-సారయ్య సారథ్యం దేనికి సంకేతం?
-3 బస్సులు, 30 కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లపై మేడారం తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
-ప్రస్తుత, భవిష్యత్ రాజకీయాలపై చర్చ
వరంగల్ కాంగ్రెస్ లో రచ్చ రచ్చ
వరంగల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. రాజకీయాల్లో ‘ చేయి ‘ తిరిగిన నేతల చేతలు మారుతున్నాయి. ఈ పరిణామాలు తూర్పు’ లో ‘మార్పు” కేనా? 3 బస్సులు, 30 కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లపై మేడారం తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణ పై అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సారథ్యం వహించారు. కార్పొరేటర్ గుండేటి నరేందర్, కరాటే ప్రభాకర్, గోరంట్ల రాజు, బస్వరాజు కుమారస్వామి వంటి పలువురు నేతలు, ముఖ్య కార్యకర్తలు దాదాపు 300 మంది హాజరయ్యారు. అయితే సారయ్య సారథ్యం దేనికి సంకేతం? సొంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక పార్టీ అధినాయకత్వం అనుమతి ఉందా? ఆశీస్సులు ఉన్నాయా? లోపాయికారీ గా ఆయనను ఇక్కడ పని చేసుకోమన్నారా? సారయ్య రాజకీయ జీవితమే తూర్పు నియోజకవర్గం (గతంలో వరంగల్) నుంచి పురుడు పోసుకుంది. ఇక్కడ నుంచి తన ప్రజా ప్రాతినిధ్యం కౌన్సిలర్, ఎమ్మెల్యేగా కొనసాగింది.

ఆత్మగౌరవానికి, తిరుగుబాటుకు ప్రతీకలైన మేడారం సమ్మక్క సారలక్క ల గద్దెలను తమ సమావేశ వేదికను చేసుకున్న వీళ్లంతా తిరుగుబాటుతో తిరుగుబావుటా ను ఎగురవేయనున్నారా? అసలు తూర్పు కాంగ్రెస్ రాజకీయాల్లో ఏమి జరుగుతున్నది? అన్న చర్చ, రచ్చ రచ్చ గా సాగుతున్నది.
గత కొంత కాలంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఆగమగంగా ఉంది. పార్టీ నేతలే బహిర్గతంగా చెప్పుకుంటున్న ప్రకారం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రి అయి ఏడాది కాకముందే, నియోజకవర్గ కేడర్ లో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ కోసం, సురేఖ గెలుపు కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేకపోగా, వేధింపులు ఎదురయ్యాయి. టగ్ ఆఫ్ వార్ గా పని చేసిన కార్యకర్తలే ఎమ్మెల్యే దంపతులకు టార్గెట్ అయ్యారు. బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఓ చోటా… బడా నేతకు విశ్వసనీయంగా మారిపోవడం మరింత సంకటంగా తయారైంది. సరిగ్గా ఈ సమయంలోనే అజామ్ జాహీ మిల్లు కార్మిక భవన స్థల వివాదం రాజుకుంది. gwmc అనుమతులు తీసుకుని, ఆ స్థలంలో నిర్మించాలని తలపెట్టిన షాపింగ్ సముదాయానికి కొండా మురళి కొట్టిన కొబ్బరికాయ, అగ్గికి ఆజ్యం పోసినట్టు అయింది. ‘ చోటా’ పుట్టిన రోజు వేడుకలు, కాంగ్రెస్ కార్యకర్తలకు కంటగింపుగా మారాయి. ఈ రెండు ఘటనలు కాంగ్రెస్ పార్టీలోని కొండా దంపతుల బాధితులను, వ్యతిరేకులను ఒక్కటి చేశాయి. దీనికి తోడు వాళ్ళ మౌనం, మరింతగా వాళ్ళకి నష్టం చేసింది. చేస్తూనే ఉంది.

ఇప్పుడు మిల్లు కార్మిక భవన స్థల వివాదం కాస్త, ప్రజా ఉద్యమంగా మారింది. అఖిలపక్షం, వామపక్షాలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, మిల్లు కార్మికుల కుటుంబాలు అన్నీ కలిసి ఐక్య వేదికగా ఏర్పడ్డాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు కొండా దంపతులకు వ్యతిరేకంగా, కార్మిక భవన స్థల వివాదం పై ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డికి ఆధారాలు అందచేశారు. ఈ పని కూడా బస్వరాజు సారయ్య నేతృత్వంలోనే జరిగిందని ప్రచారంలో ఉంది. ఇప్పుడు కొండా దంపతులను వ్యతిరేకిస్తున్న మిగతా నాయకులు అంతా ఒక్కటి అయి, సారయ్య పంచన చేరిపోతున్నారని తెలుస్తున్నది. ఇదే నిజమైతే, ఇప్పటికే కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు సహా అనేక వివాదాల్లో కూరుకుపోయిన కొండా దంపతులకు సమస్యలు తప్పకపోవచ్చు. పైగా మొన్నామధ్య జరిగిన టిపిసిసి పి ఎ సి సమావేశంలో సైతం పలువురు మంత్రులకు కేసీ వేణుగోపాల్ ఇచ్చిన క్లాస్ లో మంత్రి సురేఖ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా సారయ్య నాయకత్వంలో మేడారంలో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
వరంగల్ తూర్పు రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం ఏంటంటే… కొండా దంపతులకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోందా? రానున్న రోజుల్లో వరంగల్ తూర్పు లో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయన్నది స్పష్టం అవుతున్నది.

