నిజాం కాలం నాటి పటేల్–పట్వారీ వ్యవస్థ నుంచి నేటి జీపీఓల దాకా వచ్చిన మార్పులు గ్రామ పరిపాలన స్వరూపాన్నే మార్చేశాయి. అయితే, ప్రతి మార్పు కొత్త అవకాశాలతోపాటు సరికొత్త సవాళ్లను కూడా మోసుకొచ్చింది.
సాయి సందేశ్ తేజ మార్గం ప్రత్యేక వ్యాసం
నిజాం కాలం నాటి పటేల్–పట్వారీ వ్యవస్థ నుంచి నేటి జీపీఓల దాకా వచ్చిన మార్పులు గ్రామ పరిపాలన స్వరూపాన్నే మార్చేశాయి. అయితే, ప్రతి మార్పు కొత్త అవకాశాలతోపాటు సరికొత్త సవాళ్లను కూడా మోసుకొచ్చింది.
పటేల్, పట్వారీ వ్యవస్థలో గ్రామ పరిపాలన వ్యక్తి కేంద్రంగా ఉండేది. పటేల్ గ్రామ చట్ట నాయకత్వాన్ని, పట్వారీ భూమి రికార్డులను నిర్వహించేవారు. ఈ వ్యవస్థలో స్థానిక పరిజ్ఞానం, గ్రామస్థులతో సన్నిహిత సంబంధాలు బలంగా ఉండేవి. అదే సమయంలో వారసత్వ నియామకాలు, పారదర్శకత లోపం, అధికార దుర్వినియోగం వంటి విమర్శలు కూడా ఉండేవి. భూసంబంధిత వివాదాలు, ఆదాయ రికార్డుల లోపాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేవి.
రాష్ట్ర ఏర్పాటుతోపాటు పరిపాలనలో సంస్కరణల అడుగులు పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ కాలంలో మండల వ్యవస్థ వచ్చింది. రెవెన్యూ విభజనలు జరిగాయి. గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓలు) నియామకం వంటి చర్యలు గ్రామ పాలనను వ్యవస్థీకృతం చేయడానికి ప్రయత్నించాయి. అయితే వీఆర్ఓ వ్యవస్థ కూడా పరిమిత సిబ్బంది, అధిక పనిభారం, సాంకేతిక పరిజ్ఞానం లోపం వంటి సమస్యలతో నిలదొక్కుకోలేకపోయింది. దీంతో తెలంగాణలో కేసీఆర్ కాలంలో ఈ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేసి, ఆ సిబ్బందీ మొత్తాన్ని వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు.
తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీపీఓల వ్యవస్థను తెచ్చింది. గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాల అమలు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, భూ వివాదాల పరిష్కారం, పౌర సేవల అందజేత వంటివన్నీ ఒకే వేదికపై సమన్వయం చేయాలనే ఉద్దేశంతో జీపీఓల నియామకం జరిగింది. ధరణి పోర్టల్ వంటి డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా భూ రికార్డులను సాంకేతికతతో అనుసంధానం చేయడం పారదర్శకతకు దోహదపడుతుందని భావించారు.
అయితే ఆచరణలో అనేక సమస్యలు తలెత్తాయి. జీపీఓలపై అధిక బాధ్యతలు మోపడం, తగిన శిక్షణ లేకపోవడం, సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యలు, స్థానిక పరిస్థితుల అవగాహన లోపాలు వారి పనితీరుపై విమర్శలకు దారితీశాయి. భూ మార్పిడి, వారసత్వ నమోదు, పట్టాదారు పాస్బుక్ల సవరణల్లో ఆలస్యం ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. డిజిటలైజేషన్ లక్ష్యం పారదర్శకత అయినప్పటికీ, సాంకేతిక లోపాల వల్ల పౌరులు మళ్ళీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ప్రభుత్వ విధాన నిర్ణయాలకనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా సమస్యలకు కారణమైంది. ఒక కొత్త వ్యవస్థను అమలు చేయడానికి ముందుగా మౌలిక సదుపాయాలు, సిబ్బంది శిక్షణ, సాంకేతిక మద్దతు, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ బలోపేతం చేయాల్సి ఉంది. కానీ వేగవంతమైన అమలు లక్ష్యం వల్ల ప్రాథమిక లోపాలను పట్టించుకోలేదు. గ్రామ స్థాయిలో ఇంటర్నెట్ కనెక్టివిటీ, కంప్యూటర్ సౌకర్యాలు, సిబ్బంది లభ్యత వంటి అంశాలు సరైన ప్రణాళికలో భాగం కాలేకపోయాయి.
మొదటగా, జీపీఓలకి నిరంతర శిక్షణ నిర్వహించాలి. భూ చట్టాలు, డిజిటల్ సిస్టమ్స్, పౌర సేవల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. రెండవది, సాంకేతిక వసతులను గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలి. సర్వర్ సామర్థ్యాన్ని పెంచడం, డేటా భద్రతను నిర్ధారించడం, రియల్టైమ్ సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం అత్యవసరం. మూడవది, బాధ్యత వ్యవస్థను పారదర్శకంగా రూపొందించాలి. సేవల కాలపరిమితి, పనితీరు అంచనా, ప్రజా ఫీడ్బ్యాక్ ఆధారంగా మానిటరింగ్ చేయాలి.
అలాగే గ్రామ సభల పునరుద్ధరణ ద్వారా స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. భూ వివాదాలు, సంక్షేమ పథకాల అమలులో గ్రామస్థుల సూచనలు వల్ల నిర్ణయాలు మరింత సమర్థవంతమవుతాయి. పాత పటేల్–పట్వారీ వ్యవస్థలో ఉన్న స్థానిక పరిజ్ఞానాన్ని, నేటి డిజిటల్ పారదర్శకతతో సమన్వయం చేయడం ద్వారా సమతుల్య నమూనాను అభివృద్ధి చేయవచ్చు.
మార్పు మాత్రమే పరిష్కారం కాదు. సమర్థవంతమైన అమలే సక్సెస్ కి మూలం. జీపీఓ వ్యవస్థను పున: సమీక్షించాలి. అసరమైన సంస్కరణలు తేవాలి. గ్రామీణాభివృద్ధి, ప్రజల నమ్మకం, పరిపాలనలో పారదర్శకత లక్ష్యాలు సాధ్యమయ్యేలా ప్రభుత్వ విధానాలు, అమలు యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగితేనే జీపీఓల వ్యవస్థ విజయవంతమవుతుంది.


