మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా మారాయా? భవిష్యత్తు ఆదాయ వనరులను సృష్టించాయా? తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు తమ తీర్పు చెప్పారు. అభివృద్ధి, అవినీతి, అధికార కేంద్రీకరణ వంటి అంశాలు ఎన్నికల ప్రధాన చర్చగా మారాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోవాల్సిన కీలక బాధ్యతను మోస్తోంది. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా అనేక హామీలు అమలు దశలోనే ఉండటం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పుష్కరకాలం పూర్తైంది. 12 ఏళ్ళ ప్రయాణం మాములుదేమీ కాదు. ఈ దీర్ఘ కాలంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం ఆశించిన లక్ష్యాలను సాధించిందా? “నీళ్లు – నిధులు – నియామకాలు” అనే నినాదంతో సాగిన ఉద్యమ ఫలితాలు ప్రజల జీవితాల్లో ఎంత మేరకు ప్రతిఫలించాయి? ఈ అంశాలపై తెలంగాణ మేధావులు, పౌరసమాజం, రాజకీయ వర్గాలు నిష్పాక్షికంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలతో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, సాగు-తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావించారు. కొంతమేర అభివృద్ధి జరిగినా, ఉద్యమ సమయంలో ప్రజలు ఆశించిన సమగ్ర మార్పు కనిపించిందా అనే ప్రశ్న ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.
మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరిందని, రాష్ట్ర బడ్జెట్, వివిధ ఆర్థిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా మారాయా? భవిష్యత్తు ఆదాయ వనరులను సృష్టించాయా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలే లేవు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభ అంచనాలు పెరుగుతూ లక్ష కోట్లకు పైగా వ్యయమైంది. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తలెత్తిన సాంకేతిక సమస్యలు ప్రాజెక్టు నిర్మాణం, అవినీతి, మన్నిక, ప్రయోజనాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రజా ధన వినియోగంపై సమగ్ర సమీక్ష అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగాల విషయంలో కూడా ఆశించిన పురోగతి కనిపించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాజకీయ పార్టీలు హామీలతో ఊదరగొట్టాయి. కానీ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. ప్రభుత్వ నియామకాల ఆలస్యం యువతలో నిరాశను పెంచుతోంది.
వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. అయినప్పటికీ రైతులు ఇప్పటికీ మార్కెట్, కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలు, సాగునీటి సమస్యలతో పోరాడుతున్నారు. ప్రతి సీజన్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురయ్యే ఇబ్బందులు రైతు సంక్షేమంపై ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు భూకబ్జాలు, ఇసుక, మట్టి, గ్రానైట్ అక్రమ తవ్వకాలపై తరచూ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్య, వైద్య రంగాల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కొరతపై తరచూ నివేదికలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థల ఖర్చులు సాధారణ కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. నాణ్యమైన విద్య, వైద్యం ప్రతి పౌరుడి హక్కుగా మారాల్సిన పరిస్థితుల్లో ఈ రంగాల్లో ప్రభుత్వ జోక్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది.
రాజకీయంగా చూస్తే తొమ్మిదిన్నరేళ్లపాటు సాగిన బీఆర్ఎస్ పాలనపై ప్రజలు 2023 ఎన్నికల్లో తమ తీర్పు చెప్పారు. అభివృద్ధి, అవినీతి, అధికార కేంద్రీకరణ వంటి అంశాలు ఎన్నికల ప్రధాన చర్చగా మారాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోవాల్సిన కీలక బాధ్యతను మోస్తోంది. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా అనేక హామీలు అమలు దశలోనే ఉండటం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
పాలకులు, ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, అవినీతి, జవాబుదారీతనం లోపం, శాఖల మధ్య సమన్వయ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా సేవలు వేగంగా అందించేందుకు పరిపాలనా సంస్కరణలు అత్యవసరంగా మారాయి. అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు. ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పారదర్శక పాలనలతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మేధావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాలు, ప్రజల ఆశలు, ఆశయాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలను ప్రశంసించడం ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు ప్రశ్నించడం కూడా అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యంలో మేధావుల మౌనం సమాజానికి మేలు అసలే చేయకపోగా, కీడు చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం చారిత్రక విజయమే. అయితే రాష్ట్ర ఆవిర్భావం ఒక్కటే అంతిమ లక్ష్యం కాదు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే అసలు లక్ష్యం. రాబోయే సంవత్సరాలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించాలి. అదే సమయంలో ప్రజలు, మేధావులు, పౌరసమాజం ప్రభుత్వాలను నిరంతరం జవాబుదారీగా నిలబెట్టాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమం కలగన్న సమానత్వం, స్వాభిమానం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు నిజంగా సాకారమవుతాయి.

