ఈరోజు నాకు జరిగింది..
రేపు మీకూ జరుగుతుంది
ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి
రేవంత్ సర్కార్పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తన వివరణ తీసుకోకుండా, తనకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బర్తరఫ్ చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. “నా బర్తరఫ్ చెల్లదు. నా వివరణ తీసుకోకుండా నన్ను ఎలా బర్తరఫ్ చేస్తారు?” అని ఆమె నిలదీశారు. తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని స్పష్టం చేశారు. సుస్మిత వ్యక్తిగత అభిప్రాయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె అభిప్రాయాలను తప్పుపట్టే అధికారం తమకు లేదని అన్నారు. తన కూతురు ఏదో ఒక మాట అన్నందుకు తనను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇదే సమయంలో సీఎం రేవంత్రెడ్డి పాలనపై కూడా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు.. మీకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ఈరోజు తనకు జరిగిన పరిణామం రేపు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఎదురుకావచ్చని హెచ్చరించారు. ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రజలకు ఇస్తామన్న హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే నిర్వహించాలని సూచించారు.
తన కూతురు సుస్మితకు పార్టీ టికెట్ కోరడంలో తప్పేముందని సురేఖ ప్రశ్నించారు. పదేళ్లుగా తన కూతురు టికెట్ కోసం ప్రయత్నిస్తోందని తెలిపారు. అరవింద్ బీజేపీలో ఉంటే.. సంజయ్ కాంగ్రెస్లో లేరా? అని ప్రశ్నించారు. కడియం తన కూతురిని రాజకీయంగా ఎంపిక చేసుకోలేదా? అని ప్రస్తావిస్తూ, సుస్మిత టికెట్ అడిగితే తప్పేంటని నిలదీశారు. తనను రాజీనామా చేయాలని ఎవరూ అడగలేదని, తనకు సమాచారం ఇవ్వకుండానే బర్తరఫ్ చేశారని ఆరోపించారు. తన కూతురు వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు తాను ఎందుకు ఖండన ఇవ్వాలని ప్రశ్నించారు. 100 మంది నన్ను విమర్శిస్తున్నారు.. వారి కుటుంబ సభ్యులను బాధ్యులను చేస్తున్నారా? అని నిలదీశారు.
మరోవైపు సుమంత్ అరెస్టు కక్షపూరిత చర్యేనని కొండా సురేఖ ఆరోపించారు. టీడీపీ నేపథ్యం ఉన్నవారు ఇలాంటి చర్యలకు పాల్పడతారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తనను కావాలనే మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తన వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు దక్కడం సంతోషంగా ఉందని చెప్పారు. తనకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని స్పష్టం చేశారు.
రెండున్నరేళ్లపాటు మంత్రిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించానని కొండా సురేఖ తెలిపారు. తన పేషీకి వచ్చిన ప్రతి పనిని న్యాయబద్ధంగా పూర్తి చేశానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. తనను బర్తరఫ్ చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలు ఇచ్చారు. తనపై విమర్శలు చేసినవారిని ఉద్దేశించి నన్ను అన్నవాళ్లకు ఉరుసు తగులుతుంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో మరింత రాజకీయ వేడిని పెంచాయి. మంత్రి పదవి నుంచి తొలగింపు వ్యవహారం నేపథ్యంలో ఆమె తదుపరి రాజకీయ అడుగు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

