-ఆ రెండు పక్షాలపై తీవ్ర ఒత్తిడి|CONGRESS|BRS
-అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కీలకం|KCR
-ఆత్మస్తుతి, పరనిందలో ప్రదాన పార్టీలు|PARTIES
-ప్రభుత్వం,ప్రతిపక్షం వ్యూహ ప్రతివ్యూహాలు
-రాజకీయాలకతీత పరిష్కారాలు సాధ్యమేనా?
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నీటి మంటలను రగులుస్తున్నాయి. నదీజలాలు, కేటాయింపులు, పంపిణీ, వినియోగం, ఆశనిపాతమైన ప్రభుత్వాల నిర్ణయాలు, సాగు నీటి ప్రాజెక్టులు, అమలులో జాప్యం, అవకతవకలు, అంతర్రాష్ట్ర వివాదాల స్థాయిని మించి, అధికార, విపక్షాల మధ్య రాజకీయ యుద్ధానికి దారి తీశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాదోపవాదాలు మాటల తూటాలై, శీతాకాలంలోనూ నీటి మంటలను పుట్టిస్తున్నాయి.
హైదరాబాద్, జనవరి 1 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్రంలో వ్యవసాయం ప్రధానంగా నదీజలాలపై ఆధారపడి ఉంది. గత కొన్ని ఏళ్లుగా ప్రాజెక్టుల పూర్తి ఆలస్యం, నదీజలాల వివాదాలు, నీటి పంపిణీలో అసమానతలు, పొరుగు రాష్ట్రాలతో వివాదాలు, ప్రభుత్వాల నిర్ణయాలు సాగుబడిని, రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమైనా, అవి పూర్తికాకపోవడం, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల్లో నిర్వహణ లోపాలు వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ పరిస్థితుల్లో నీటి సమస్యలు సహజంగానే రాజకీయ చర్చల్లో ప్రధానాంశంగా మారాయి.
గత పాలన వైఫల్యం కాంగ్రెస్ వ్యూహం
అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన రాజకీయ వ్యూహాన్ని స్పష్టంగా నిర్దేశించుకుంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే నేటి నీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు, కేంద్రంతో సమన్వయ లోపం, అంతర్రాష్ట్ర జలాల విషయంలో దృఢమైన వైఖరి లేకపోవడం వంటి అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించనుంది. ఇందుకనుగుణంగా అసెంబ్లీలో సీఎం పీపీటీని ఇవ్వనున్నారు. ఈ చర్చల ద్వారా పాలనలో తాము బాధ్యతగా వ్యవహరిస్తున్నామని, సమస్యలకు మూలం గత ప్రభుత్వమేనని నిరూపించాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహం.
ఆత్మస్తుతి, పరనింద బీఆర్ఎస్ ప్రతివ్యూహం
ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని రాజకీయంగా బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. నీటి హక్కుల పరిరక్షణ పేరిట ఆందోళనలు, నిరసనలు చేపట్టడం ద్వారా ప్రజల మద్దతు కూడగట్టాలని చూస్తోంది. తమ పాలనలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని ముందుకు తెచ్చి, ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపడం బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.
కేసీఆర్ హాజరే చర్చలకు కీలకం
వాడివేడి చర్చల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కీలకం కానుంది. ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన కేసీఆర్, సభకు వస్తారా? చర్చల్లో పాల్గొంటారా? అన్నది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన అనుభవం, వాక్చాతుర్యం, రాజకీయ వ్యూహాలు చర్చలను మరింత వాడివేడిగా మార్చే అవకాశం ఉంది. కేసీఆర్ పాల్గొనే చర్చలు కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే కాకుండా, బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయ పునర్నిర్మాణానికి, రాష్ట్రానికి కూడా మేలు చేయవచ్చు.
అధికార-విపక్షాలపై ఒత్తడి
అయితే, ప్రస్తుత చర్చలు అధికార విపక్షాలపై తీవ్ర ఒత్తిడిని పెంతున్నాయి. అసెంబ్లీలో చర్చకు సవాల్ విసరడం ద్వారా బీఆర్ఎస్ను నేరుగా ఎదుర్కొనాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ఒకవిధంగా ప్రతిపక్షానికి సదవకాశమే, అదే సమయంలో తమ పాలనలోని లోపాలపై వివరణ ఇవ్వాల్సిన ఒత్తిడిని కూడా పెంచుతుంది. అలాగే గత ప్రభుత్వాన్ని దోషిగా చూపి తప్పించుకోవడం కాకుండా, తమ హయాంలో చేపట్టిన చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు పాలనపై భరోసాని కల్పించాల్సిన ఒత్తిడి ఉంది. ప్రజలు గత, ప్రస్తుత వైఫల్యాలకు బాధ్యులెవరన్న దానిపై స్పష్టత కోరుతున్నారు.
రాజకీయాలకతీత పరిష్కారాలు సాధ్యమేనా?
రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల అవసరాలు. రైతుల కష్టాలు తీర్చే విధంగా చర్చలు జరిగి, నిర్ణయాలుండాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో చర్చలు రాజకీయ పార్టీల లాభనష్టాలకే పరిమితం కాకుండా, వాస్తవిక పరిష్కారాలకు దారితీయాల్సిన అవసరం ఉంది. అధికార–ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు సహజమే అయినా, అవి నిర్మాణాత్మక చర్చలకు దారితీస్తేనే ప్రజలకు ఉపయోగం. ఈ చర్చలు బాధ్యతాయుతంగా, శాశ్వత పరిష్కారాల దిశగా సాగాలని ప్రజలు ఆశిస్తున్నారు.
…

