POLITBUREAU|పొలిట్ బ్యూరో సభ్యుడు|MEMBER మల్లోజుల వేణుగోపాల్ రావు|MALLOJULA VENUGOPAL RAO లొంగుబాటు
మావోయిస్టు ఉద్యమ చరిత్రలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యుడు, అగ్రశ్రేణి నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, అలియాస్ సోనూ మంగళవారం మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలోపోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమాన్ని సుదీర్ఘకాలం పాటు ముందుండి నడిపిన వేణుగోపాల్ రావు ఈ నిర్ణయంతో నక్సలిజం చరిత్రలో కీలక మలుపు తిరిగింది. ఆయనతో పాటు సుమారు 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా ఆయుధాలు వదిలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘ఆపరేషన్ కగార్’ ప్రభావంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు ముమ్మర చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్లో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో వందలమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో పలువురు సీనియర్ మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధమవుతుండగా, వేణుగోపాల్ రావు తీసుకున్న ఈ నిర్ణయం మావోయిస్టు పార్టీలో పెద్ద సంచలనం రేపింది.
కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పేద కుటుంబంలో జన్మించిన మల్లోజుల వేణుగోపాల్ రావు విద్యావంతుడైనప్పటికీ విప్లవ భావాలతో ఆకర్షితుడయ్యాడు. ఆయన అన్న మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్జీ మావోయిస్టు ఉద్యమానికి అగ్రగామిగా పనిచేసి విప్లవ నాయకుడిగా గుర్తింపు పొందారు. కిషన్జీ 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందగా, ఆ ఘటన వేణుగోపాల్ జీవితంలో మలుపు తీసుకొచ్చింది. అన్న మరణం తర్వాత ఆయన పార్టీకి సీనియర్ వ్యూహకర్తగా ఎదిగారు. అదే సమయంలో ఆయన భార్య తారా కూడా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించగా, ఆమె అనంతరం మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయింది. తారా గడ్చిరోలి ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ జాబితాలో ఉన్నప్పటికీ, సదరు నిర్ణయం తీసుకోవడం ఊహించని పరిణామంగా మారింది.
మల్లోజుల వేణుగోపాల్ రావు మావోయిస్టు పార్టీకి పూర్వ పీపుల్స్ వార్ గ్రూప్ దశ నుంచి పనిచేశారు. భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పలు పేర్లతో ఆయన విప్లవ రంగంలో గుర్తింపు పొందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి ఆయన అధిపతిగా ఉన్నారు. పశ్చిమ కనుమల ప్రాంతం, గోవా నుంచి ఇడుక్కి వరకు వున్న ప్రాంతాల్లో మావోయిస్టు గెరిల్లా జోన్ ఏర్పాటు చేయటంలో ఆయన కీలక పాత్ర వహించారు. చెరుకూరి రాజ్కుమార్ (ఆజాద్) మరణం తరువాత సీపీఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా మల్లోజుల నియమితులయ్యారు. పార్టీ ప్రచార, ప్రచురణల విభాగ బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు.
ఏప్రిల్ 2010లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ ఘటనలో 76 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సిబ్బంది మరణానికి వెనుక మల్లోజుల వేణుగోపాల్ రావు పాత్ర ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. ఆయనపై ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు భారీ రివార్డులు ప్రకటించాయి. అన్న కిషన్జీ మరణం తర్వాత పశ్చిమ బెంగాల్ లో లాల్గర్ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
ఇటీవల మల్లోజుల పత్రికా ప్రకటన ద్వారా మావోయిస్టు మార్గం తప్పుడు దిశలో సాగుతోందని, తాము ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని వెల్లడించారు. ఈ ప్రకటనకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు మావోయిస్టు నాయకులు మద్దతు తెలపడంతో చివరికి ఆయన గడ్చిరోలి పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామం మావోయిస్టు చరిత్రలో మరో నాందిగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు.

