పులుల జన సంచారం ఒక హెచ్చరిక. ఇది ప్రకృతి మనకు ఇస్తున్న చివరి సంకేతం. ఇప్పటికైనా మేల్కొని అడవులను కాపాడితేనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. లేదంటే అభివృద్ధి పేరుతో మనమే మన భవిష్యత్తును నాశనం చేసుకున్న వారమవుతాం. అడవులను రక్షించడం అంటే కేవలం పులులను మాత్రమే కాదు, మనల్ని మనం రక్షించుకోవడమే.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
పర్యావరణ సమతౌల్యానికి పులులు ప్రతీకలు! జీవ వైవిధ్యానికే జీవం పులులు!! అడవుల్లో పులి ఉందంటే, అక్కడ జీవవైవిధ్యం సరిగ్గా ఉందని అర్థం. అందుకే 1973కు ముందు జాతీయ జంతువుగా ఉన్న సింహాన్ని కాదని పులిని ప్రకటించారు. ఇది దయ, బలం, చురుకుదనం, శక్తికి ప్రతీక. వన్యప్రాణి సంరక్షణకు చిహ్నం. అటువంటి కీలకమైన వన్యప్రాణి నేడు అడవులను విడిచి గ్రామాలు, పట్టణాల అంచులలో సంచరిడానికి కారణం మానవులే. మనమే. అడవులను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం, కొండలను విధ్వంసం చేయడం, సహజ వనరులను లూటీ చేయడమే ఈ సంక్షోభానికి మూలం.
అడవులు జంతుజాలానికి ఆవాసాలు. ఆవాసాలే నశించి, వాటి మనుగడ ప్రమాదంలో పడుతుంటే, అవి ఎక్కడికెళ్ళాలి? అడవులు పచ్చగా ఉన్నంతకాలం పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు అడవుల్లోనే ప్రశాంతంగా జీవించాయి. కానీ, అభివృద్ధి పేరుతో సాగుతున్న అడవుల విధ్వంసం వన్యప్రాణులను బలవంతంగా మనుషుల మధ్యకు నెట్టేస్తోంది. దీంతో పులులు గ్రామాల్లోకి రావడం, ప్రజల్లో భయాందోళనలు చెలరేగడం సహజంగా మారింది.
ఏపీ, తెలంగాణాల్లో ఇటీవల పులుల సంచారం పెరగడం ఇదే చేదు నిజానికి నిదర్శనం. నల్లమల, తిరుమల కొండలు, అమ్రాబాద్, కాగజ్నగర్, ఆసిఫాబాద్, భూపాలపల్లి వంటి అటవీ ప్రాంతాల్లో పులుల కదలికలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వ్ లో పులుల సంఖ్య పెరగడంతో అక్కడ స్థలం సరిపోక, కొత్త ఆవాసాల కోసం అవి తెలంగాణ వైపు కదులుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులను ఈదుకుంటూ పులులు ప్రయాణిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చేసుకోవచ్చు.
అడవుల విస్తీర్ణం తగ్గడం, అటవీ కారిడార్లు ఛిన్నాభిన్నం కావడం వల్ల పులులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సురక్షితంగా కదలలేకపోతున్నాయి. దీంతో అవి వ్యవసాయ పొలాలు, గ్రామాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇది మనుషులకు మాత్రమే కాదు, పులులకు కూడా ప్రమాదకరం. ఒకవైపు పంట నష్టం, ఆస్తి విధ్వంసం జరుగుతుండగా, మరోవైపు వేటగాళ్ల ఉచ్చులు, రోడ్డు ప్రమాదాల్లో పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రకాశం జిల్లాలో వాహనం ఢీకొని ఓ పులి మృతి చెందడం మన నిర్లక్ష్యానికి నిదర్శణం.
ఇప్పటికే గ్రామాల్లో కోతులు విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. పులులు, చిరుతలు కూడా అదే బాటలో వస్తే పరిస్థితి ఎంత భయానకంగా మారుతుందో ఊహించుకోవడం కష్టం కాదు. సమస్యను మూలంలోనే పరిష్కరించకుండా, వన్యప్రాణులను తరిమికొట్టే చర్యలతో సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉంది. అడవులను కాపాడకపోతే, రేపు మనుషులే తమతోపాటు తమ నివాసాలను వాటి బారి నుండి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు, ట్రాకర్లు, ప్రత్యేక గస్తీ బృందాలతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. కానీ వాటిని నియంత్రించలేరు. ఈ సమస్యకు అసలైన పరిష్కారం అడవుల సంరక్షణలోనే ఉంది. అటవీ కారిడార్లను పునరుద్ధరించడం, అక్రమ నరికివేతను అరికట్టడం, కొండలను సంరక్షించడం అత్యవసరం. అభివృద్ధి ప్రణాళికలలో పర్యావరణ ప్రభావ అంచనాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇంకా పులులు సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. పులిని శత్రువుగా కాకుండా పర్యావరణ రక్షకుడిగా చూడగల దృష్టి రావాలి. సమాచారాన్ని వెంటనే అటవీశాఖకు అందించడం, వేటగాళ్లను నిరోధించడం ప్రజల బాధ్యత. ఎందుకంటే అడవులు ఉంటేనే మనం ఉంటాం. పులులు ఉంటేనే అడవులు ఉంటాయి.
పులుల జన సంచారం ఒక హెచ్చరిక. ఇది ప్రకృతి మనకు ఇస్తున్న చివరి సంకేతం. ఇప్పటికైనా మేల్కొని అడవులను కాపాడితేనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. లేదంటే అభివృద్ధి పేరుతో మనమే మన భవిష్యత్తును నాశనం చేసుకున్న వారమవుతాం. అడవులను రక్షించడం అంటే కేవలం పులులను మాత్రమే కాదు, మనల్ని మనం రక్షించుకోవడమే.

