డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యమంటూ ఆరోపణ
శిశువు మృతదేహంతో బాధితుల ఆందోళన
బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్, ప్రజాసంఘాలు
తెల్లవారు జాము 3 గంటల వరకు రాస్తారోకో
8 గంటల పాటు హాస్పిటల్ వద్ద హై డ్రామా
బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామన్న పోలీసులు
విచారించి డాక్టర్లు, సిబ్బందిపై వేటు వేస్తామన్న అధికారులు
పోలీసులు, అధికారుల హామీతో శాంతించిన ఆందోళనకారులు
పాలకుర్తి సర్కార్ దవాఖానాలో గర్భస్త శిశువు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందినట్లు ఆరోపించిన బాధితులు సర్కార్ దవాఖానా వద్దే ఆందోళనకు దిగారు. ప్రధాన కూడలిలో రాస్తా రోకో చేశారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్, ప్రజాసంఘాల నాయకులు నిలిచారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి గురువారం తెల్లవారు జాము 3 గంటల వరకు 8 గంటల పాటు హైడ్రామా నడిచింది. బాధితులు ఎంతకూ వినకపోవడంతో కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ దిగి వచ్చారు. జరగిన ఘటనపై క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు, విచారణ జరిపి, దోషులను శిక్షిస్తామని వైద్యాధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు.

బాధితుల కథనం ప్రకారం…పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన యాట భిక్షపతి భార్య యాట అర్చన ప్రసవానికి పాలకుర్తిలోని ప్రభుత్వ దవాఖానాకి మంగళవారం మధ్యాహ్నం వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యురాలు అపర్ణ, మరో డాక్టర్, సిబ్బంది నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి, నొప్పులు రావడం లేదని ఆబ్జర్వేషన్ లో ఉంచారు. తీరా బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పరిస్థితి విషమించడంతో పాలకుర్తిలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ కి వెళ్లాలని సూచించారు. తీరా చేసేదేమీ లేక అక్కడకు తరలించగా అప్పటికే గర్భంలోని శిశువు మృతి చెందారని ప్రసవం చేశారు. శిశువును విగత జీవిగా చూడడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ పండంటి బిడ్డను పొట్టన పెట్టుకున్నారంటూ సర్కార్ దవాఖానా వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శిశువు మృత దేహంతో బాధిత బంధువులు దవాఖానా ఎదుటే ఆందోళనకు దిగారు.

ఇదిలావుండగా, బీఆర్ఎస్ కు చెందిన మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్, గూడ దామోదర్, యూత్ నాయకులు మహేందర్, సురేశ్, రాజేంద్రా చారి తదితరులు, బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్, పట్టణ అధ్యక్షుడు పబ్బ సంతోశ్, నాయకులు కమ్మగాని శ్రీకాంత్, దుంపల సంపత్, సిపిఐ ఎం ఎల్ నేత, ప్రజా సంఘాల నేత గుమ్మడి రాజుల సాంబయ్య తదితరులు బాధితులకు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వానికి, వైద్యులు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎసిపి నర్సయ్య, పాలకుర్తి సిఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్ఐలు దూలం పవన్ కుమార్, రాజు, రామ్ చరణ్ లు సహా పోలీసులు జోక్యం చేసుకున్నా, అర్థరాత్రి వరకు పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఆందోళనకారులు పాలకుర్తిలోని ప్రధాన కూడలిలో రాస్తారోకోకు దిగారు. దీంతో కలెక్టర్ జోక్యంతో ఎట్టకేలకు జనగామ జిల్లా డిప్యూటీ వైద్యాధికారి రవీందర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ అపర్ణ పాలకుర్తికి చేరుకున్నారు. కేసు షీట్ చూపించాలని, దోషులను శిక్షించాలని ఆందోళనకారులు పట్టుపట్టడంతో, క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు, విచారించి దోషులను శిక్షిస్తామని అధికారులు చెప్పడంతో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు.

