తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది పాదర్శక నిర్ణయాలు. రైతులకు కావాల్సింది నీటి భరోసా. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతలపై కొనసాగుతున్న రాజకీయ పంచాయితీకి ముగింపు పలికి, శాస్త్రీయ ఆధారాలు, భద్రతా ప్రమాణాలు, ప్రజా ప్రయోజనాల ఆధారంగా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలి. అదే తెలంగాణ నీటి భవిష్యత్తును, రైతు భవిష్యత్తును కాపాడే అసలైన మార్గం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. దీనికి రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడే తప్ప, చుక్కు నీరుకూడా పారడం లేదు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రాజకీయాలు మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతలను ప్రస్తుతం వినియోగించడం సురక్షితం కాదని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం గోదావరిలో అందుబాటులో ఉన్న నీటిని వెంటనే ఎత్తిపోసి రాష్ట్ర రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అయితే, ప్రస్తుతం గోదావరిలో అందుబాటులో ఉన్న నీటిని తెలంగాణ వినియోగించుకునే అవకాశం ఉందా? లేదా?
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు వేగంగా ఎండిపోతున్నాయి. కేంద్ర జల సంఘం తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే 16% నుంచి 46% వరకు తగ్గాయి. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు వంటి ప్రాజెక్టులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. వ్యవసాయంతో పాటు తాగునీటి అవసరాలపై కూడా విపరీత ప్రభావ ప్రమాదం కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఏడాది పొడవునా ప్రవహించే ప్రాణహిత నుంచి మేడిగడ్డ బరాజ్ వరకు ఇప్పటికీ వినియోగించదగిన ప్రవాహాలు వస్తున్నాయని విశ్రాంత జలవనరుల ఇంజినీర్లు పేర్కొంటున్నారు. కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా రోజుకు రెండు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ఆ నీటిని ఎల్లంపల్లి, మధ్య మానేరు, దిగువ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వంటి రిజర్వాయర్లకు తరలించే అవకాశం ఉందని వారి వాదన.
తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో కనీస నీటి మట్టాన్ని కొనసాగిస్తూ సాంకేతిక ప్రమాణాల ప్రకారం పంపింగ్ నిర్వహిస్తే ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తవని స్పష్టం చేసింది. గతంలో వరదల సమయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించినట్లు పేర్కొంది.
మరోవైపు ప్రభుత్వం మాత్రం జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ నివేదికలో వ్యక్తమైన అభ్యంతరాలను ప్రధాన కారణంగా చూపుతోంది. మేడిగడ్డ బరాజ్లో పియర్లు కుంగిపోవడం, నిర్మాణ భద్రతపై వ్యక్తమైన సందేహాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చెబుతోంది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత ముందు ప్రాధాన్యమని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదనను కూడా విస్మరించలేం.
అయితే, ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఒకటే. సాంకేతికంగా సాధ్యమైతే ఎందుకు పంపింగ్ చేయడం లేదో, సాధ్యం కాకపోతే అందుకు కారణాలేమిటో పూర్తి పారదర్శకతతో ప్రజలకు వివరించాలి. నిపుణుల కమిటీ నివేదికను బహిరంగపరచాలి. వాస్తవ పరిస్థితిని రైతులకు తెలియజేయాలి. అనుమానాలకు అవకాశం ఇవ్వకూడదు.
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా పరిశీలించాలి. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాలను ముందుగానే ప్రారంభించింది. పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని గోదావరి నుంచి ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు తరలించే సామర్థ్యం ఉంది. ఏడాదికి 80 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ఈ వ్యవస్థను రూపొందించారు. తాడిపూడి ఎత్తిపోతల ద్వారా మరో 1,400 క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న ప్రతి చుక్క నీటిని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేయాలనే దూరదృష్టితో ఆ రాష్ట్రం వ్యవహరిస్తోంది.
తెలంగాణకు కూడా ఇదే ఆలోచన అవసరం. రాజకీయ వివాదాలతో గోదావరి నీరు సముద్రంలో కలవడం ఎవరికీ ప్రయోజనకరం కాదు. అదే సమయంలో భద్రతను విస్మరించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా సమంజసం కాదు. అందువల్ల సాంకేతిక నిపుణులు, జలవనరుల శాస్త్రవేత్తలు, డ్యామ్ భద్రతా నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలి.
తన పొలానికి నీరు వస్తుందా? లేదా? అన్నదే రైతుకు ముఖ్యం. తాగునీటి భరోసానే పట్టణ, నగర ప్రజలకు ముఖ్యం. అందుకే ఈ అంశాన్ని రాజకీయ పోరాటంగా కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలో చూడాలి.
ఎల్నినో ప్రభావం ఇంకా కొనసాగితే రాష్ట్రంలో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ముందస్తు ప్రణాళికే ఉత్తమ పరిష్కారం. అందుబాటులో ఉన్న వరదనీటిని సురక్షితంగా నిల్వ చేయడం, సాగు-తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పారదర్శక నిర్ణయాలతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ప్రభుత్వ బాధ్యత.
ప్రజలకు కావాల్సింది పాదర్శక నిర్ణయాలు. రైతులకు కావాల్సింది నీటి భరోసా. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతలపై కొనసాగుతున్న రాజకీయ పంచాయితీకి ముగింపు పలికి, శాస్త్రీయ ఆధారాలు, భద్రతా ప్రమాణాలు, ప్రజా ప్రయోజనాల ఆధారంగా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలి. అదే తెలంగాణ నీటి భవిష్యత్తును, రైతు భవిష్యత్తును కాపాడే అసలైన మార్గం.

