ప్రభుత్వాలను నడపడమంటే పరస్పర ఆరోపణలు కాదు. ఇచ్చిన హామీలు, విధానాలు అమలు చేయడం, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడం. కానీ నేటి రాజకీయాల్లో పాలన బాధ్యతా రాహిత్యం కాగా, అసెంబ్లీ సవాళ్ళకు వేదికగా మారిపోయింది.
ప్రశ్నించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్షమే, నీటి వాటా చర్చల్లో అసెంబ్లీకి రాలేక ఇరుకున పడటమే అత్యంత విషాదంగా కనిపిస్తోంది.
అసెంబ్లీని కాకుండా పార్టీ వేదికను ఎంచుకోవడం దేనికి సంకేతం? సభలో చర్చను బహిష్కరించడం ప్రతిపక్షం బాధ్యతేనా? సభకే రాకుండా ఉండటం ప్రతిపక్ష నేతకు భావ్యమేనా? తమకు అవమానం జరిగిందని, సభను అవమానించడం తగునా? గత పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇలా ప్రవర్తించడాన్ని పారిపోవడంగా అధికార పార్టీ ఆరోపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీపై ప్రజలేమనుకుంటారు? ఇది ప్రతిపక్షానికి శుభసూచకమేనా? అసలు ప్రజాస్వామ్య పద్ధతేనా? అసెంబ్లీనే చర్చలకు వేదికగా భావించలేని రాజకీయ సంస్కృతి ఎటు దారి తీస్తుంది?
అప్పట్లో తీసుకున్న నిర్ణయాలే నేటికీ, రాష్ట్రానికి దీర్ఘకాలిక పరిమితులు విధిస్తున్నాయా? లేక ఆ నిర్ణయాలను సవరించకునే అవకాశాలేమైనా ఉన్నాయా? అవేంటి? ఎలా? అన్నవే ఇప్పుడు కీలకంగా చర్చించాల్సిన అంశాలు. అధికార ప్రతిపక్షాలు వీటిని విస్మరించి, రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే విచిత్ర వితండ వాదనలకు దిగుతుండటమే విచారకరం.
సాగునీరు వంటి అంశాలు, చర్చలు, నిర్ణయాలు పార్టీల రాజకీయ ప్రయోజనాలకంటే, ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన జరగాలి. అందుకు తగ్గట్లుగా అధికార, ప్రతిపక్షాలు సహా పార్టీలన్నీ కట్టుబడాలి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రభుత్వాలను నడపడమంటే ఆరోపణలు చేసుకోవడం కాదు. ఇచ్చిన హామీలు, విధానాలు అమలు చేయడం, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపడం. కానీ నేటి రాజకీయాల్లో పాలన బాధ్యతా రాహిత్యం కాగా, అసెంబ్లీ సవాళ్ళకు వేదికగా మారిపోయింది. తెలంగాణలో కృష్ణా–గోదావరి జలాల వాటాపై జరుగుతున్న రాజకీయ రచ్చే ఇందుకు ఉదాహరణ. ‘రాష్ట్రానికి అన్యాయం జరుగుతూంటే చూస్తూ ఊరుకోను, తోలు తీస్తా’నంటూ మొదలు పెట్టిందే కేసీఆర్. దీన్ని అవకాశంగా తీసుకున్న సీఎం రేవంత్, ‘కృష్ణా–గోదావరి జలాలపై ఏకంగా అసెంబ్లీలోనే చర్చిద్దాం రండి!’ అంటూ సవాల్ విసిరారు. ఇదే సావకాశంగా సభలోనే చర్చించి, వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పోగా, ఆ పార్టీ అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించింది. పైగా పోటీగా పార్టీ కార్యాలయంలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నిలదీత సరే, అసెంబ్లీని కాకుండా పార్టీ వేదికను ఎంచుకోవడం దేనికి సంకేతం? సభలో చర్చను బహిష్కరించడం ప్రతిపక్షం బాధ్యతేనా? సభకే రాకుండా ఉండటం ప్రతిపక్ష నేతకు భావ్యమేనా? తమకు అవమానం జరిగిందని, సభను అవమానించడం తగునా? గత పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇలా ప్రవర్తించడం తప్పించుకోవడంగానో? పారిపోవడంగానో అధికార పార్టీ ఆరోపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీపై ప్రజలేమనుకుంటారు? ఇది ప్రతిపక్షానికి శుభసూచకమేనా? అసలు ప్రజాస్వామ్య పద్ధతేనా? అసెంబ్లీనే చర్చలకు వేదికగా భావించలేని రాజకీయ సంస్కృతి ఎటు దారి తీస్తుంది? ఇది సభను అవమానించడం, ప్రజలను వంచించడం కాదా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తక మానవు.
తప్పులేకపోతే అసెంబ్లీ చర్చల నుంచి తప్పుకోవడం ఎందుకు? అనే ప్రశ్న సూటిగా బీఆర్ఎస్ గులాబీలకు ముల్లులా గుచ్చుతోంది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 299 టీఎంసీల నీటి వాటాకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందా? లేదా? ఒప్పుకుంటే ఎందుకు? ఒప్పుకోకపోతే ఆ పార్టీకి వచ్చిన ముప్పేంటి? జూరాల నుంచి కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసే నిర్ణయం ఎందుకు జరిగింది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పూర్తైన పనులు ఎంత శాతం? ఖర్చు చేసిన నిధులెన్ని? అన్నవి ప్రధాన ప్రశ్నలు. వీటికి సమాధానమివ్వాల్సిన ప్రతిపక్షం, అసలు తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ అంటూ ఆరోపణలకు దిగుతోంది. అసలు సీఎంకు సాగునీటి ప్రాజెక్టులపై కనీస తెలివి లేదని ఒకరు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని మరొకరు, తోలు తీస్తామని అధినేత చేసిన ఆరోపణలన్నీ, ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ ముందు తేలిపోతున్నాయి. పైగా ప్రశ్నించి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన ప్రతిపక్షమే, నీటి వాటా చర్చల్లో అసెంబ్లీకి రాలేక ఇరుకున పడటమే అత్యంత విషాదంగా కనిపిస్తోంది.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు దక్షిణ తెలంగాణకు సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దారు. అయితే, ప్రాజెక్టు వ్యయం, కాలపరిమితి, అనుమతులు, విద్యుత్ వ్యయం వంటి అంశాలు ఆది నుంచే విమర్శలకు గురవుతున్నాయి. ఇది వెనుకబడిన పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు ఆశాకిరణమైతే, ఆర్థిక భారంగా మారుతుందన్న ఆరోపణలున్నాయి. ఈ పరస్పర నిందారోపణల నుంచే కృష్ణా–గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తెరమీదకు వచ్చింది. సమస్యను పార్టీల ప్రెస్ మీట్లు, సభా వేదికల నుంచి అసెంబ్లీ చర్చల దాకా లాగింది బీఆరెఎస్సే. బీఆర్ఎస్ ను అసెంబ్లీకి లాగింది సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి చర్చ నుం చి తప్పకుంది బీఆర్ఎస్.
నీటి వివాదాలు రాష్ట్రాల ప్రయోజనాలు, సాంకేతిక అంశాలు, రాజకీయ చతురత, న్యాయపరమైన నేర్పరితనం, కేంద్రంతో సమన్వయం అనే పరిష్కారాలపై ఆధారపడతాయి. అయితే, అప్పట్లో తీసుకున్న నిర్ణయాలే నేటికీ, రాష్ట్రానికి దీర్ఘకాలిక పరిమితులు విధిస్తున్నాయా? లేక ఆ నిర్ణయాలను సవరించకునే అవకాశాలేమైనా ఉన్నాయా? అవేంటి? ఎలా? అన్నవే ఇప్పుడు కీలకంగా చర్చించాల్సిన అంశాలు. అధికార ప్రతిపక్షాలు వీటిని విస్మరించి, రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే విచిత్ర వితండ వాదనలకు దిగుతుండటమే విచారకరం.
సాధికార చర్చకు అసెంబ్లీ అసలైన వేదిక. ప్రజలకు నేరుగా చేరే సిసలైన ప్రచార ప్రసార వాహకం. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధమే అయినా, దాన్ని వినియోగించే విధానం కూడా ముఖ్యమే. సభలోనే ఆధారాలతో ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రత్యామ్నాయ విధానాలు ప్రతిపాదించడం ప్రతిపక్షం బాధ్యత. బయట పోటీ పీపీటీలు, రాజకీయ ప్రచారం, తక్షణ లాభం కావచ్చూమోగానీ, సమగ్ర చర్చకు అది దీర్ఘకాలిక ప్రత్యామ్నాయం కాజాలదు.
ప్రజల ఆకాంక్షలు, రైతుల ఆశలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజాస్వామ్య సంస్కృతిని కూడా రాజకీయ పార్టీలు గుర్తెరిగి ప్రవర్తించాలి. అన్నింటికంటే ముఖ్యంగా సాగునీరు వంటి అంశాలు, చర్చలు, నిర్ణయాలు పార్టీల రాజకీయ ప్రయోజనాలకంటే, ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన జరగాలి. అందుకు తగ్గట్లుగా అధికార, ప్రతిపక్షాలు సహా పార్టీలన్నీ కట్టుబడాలి.

