భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి
భారత్ సమ్మిట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…., ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని తెలిపారు. తెలంగాణకు ఉన్న గొప్ప చరిత్ర, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ఆయన పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించేందుకు విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళలు కలిసిపడి ఏకగొంతుగా పోరాడిన నేపథ్యంలో, వారి త్యాగ ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, వాటి సాధన కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని ఆయన చెప్పారు.
సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, అణగారిన కులాల ఆకాంక్షలు నెరవేర్చడమే తన ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం ప్రారంభించిందని, 2024 ఆగస్టు 15న రూ.20,617 కోట్లు చెల్లించి 25.5 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తమదని అన్నారు. ఇదే దేశంలో అతిపెద్ద రుణమాఫీగా గుర్తింపు పొందిందని తెలిపారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా, ‘రైతు భరోసా’ పథకం ద్వారా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. భూమిలేని రైతుకూలీలకూ ఏడాదికి రూ.12,000 సాయం అందిస్తున్నామన్నారు. రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా అందిస్తున్నామని చెప్పారు. రైతుబీమా, పంటల బీమా వంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వివరించారు.
యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ’ని స్థాపించామని, అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 60 వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయగలిగామని రేవంత్ రెడ్డి గారు తెలిపారు. 5 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు.
జవహర్లాల్ నెహ్రూ నీటిపారుదల, విద్యపై దృష్టి పెట్టగా, ఇందిరా గాంధీ ‘రోటీ, కపడా, మకాన్’ నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నేతలు టెలికాం, సాఫ్ట్వేర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వివరించారు. వారి కృషితోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు.
దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ లాంటి దేశాల్లో పెట్టుబడుల సదస్సులకు హాజరై, రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో యువతకు ప్రైవేటు రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.
మహిళా సాధికారత కోసం విస్తృతమైన చర్యలు తీసుకున్నట్లు సీఎం వివరించారు. 67 లక్షల మంది స్వయం సహాయక బృంద సభ్యులు రాష్ట్రంలో ఉన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్నదే లక్ష్యమని చెప్పారు. సౌర విద్యుత్ సంస్థలు, పెట్రోల్ బంకుల యాజమాన్యం, ఆర్టీసీ బస్సుల నడిపింపు వంటి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించామన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల కుటుంబాలకు ఇళ్లు నిర్మించేందుకు రూ.22,000 కోట్లు మంజూరు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని వివరించారు. ఈ ఉచిత బస్సు ప్రయోజనానికి ఇప్పటివరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటివరకు రూ.1,000 కోట్లు అందించామని వివరించారు.
హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్లు సీఎం తెలిపారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేసి నగరానికి పెద్ద ఆకర్షణగా మార్చేందుకు పనులు చేపట్టామని వివరించారు. ప్రపంచ ప్రాముఖ్యత గల హడ్సన్, థేమ్స్, సుమిదా నదీ పునరుద్ధరణలను అధ్యయనం చేశామని చెప్పారు.
హైదరాబాద్ చుట్టూ 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి చేస్తున్నామని, 370 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. మెట్రో రైలు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, పేదలకు సంక్షేమం అందించడం తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
భారతదేశంలో మొదటిసారిగా కులసర్వే నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గర్వంతో తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంలో థర్డ్ జెండర్ రిక్రూట్మెంట్ చేసిన తొలి ప్రభుత్వం కూడా త
తెలంగాణెనని గుర్తుచేశారు.
“మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది,” అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల జీవితాలను మార్చే మిషన్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వారి అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను మాతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. “మీరే తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి,” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

