ఆ ఇద్దరినీ కలిపిన ఓ (అ)న్యాయవాది
కార్మిక స్థలాన్ని కబ్జా చేసిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బంధువు
ఆ రాబందు(వు)కు సహకరించిన వరంగల్ తూర్పు అప్పటి ఎమ్మెల్యే
రూ.కోట్లు చేతులు తడిపి ఆ స్థలాన్ని కొల్లగొట్టిన బడా వ్యాపారి
కార్మిక భవన నిర్మాణానికి ఆనాడే రూ. 20 లక్షల ఎంపీ నిధులు
నిర్మాణాన్ని అడ్డుకున్న కార్మిక సంఘ నాయకులు
తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్న వాస్తవాలు
నిజానిజాల నిగ్గు తేలుస్తున్న “అడుగు” జాడలు
కార్మిక స్థలం, కాస్తంత భవనం కాదేది కబ్జా కనర్హం! కనిపించేదేదైనా కబ్జాదారులకు భోజ్యం! ఇదే సర్వత్రా వినిపిస్తున్న, కనిపిస్తున్న ప్రస్తుతం. 80 ఏళ్ల క్రితం నాటి అజం జాహీ మిల్లు కార్మిక భవన స్థలం ఇందుకు అతీతమేమి కాదు. కాలేదు.
వరంగల్ అజం జాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జా పరిస్థితి కంచె చేను మేసినట్లుగా మారింది. కార్మిక సంక్షేమానికి పాటుపడుతూ కార్మిక భవనాన్ని కాపాడాల్సిన సంఘ నాయకులే ఆ సంఘానికి విద్రోహులుగా మారారు. కార్మిక భవన స్థల కబ్జాకు కారకులయ్యారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు… తల్లి లాంటి మిల్లు కార్మిక భవన స్థలాన్ని రాబందుల పాలు చేశారు. ఆ కార్మిక భవన స్థలంలో మొదలైన నిర్మాణానికి అడ్డు గోడగా నిలిచి, అడ్డగోలుగా కబ్జాదారుల కు అప్పగించారు. ఓ హై కోర్టు న్యాయవాది ప్రమేయం, వరంగల్ తూర్పు నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే సహకారంతో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బంధువు తప్పుడు పత్రాలు సృష్టించి కొనుగోలు చేసి, వరంగల్ కు చెందిన ఓ బడా వ్యాపారికి ఓం నమశ్శివాయ చేసేసారు.
అజం జాహి మిల్లు కార్మిక భవనం మొత్తం మిల్లు స్థలాల మధ్యలోనే ఉంది. ఆ కార్మిక భవనం కూడా ఆ స్థలంలో 1944లో నిర్మించింది. 80 ఏళ్లుగా ఎన్నో కార్మిక ఉద్యమాలకు అడ్డాగా, సాక్షి గా నిలిచింది. మిల్లు ఆఖరి ఆనవాలుగా ఆ భవనం శిథిలావస్థలో నిలిచి ఉంది. అయినా, 1,333 గజాల విస్తీర్ణంలో ఉన్న రూ.15 కోట్ల విలువ చేసే ఆ స్థలం ప్రైవేటుపరం కావడంలో అధికారుల చేతివాటం, రాజకీయ నాయకుల అవినీతి, కార్మిక సంఘ నాయకుల కాసుల కక్కుర్తి, న్యాయవాది వ్యూహం,
డబ్బున్న వ్యాపారి స్వార్థం కలగలిసి మిల్లు కార్మిక భవన స్థలాన్ని కబళించి అన్యాక్రాంతం చేసేసింది.
అజం జాహి మిల్లు ఎంతో చారిత్రాత్మకమైoది. అంతే చరిత్ర కలిగింది కార్మిక భవనం. కార్మికులు దేవాలయంగా భావించే కార్మిక భవనం స్థలం విషయంలో వరంగల్ మహా నగర కార్పొరేషన్ మేయర్, అధికారులు కూడా అలసత్వం వహించడమే కాదు, ఆ బడా వ్యాపారి ప్రైవేటు నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చేశారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు కార్మిక భవన స్థలాన్ని అంతా కలిసి ఖతం చేసేసారు.
అందరినీ కలిపిన ఓ (అ)న్యాయవాది
పైగా హై కోర్టులో న్యాయవాదిగా పని చేసిన ఓ వ్యక్తి.. ఆ కార్మిక సంఘ ఇద్దరు నాయకులకు అనుసంధానంగా నిలిచి, మెల్లిగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బంధువును రంగంలోకి దింపాడు. అదే సమయంలో వరంగల్ తూర్పు అప్పటి ఎమ్మెల్యే ను కలిపి లేని కాగితాలను సృష్టించి కార్మిక సంఘ భవన స్థలాన్ని భవనం ఉండగానే ప్రైవేటు స్థలంగా చిత్రీకరించి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బంధువుకి రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు. ఆ బంధువు ద్వారా వరంగల్లోని ఓ బడా వ్యాపారికి ఆ స్థలాన్ని అమ్మారు. ఈ లావాదేవీల్లో కోట్ల రూపాయలు చేతులు మారి, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అంతా కలిసి పంచుకున్నారు.
ఎంపీ నిధులతో ముందుకు వచ్చిన బండా ప్రకాశ్


వరంగల్ అజం జాహి మిల్లుతో డాక్టర్ బండ ప్రకాష్ కు అవినాభావ సంబంధం ఉంది. కార్మికులు వీఆర్ఎస్ తీసుకొని విశ్రాంత ఉద్యోగులుగా జీవితాన్ని గడుపుతున్న క్రమంలో వారికి అజంజాహి మిల్లు భూముల్లోనే స్థలాలు ఇప్పించడంలో బండ ప్రకాష్ కృషి మరువరానిది. ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15 సందర్భంగా కార్మికుల వద్దకు వెళ్లి వారి వెన్నంటి ప్రకాష్ నడిచారు. అదే అనుబంధంతో ఆయన రూ.20 లక్షలు నిధులు ఇచ్చారు. ఆయన దఫా దఫాలుగా నిధులు ఇస్తానని ముందుకు వచ్చారు. ప్రొసీడింగ్ నెంబర్ 26/ఎంపీ లాడ్స్/బిపి/వరంగల్ అర్బన్/2018-19, తేది:12/02/2020 తో అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రోసీడింగ్ ఇచ్చారు.
కార్మిక భవన నిర్మాణాన్ని అడ్డుకున్న ఆ ఇద్దరు నేతలు
టెండర్లు పూర్తి అయి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ఆ పనులు జరగకుండా అప్పటి కార్మిక సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అడ్డుకున్నారు. సంఘం పేరుతో ఎవరెన్ని చెప్పిన వినకుండా నిర్మాణ పనులను సాగనివ్వలేదు. కాంట్రాక్టర్ ను బెదిరించి పంపించేశారు. అజం జాహి కార్మిక సంఘం పేరుతో ఇద్దరు నాయకులు చేసిన ఖర్మ, చివరికి కార్మిక భవనం కాలగర్భంలో కలిసేలా చేసింది.
ఆనాడే ఆ నిర్మాణం మొదలై ఉంటే..
అజం జాహీ మిల్లు కార్మిక భవన స్థల వివాదమే వచ్చేది కాదు. శిథిలావస్థలో ఉన్న పాత కార్మిక భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణం అయి ఉండేది. కార్మిక స్థలం రక్షింపబడేది. అన్యాక్రాంతమై ఇంతటి వివాదానికి దారి తీసేది కాదు. కొత్తగా కళకళలాడే ఆ భవనంలో కార్మిక కుటుంబాలు తమ భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుంటూ సేద తీరుతూ సంతోషంగా ఉండేవారు.
తవ్విన కొద్దీ నిగ్గు తేలుతున్న నిజాలు
అజం జాహి కార్మిక భవనం అన్యాక్రాంతమైన విషయంలో తవ్వుతున్న కొద్ది నిజాలు వెలుగు చూస్తున్నాయి. కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శుల హోదాలో ఇద్దరు వ్యక్తులు పెత్తనం చెలాయించి బండ ప్రకాష్ ఇచ్చిన ఎంపీ నిధులను వినియోగించకుండా, ఆ నిధులు మురిగి పోయేలా చేశారు. అనంతరం దొంగ పత్రాలతో కార్మిక భవనాన్ని కబ్జా చేసేందుకు ముందుకు వచ్చిన భూకబ్జాదారుడికి పూర్తిగా సహకరించారు. పెద్ద మొత్తంలో డబ్బులు కజేసి కార్మికులకు అన్యాయం చేశారు. అజం జాహి మిల్లు చివరి ఆనవాలైన కార్మిక భవనాన్ని ఆ ఇద్దరు నేతలు లేకుండా చేశారు. వారిలో ఒకరు మరణించగా, బతికున్న మరో వ్యక్తి కబ్జాదారుల వైపు నిలబడడం గమనార్హం.
కోర్టు విచారణలో మిల్లు కార్మిక భవన స్థలం
మరోవైపు అజo జాహి మిల్లు కార్మిక భవన స్థల వివాదం కోర్టు పరిధిలోకి పోయింది. ఇప్పటికే విచారణ పూర్తయి ఈ నెల 25వ తేదీకి తీర్పు రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
అంతా ఆ తాను ముక్కలే!
ఇక తర్వాత వచ్చిన పాలకులు కూడా గత పాలకుల పద్ధతిలోనే వ్యవహరించారు. దీంతో గత పాలకుల పాపాన్ని మోస్తూ, కొత్త సమస్యలకు కారణమయ్యారు. వాటి పర్యవసానాలను అనుభవిస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, కార్మిక కుటుంబ సభ్యులు అంతా ఏకతాటిపై వచ్చి ప్రజా ఉద్యమాలను నిర్మిస్తున్నారు. మిల్లు స్థలంలోనే కొత్త భవనం నిర్మించడం తప్ప మరో దారే కనిపించడం లేదు.

