కాసం ఇంట్లో కార్మిక భవన చిచ్చు

వరంగల్ అజంజాహి మిల్లు కార్మిక భవన కబ్జా అంశం కాసం నమశివాయ కుటుంబంలో గొడవలకు కారణమైందా? మాంగల్య వర్సెస్ మావోయిస్టులుగా పరిస్థితి మారిందనే విషయంలో ఆ కుటుంబం రెండుగా చీలిందా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వరంగల్ బట్టల బజార్లో మొదలైన కాసం పుల్లయ్య వస్త్ర వ్యాపారం మాంగల్య షాపింగ్ మాల్ పేరుతో వరంగల్ జిల్లాలోనే కాదు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలోనూ విస్తరించిన విషయం తెలిసిందే. వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న కాసం కుటుంబం కార్మిక భవన కూల్చివేత తర్వాత రెండుగా చీలిపోయినట్టుగా తెలుస్తోంది. నమశ్శివాయ ఒకవైపు అతని సోదరులు మరోవైపు రెండు వర్గాలుగా ప్రస్తుతం ఘర్షణ పడుతున్నట్లుగా సమాచారం. వేల మందికి ఉపాధినిస్తూ వందల కోట్ల వ్యాపారం చేస్తున్న తమకు… అజం జాహి కార్మిక భవన స్థల వివాదం నష్టం చేకూర్చిందని కాసం కుటుంబంలో మిగతా సోదరులు నమశ్శివాయ తీరును ఎండ గడుతున్నట్లు సమాచారం. చక్కగా బట్టల వ్యాపారం చేసుకుంటూ బాదుషాగా బతుకుతున్న మనకు ఈ వివాదం ఎందుకు? అవసరమా? అంటూ కుటుంబ సభ్యులు మొత్తం నమశివాయ మీద దుమ్మెత్తిపోస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు వస్తుందని అజంజాహి కార్మిక భవనం కొనడం సరికాదని సోదరులందరూ నిత్యం గొడవ పడుతున్నట్లు సమాచారం. ఓవైపు అజం జాహి కార్మికులు మరోవైపు బీజేపీ, ఎంసిపిఐ, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, లిబరేషన్, తెలుగుదేశం, కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిసి ఉద్యమాలు చేస్తుంటే, మావోయిస్టు పార్టీ సైతం, ఆ పార్టీలకు, కార్మికులకు మద్దతు పలుకుతూ, లేఖ విడుదల చేయడం కాసం ఫ్యామిలీలో ఘర్షణకు కారణమైనట్టు సమాచారం. బట్టల వ్యాపారంలో కోట్ల రూపాయలకు పడగలెత్తుతుంటే, కార్మిక భవన స్థలం వల్ల కలిగే ప్రయోజనాల కంటే చెడ్డ పేరు రావడాన్ని కాసం కుటుంబ సభ్యులు తీవ్రంగా భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు కారణమైన నవశివాయ తీరును సోదరులు ముక్తకంఠంతో విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది. మాంగల్య వర్సెస్ మావోయిస్టులుగా పరిస్థితి మారడం భవిష్యత్తులో తమకు ఇబ్బంది కలిగిస్తుందని కాసం కుటుంబ సభ్యులు కలత చెందుతున్నట్లు సమాచారం.

