది. ఈమొత్తం ఎపిసోడ్ లో ఎవరైనా కోవర్టులుగా పని చేశారా? అన్నది కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
ఇదిలావుంటే, ఆధునిక టెక్నాలజీ, డ్రోన్లు, లొంగుబాట్లు, లొంగినవాళ్ళిస్తున్న సమాచారం, ప్రజల్లో మావోయిస్టులకు తగ్గిన ఆదరణ, అక్కున చేర్చుకునే వారే లేకపోవడం, గతంలోలా ప్రభుత్వాలను ప్రశ్నించేవారే కరువవడం, పెరిగిన నిర్బంధాలు, తరిగిన మావోయిస్టులు, లెఫ్ట్ తీవ్రవాదమే లేకుండా చేయాలన్న కేంద్ర ప్రభుత్వం గట్టి సంకల్పం. ‘ఆపరేషన్ కగార్’ ప్రణాళిక, పోలీసులు, దళాల లక్ష్యం, మావోల ఉద్యమాల్లో సమన్వయ లోపం, అంతర్గత కలహాలు, భిన్నాభిప్రాయాలు, బేధాభిప్రాయాలు, విభేదాలు వెరసి మావోయిస్టుల యుద్ధం ముగియడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
మొత్తానికి దేశంలో1967లో ప్రారంభమైన దాదాపు ఆరు దశాబ్దాల ఉత్థాన, పతనాల సాయుధ విప్లవ సుదీర్ఘ ప్రయాణం ముగింపుకు చేరుతోంది.

