వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కొనుగోళ్ల విస్తరణలో లేదు. శాస్త్రీయ పంటల ప్రణాళికలో మాత్రమే ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యంకాదు. కానీ రైతులు మార్కెట్కు అవసరమైన పంటలను పండించేలా వ్యవస్థను రూపొందించడం సాధ్యమే. అందుకే దేశవ్యాప్తంగా, తెలంగాణ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో సమగ్ర పంటల విధానం అమలు కాలానుగుణ అవసరం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
దేశ వ్యవసాయ రంగం ఇంకా సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఉత్పత్తి పెరుగుతున్నా, మరోవైపు రైతుల ఆదాయం స్థిరంగా పెరగడం లేదు. పంటలు పండించిన తర్వాత గిట్టుబాటు ధరలు దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో సమగ్ర పంటల విధానం లేకపోవడమే. రైతులు తమకు అనుకూలంగా భావించిన పంటలను సాగు చేస్తుండగా, ప్రభుత్వాలు కొనుగోలు చేసే స్థాయికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఫలితంగా అధిక ఉత్పత్తి, తక్కువ ధరలు, మార్కెట్ అనిశ్చితి వంటి సమస్యలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి.
దేశంలో మొత్తం సాగుభూమిలో వరి, గోధుమ, మక్కజొన్న వంటి పంటల వాటా అత్యధికంగా ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం భారత్లో ఏటా 14 కోట్ల టన్నులకు పైగా వరి ఉత్పత్తి అవుతోంది. మరోవైపు కేంద్ర నిల్వ సంస్థలు, ప్రభుత్వ గిడ్డంగుల్లో భారీ స్థాయిలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. అయినప్పటికీ రైతులు అదే పంటలను మళ్లీ మళ్లీ సాగు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ జరగకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
తెలంగాణ పరిస్థితిని పరిశీలించినా ఇదే చిత్రం కనిపిస్తుంది. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గత దశాబ్దంలో అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ దేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ప్రతి ప్రాంతంలో ఒకే రకమైన పంటల సాగు వల్ల మార్కెట్పై ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ యార్డులో సన్న రకాల వరికి మంచి డిమాండ్ లభించింది. కొన్ని చోట్ల మద్దతు ధర కంటే ఎక్కువ ధరలు రైతులకు దక్కాయి. ఇది మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని సూచిస్తోంది.
ప్రభుత్వం తాజాగా కొన్ని సన్న రకాల వరివంగడాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, రైతులను క్షేత్రస్థాయిలో చైతన్యపరిచే చర్యలు ఇంకా ఆశించిన స్థాయిలో లేవు. ఏ జిల్లాలో ఏ పంట సాగు చేయాలి? ఎంత విస్తీర్ణంలో వేయాలి? నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్, ఎగుమతి అవకాశాలు ఏమిటి? వంటి అంశాలపై సమగ్ర మార్గదర్శకత్వం అవసరం. కేవలం విత్తనాలు పంపిణీ చేయడం లేదా ప్రోత్సాహకాలు ప్రకటించడం సరిపోదు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా మేరకే కొనుగోళ్లు జరుగుతాయని ప్రకటించడం కొత్త చర్చకు దారితీసింది. వాస్తవానికి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమైనది. కేంద్రం నిర్దేశించిన పరిమితులకు లోబడి రాష్ట్రాలు ధాన్యం సేకరించి ఎఫ్సీఐకి అందజేస్తాయి. అయితే ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యంలో కేంద్రం కొనుగోలు చేసే పరిమాణం పరిమితంగానే ఉంటుంది. పప్పుధాన్యాలు, నూనెగింజల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మక్కజొన్న వంటి పంటలను కేంద్రం సాధారణంగా కొనుగోలు చేయదు. దీంతో మార్కెట్లో ధరలు పడిపోతే రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కొనుగోళ్లపై ఆధారపడకుండా పంటల ప్రణాళికపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉచిత విద్యుత్, రైతుభరోసా, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం సమగ్ర పంటల విధానమే. రైతు ఏ పంట వేస్తే లాభం వస్తుంది, ఏ పంటకు భవిష్యత్తులో డిమాండ్ ఉంటుంది, ఎక్కడ మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి అనే అంశాలపై ప్రభుత్వాలు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలి.
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విజయవంతమైన దేశాలు మార్కెట్ ఆధారిత పంటల ప్రణాళికను అమలు చేస్తున్నాయి. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, వినియోగ ధోరణులు, ఎగుమతి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పంటల ఎంపికను ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో కూడా జిల్లాల వారీగా, మండలాల వారీగా పంటల మ్యాపింగ్ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతంలో వరి, ఎక్కడ పప్పుధాన్యాలు, ఎక్కడ నూనెగింజలు, ఎక్కడ ఉద్యాన పంటలు అనేది శాస్త్రీయంగా నిర్ణయించాలి.
అలాగే సేంద్రీయ వ్యవసాయం, విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు బలోపేతం కావాలి. వ్యవసాయం కేవలం ఉత్పత్తి వరకే పరిమితం కాకుండా మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్, ఎగుమతులతో అనుసంధానమైతేనే రైతుల ఆదాయం పెరుగుతుంది.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు స్పష్టమైన మార్గనిర్దేశం అత్యవసరం. ఎంత మేరకు వరి సాగు చేయాలి? ఏ రకాల వంగడాలు ఎంచుకోవాలి? ప్రత్యామ్నాయంగా ఏ పంటలు సాగు చేయాలి? అనే విషయాలను ప్రభుత్వం ముందుగానే ప్రకటించాలి. దీనికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు అందించాలి.
వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కొనుగోళ్ల విస్తరణలో కాదు. శాస్త్రీయ పంటల ప్రణాళికలో ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యంకాదు. కానీ రైతులు మార్కెట్కు అవసరమైన పంటలను పండించేలా వ్యవస్థను రూపొందించడం మాత్రం సాధ్యమే. అందుకే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో సమగ్ర పంటల విధానం అమలు కాలానుగుణ అవసరంగా మారింది.

