తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణనపై మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కుల గణన చేపట్టినట్లు తెలిపారు. కుల గణనను సమాజానికి ఎక్స్రేలా వర్ణిస్తూ, దాని ద్వారా దేశ ప్రజల పరిస్థితులను అర్థం చేసుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని వివరించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “మునుపటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2011లో సేకరించిన కుల గణన వివరాలను మోదీ ప్రభుత్వం బయట పెట్టలేకపోయింది. కానీ, రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో ప్రజల మనసులోని మాటను గ్రహించి, కుల గణన చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ఆయన హామీ ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియ ప్రారంభించింది,” అని తెలిపారు.
తెలంగాణ శాసనసభలో కుల గణనపై తీర్మానం చేసి, జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్ వరకూ ఆందోళనలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ డిమాండ్కు అన్ని పార్టీల మద్దతు లభించిందని, చివరకు కేంద్రం దేశవ్యాప్తంగా కుల గణనకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. వందేళ్లుగా ఎవరూ చేయని పని తెలంగాణ ప్రభుత్వం ముందుండి చేపట్టిందని, ఇది దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కుల గణనను పారదర్శకంగా నిర్వహించేందుకు మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. వారు జిల్లా కేంద్రాల్లో ప్రజల డిమాండ్లు విన్నారని చెప్పారు. తనే స్వయంగా ఎనిమిది సార్లు సమీక్షలు నిర్వహించానని తెలిపారు. 90 వేలకుపైగా ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించారని, ప్రతి పదిమందిపై ఒక సూపర్వైజర్ను నియమించినట్లు వివరించారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణనకు అంగీకరించడం పట్ల స్వాగతం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అయితే, దేశ వ్యాప్తంగా కుల గణన చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీసీలుగా ఉన్న బోయులు కర్ణాటకలో ఎస్టీలుగా ఉన్నారని, లంబాడీలు తెలంగాణలో ఎస్టీలు, మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారని ఉదాహరణలు చెప్పారు.
కుల గణన కోసం కేంద్రం ప్రత్యేకంగా మంత్రుల కమిటీ, నిపుణుల బృందాన్ని నియమించాలని, స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ అనుభవాన్ని కేంద్రం వినియోగించుకోవాలని కోరారు. తమ దగ్గర ఉన్న సమాచారం, అనుభవాన్ని ఇతర రాష్ట్రాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
రాజకీయాలు పక్కన పెట్టి దేశ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని, కుల గణనను రాజకీయం చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. చివరిగా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాహుల్ గాంధీ, ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫలితమేనని తెలిపారు. బీహార్ కుల గణనపై కోర్టు ఆక్షేపించినా, తెలంగాణ చేపట్టిన కుల గణన శాస్త్రీయంగా, పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు.

