ఆతర్వాత పర్మీషన్లు
అది కచ్చితంగా కార్మిక భవనమే
80 ఏండ్లుగా మనుగడలో ఉన్నది నిజమే
41ఏళ్ళ క్రితం రికార్డులు చెబుతున్న వాస్తవమిదే
తేల్చిచెప్పిన 1984నాటి పాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్
స్పష్టం చేస్తున్న ఆస్తి పన్ను విధింపు రికార్డుల సర్టిఫై కాపీ
‘‘అడుగు’’ అందిస్తున్న ప్రత్యేక పరిశోధనాత్మక, ఎక్స్ క్లూజివ్ సెన్సేషన్
ఒక స్థలానికి ఒక రిజిస్ట్రేషన్. ఒక ఆస్తికి ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటాయి. కానీ అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలం విషయంలో రెండు రిజిస్ట్రేషన్లు జరగాయి. అతి జాగ్రత్తోలేక ముందు జాగ్రత్తో కానీ, అక్కడ భవనం ఉండగానే వ్యవసాయ భూమిగా, గ్రుహ సంబంధ ఆస్తిగా రెండు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. మొదటి రిజిస్ట్రేషన్ ద్వారా అక్కడ అసలు భవనమే లేదని భూ కబ్జాకు తెరలేపిన దళారులు, ఈ రెండో రిజిస్ట్రేషన్ ఆధారంగానే షాపింగ్ మాల్ బహుళ అంతస్తుల భవనానికి పర్మీషన్ పొందారు. అవినీతి అలవాటుగా అధికారులు పర్మీషన్లు ఇచ్చేశారు. అసలు రికార్డులు ఉన్నాయా? అవేం చెబుతున్నాయి? భవనం ఉన్నది నిజం. అయితే అప్పటి వరంగల్ మున్సిపాలిటీలో ఆ భవనానికి పన్నులు కట్టి ఉండాలి కదా. కట్టారా? లేదా? ఏ పేరుతో ఎంత కట్టారు? అప్పటి మున్సిపాలిటీకి కొనసాగింపుగా ఇప్పటి వరంగల్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ లో రికార్డులు ఏం చెబుతున్నాయి? ఆ రికార్డుల్లో ఏముంది? ‘‘అడుగు’’ అందిస్తున్న ప్రత్యేక పరిశోధనాత్మక, ఎక్స్ క్లూజివ్ సెన్సేషన్. జస్ట్ ఫర్ యూ…
తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడమనే మాయాజాలానికి అజంజాహీ మిల్లు కార్మికభన స్థలానికి మించిన మహా ఉదాహరణ మరోటి లేదు. ప్రజల హక్కుల పేరిట పోరాటాల కపటనాటకాలాడి, కార్మికుల ఆస్తిపై కన్నేసిన ఓ న్యాయవాది… పిల్లలు లేని తండ్రికి పుట్టుకొచ్చిన ఓ వారసుడు… ప్రజల ఓట్లతో గెలిచి, వారి ఆస్తులకు అండగా నిలవాల్సిందిపోయి, ఆ ఆస్తులను కబళించిన ఓ ప్రజాప్రతినిధి… కాసుల గళగళలే తప్ప, కార్మికుల విలవిలలు పట్టని, ఆ స్థలానికి వెలకట్టిన కబ్జాలకు కరడుగట్టిన ఓ వ్యాపారి… మనీ మాయలో కార్మిక సంఘ విద్రోహానికి పాల్పడిన కార్మిక నాయకులు…ఈ ఆరుగురి కపట నాటకంలో కాసుల కక్కుర్తికి అలవాటు పడిన అవినీతి అధికారులు… అంతా కలిసి అజం జాహీ మిల్లు కార్మిక భవనాన్ని, స్థలాన్ని హాం ఫట్ అంటూ మింగేశారు. కంటికి కనిపిస్తున్న కార్మిక భవనమే లేదని రికార్డులను మార్చేశారు. అతి జాగ్రత్తోలేక ముందు జాగ్రత్తో కానీ, కార్మిక భవన స్థలాన్ని గ్రుహ ఆస్తిగా, వ్యవసాయ భూమిగా రెండుగా రిజిస్ట్రేషన్లు చేసేశారు. రికార్డులను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆర్టీఐ చట్టం ఉందనీ, రికార్డులను ఎవరూ చెరిపేయలేరని, చివరకు ఆ రికార్డులు తమ అవినీతి చర్యను, అక్రమాలను పట్టిస్తాయన్న భయం, బెరుకు లేకుండా అందిన కాడికి బరికేశారు. ఫలితంగా ఇప్పుడు అజంజాహీ మిల్లు కార్మికులు రోడ్డునపడ్డారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో నెలలుగా ఆందోళనలు చేసినా
కానీ, అధికారంలో ఉన్నవారికి చీమ కుట్టినట్లయినా కావడం లేదు. ఇది అధికారంతో అంటకాగితే వచ్చిన తోలు మందానికి నిదర్శనం కాకపోతే మరేంటి? అనేది అజంజాహీ మిల్లు కార్మికుల మనోవేదన.
కబ్జా కోరులకు అధికార యంత్రాంగం, ఆ యంత్రాంగానికి రాజకీయ పలుకుబడి తోడైతే ఏదైనా జరగొచ్చు అనడానికి అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలమే ప్రబల నిదర్శనం. మిల్లు కార్మిక భవన స్థలాన్ని గ్రుహ ఆస్తిగా, వ్యవసాయ భూమిగా రెండుగా రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఏదో ఒక రిజిస్ట్రేషన్ సబబు. ఒకటి జరిగితే రెండోది జరగడానికి వీలులేదు. కానీ రెండూ జరిగిపోయాయి. ఒకటి అక్కడ కార్మిక భవనం ఉంది అనే విషయాన్ని స్పష్టం చేస్తుండగా, మరోటి అక్కడ అసలు కార్మిక భవనమే లేదు వ్యవసాయ భూమిగా నిర్ధారణ చేస్తున్నది. అయితే అక్కడ కార్మిక భవనం ఉంది. దాన్ని కూల్చే ప్రయత్నం జరిగింది. దాన్ని కార్మికులు అడ్డుకున్నారు. అంటే కార్మిక భవనం ఉంది. వ్యవసాయ భూమి కాదు అని నిర్ధారణ జరిగిపోయింది. కాబట్టి, రెండో రిజిస్ట్రేషన్ నిర్ధారణ జరగాల్సి ఉంది. అంటే ఆ స్థలంలో భవనం ఉందా? లేదా? ఉంటే ఏ పేరుతో ఉంది? దానికి ఏమైనా పన్నులు కట్టారా? అప్పటి వరంగల్ మున్సిపాలిటీలో ఏవిధమైన రికార్డులు ఉన్నాయి? అప్పటి మున్సిపాలిటీకి కొనసాగింపుగా ఇప్పటి వరంగల్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న రికార్డులను పరిశీలిస్తే… అన్న ఆలోచనలను ఆచరణలో పెట్టడం జరిగింది. ఇందుకు ‘‘అడుగు’’ ఓ అడుగు ముందుకేసి ప్రయత్నాలు చేసింది. మిల్లు కార్మిక సంఘాల నేతలు, అఖిల పక్ష నేతల సహకారంతో ఇప్పటికే అనేక ఆధారాలను బయట పెట్టిన నేపథ్యంలో రికార్డులను కూడా సర్టిఫైడ్ కాపీలుగా తీసుకుని పరిశీలించనైనది.


వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 1984నాటి పాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ (ఆస్తి పన్ను విధింపు) రికార్డుల సర్టిఫై కాపీని తేదీ: 06-01-2025న అధికారికంగా తీసుకోవడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న అప్పటి అసెస్మెంట్ బిల్లును పరిశీలించగా 1984లో అప్పటి వరంగల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ (ఆస్తి పన్ను విధింపు) ప్రకారం ఎజె మిల్స్ స్టాఫ్ సి… వగైరా పేరున రకరకాల పద్దుల సవరింపులతో చివరకు రూ.135.55 పై.ల పన్ను విధించినట్లుగా ఉంది. మొత్తానికి 1984 నాటి రికార్డుల ప్రకారమే అంటే 41 ఏళ్ళ క్రితమే అది అప్పటి వరంగల్ మున్సిపాలిటీలో ఒక ఇంటి నెంబర్ కలిగి ఉండటమేగాక, ఆ భవనానికి ఆస్తి పన్ను కింద పన్ను కట్టినట్లుగా కూడా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ఇంటి నెంబర్ తో ఉన్న కార్మిక భవనాన్ని, ఆ భవనం నిర్మించి భౌతికంగా కనిపిస్తుండగానే, దాన్ని వ్యవసాయ భూమి కింద రిజిష్ట్రేషన్ చేసిన ఘనత అప్పటి వరంగల్ ఎమ్మార్వోకే దక్కింది. నిన్న మొన్న కూల్చిన భవన స్థలం వ్యవసాయ భూమి ఎలా అయిందో? ఆ రెవిన్యూ అధికారికే తెలియాలి. ఆ రిపోర్టుల ఆధారంగా అదే స్థలంలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకోవడానికి ఓ వ్యాపారికి అనుమతులిచ్చిన కార్పొరేషన్ అధికారుల బరితెగింపునకు, అంత గుడ్డిగా సంతకాలు చేసిన ఆ అధికారులకి ఇంకా బతికి ఉంటే ఏ శిక్షలు ఖరారు అవుతాయో, న్యాయ నిపుణులే చెప్పాలి. అంతకంటే ముందు ఇంత దర్జాగా కబ్జాకు పాల్పడిన భూదాహ దురహంకారులకు, వారికి మద్దతు పలుకుతున్న మహానుభావులకు ప్రజలు, కార్మికులు ఏ సన్మాన, సత్కారాలు చేస్తారో చూడాలి.
కార్మిక భవనాన్ని కూల్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ ను కలిసి అఖిలపక్ష నేతల డిమాండ్

వరంగల్ అజం జాహీ కార్మిక భవనం కూల్చివేతకు కారణమైన వారిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారద దేవిని వరంగల్ ఆజంజహి మిల్ భూముల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్ కు ఒక విజ్నాపణ పత్రాన్ని అందచేశారు. కార్మిక భవన స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన పెద్దపల్లి వాసి గొట్టిముక్కల నరేష్ రెడ్డి, ఆ స్థలాన్ని కొని, భవనాన్ని కూల్చి వేసిన కాసం ఓం నమఃశివాయ లపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 80 ఏళ్ళుగా కార్మికుల పోరాటాలకు వేదికగా నిల్చిన కార్మిక భవనానికి మున్సిపాలిటీ ఇంటి నెంబర్ కలిగివున్నప్పటికీ 2016లో అప్పటి వరంగల్ ఎమ్మార్వో వ్యవసాయ భూమిగా మ్యుటేషన్ చేశారని అవినీతి జరిగిందనడానికి ఇంతకంటే ఆధారాలు ఏమి కావాలని వారు ప్రశ్నించారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జెఎసి కన్వీనర్ గంగుల దయాకర్, డాక్టర్ కొణతం కృష్ణ, పెరుమాళ్ళ లక్ష్మణ్, కొంపెల్లి ప్రవీణ్, జి. క్రాంతి కుమార్, ఆకెన వెంకటేశ్వర్లు, గంజి సాంబయ్య, బిళ్ళ శంకర్ తదితరులు ఉన్నారు.

