ప్రజాస్వామ్యం అసలు బలం ఏకాభిప్రాయం. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలు రాజకీయ ప్రయోజనాలకే కాకుండా దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించే వేదికగా కాకుండా, జాతీయ సమ్మతిని నిర్మించే అవకాశంగా మలచగలిగితే ప్రజాస్వామ్యంపై విశ్వాసం మరింత బలపడుతుంది. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఆ దిశగా సాగుతాయా? లేక మరోసారి అధికార-ప్రతిపక్షాల మధ్య ప్రతిష్ఠంభనకే పరిమితమవుతాయా? అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ప్రజలంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఈ నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాలకు కీలక మలుపు కావొచ్చు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు, జనాభా లెక్కల అనంతరం చేపట్టాల్సిన నియోజకవర్గాల పునర్విభజన, మరోవైపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా సాగుతున్న చర్చలు దేశ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అయితే, దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఈ కీలక నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేస్తుందా?
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ కేవలం చట్టాలు చేసే వేదిక మాత్రమే కాదు. విభిన్న రాజకీయ అభిప్రాయాలకు వేదిక. గతంలో కీలక బిల్లులు, రాజ్యాంగ సవరణలు, జాతీయ భద్రత లేదా ఆర్థిక అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగేవి. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం కూడా ఒక రాజకీయ సంప్రదాయం. గత దశాబ్దంలో అలాంటి సంప్రదాయం క్రమంగా బలహీనపడింది. అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలను ఖాతర్ చేయడం లేదు. చర్చలకు ఆస్కారమివ్వడంలేదు. చర్చ కంటే సంఖ్యాబలాన్ని చూసి చంకలెగరేసుకుని నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాపాలన సాగుతోంది.
మహిళా రిజర్వేషన్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ, దాని అమలు జనాభా లెక్కలు, అనంతర డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సాధ్యమవుతుందని చట్టంలోనే పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్సభలో మొత్తం 543 స్థానాలు, రాజ్యసభలో 245 సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో హాజరై ఓటు వేసిన సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మద్దతుతో పాటు మొత్తం సభ్యుల సగానికి పైగా మద్దతు కూడా అవసరం. కాబట్టి సంఖ్యాబలం మాత్రమే కాదు, విస్తృత రాజకీయ సమ్మతి కూడా కీలకం.
డీలిమిటేషన్ అంశం మరింత సున్నితమైనది. 1971 జనాభాను ఆధారంగా చేసుకుని రాష్ట్రాల మధ్య లోక్సభ స్థానాల పంపిణీ కొనసాగుతోంది. 2001లో ఈ గడువును 2026 వరకు పొడిగించారు. ఇప్పుడు కొత్త జనాభా లెక్కల అనంతరం జరిగే పునర్విభజన దక్షిణ, ఉత్తర రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకూడదని కోరుతున్నాయి.
అలాంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.
ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రితో కలిపి మొత్తం 72 మంది మంత్రులు ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం మంత్రుల సంఖ్య లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 15 శాతం మించకూడదు. అంటే గరిష్ఠంగా 81 మంది వరకు మంత్రులను నియమించే అవకాశం ఉంది. అందువల్ల అవసరమైతే పాతవారిని తొలగించి, కొందరు కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చే వీలుంది. అయితే, మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు? ఎవరు తప్పుకుంటారు? అనే అంశంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. ప్రచారంలో ఉన్న పేర్లన్నీ రాజకీయ ఊహాగానాలు మాత్రమే.
ఆంధ్రప్రదేశ్కు అదనపు మంత్రి పదవి దక్కే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న రాష్ట్రానికి మరింత ప్రాతినిధ్యం లభిస్తుందా? అనే ఆసక్తి సహజమే. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే అది టీడీపీ, జనసేన లేదా బీజేపీకి దక్కుతుందా? అన్నది రాజకీయ సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించిన ప్రాతినిధ్యంపైనా చర్చ కొనసాగుతోంది. అయితే ఇవన్నీ అధికారిక ప్రకటన వెలువడే వరకు కేవలం రాజకీయ అంచనాలుగానే పరిగణించాలి.
పార్లమెంట్ సమావేశాల సక్సెస్ చర్చల నాణ్యత. చట్టాలు ఎంత వేగంగా ఆమోదం పొందాయన్న దానికంటే, వాటిపై ఎంత విస్తృత చర్చ జరిగిందన్నదే ప్రజాస్వామ్య ప్రమాణం. ప్రతిపక్షాల సూచనలు, అభిప్రాయాలను వినడం, రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవడం, పార్లమెంటరీ కమిటీల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యానికి అసలు బలం ఏకాభిప్రాయం. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలు రాజకీయ ప్రయోజనాలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు. అందువల్ల పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించే వేదికగా కాకుండా, జాతీయ సమ్మతిని నిర్మించే అవకాశంగా మలచగలిగితే ప్రజాస్వామ్యంపై విశ్వాసం మరింత బలపడుతుంది. రాబోయే సమావేశాలు ఆ దిశగా సాగుతాయా? లేక మరోసారి అధికార-ప్రతిపక్షాల మధ్య ప్రతిష్ఠంభనకే పరిమితమవుతాయా? అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ప్రజలంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు.

