INCOGNITO|‘అజ్ఞాతం’పై ఆరా!?
MAOIST|మావోల కదలికపై నిఘా?
రంగంలోకి INTELLIGENCE|ఇంటలీజెన్స్!
లేఖలుకలుకలపైనా నజర్?
పరిణామాలపై ఎప్పటికప్పుడు అంచనా
కేంద్రంతో చర్చలకు రాయబారం?
అభయ్ ఎవరు? ఎక్కడ?
అది ఎప్పటి నిర్ణయం? నిజమేనా?
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘అజ్ఞాతంలోంచి..అజ్ఞాతంలోకి..!? జనజీవన స్రవంతిలో కలిసినా జనంలోకి రాలే. కొత్త జీవితమా? పాత నరకమా? సర్కార్ గోప్యతా? పోలీసుల భద్రతా? శాంతికి సానుకూలమా? అశాంతికి అనుకూలమా? పోరుబాట వీడి, జనంబాట పట్టిన పోతుల పద్మ ఎక్కడ?’ అనే శీర్షిక, ఉప శీర్షికలతో అడుగు డిజిటల్ మీడియాలో వచ్చిన వార్తా కథనాన్ని రాష్ట్ర, కేంద్ర ఇంటలీజెన్స్ విభాగాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఒకవైపు పోతుల పద్మ ఎక్కడ? అనే దాంతోపాటు, మొత్తం మావోయిస్టుల కదలికపైనే నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోంచి జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవడానికి రంగంలోకి ఇంటలీజెన్స్ దిగింది! అలాగే మావోయిస్టుల లేఖలుకలుకలపైనా నజర్ వేసింది.? సాధారణంగా అత్యంత పకడ్బందీగా ఆచితూచి వ్యవహరిస్తూ, ఆలస్యమైనా, అత్యంత సమర్థంగా సమాచారాన్ని బయటకు వదిలే మావోయిస్టుల లేఖలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇవి పోలీసులే విడుదల చేసి ఉంటారని ప్రజాసంఘాలకు చెందిన కొందరు, కాదు, మావోయిస్టులే మైండ్ గేమ్ ఆడుతున్నారని పోలీసు వర్గాల నుంచి వెలువడుతున్న పలు భిన్నమైన అభిప్రాయాలు, పరిణామాలపైనా పోలీసు ఇంటలీజెన్స్ ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు తెలిసింది.
తీవ్ర నిర్బంధంతో, జరిగిన ఎన్ కౌంటర్లతో మావోయిస్టుల చరిత్రలోనే అత్యంత దారుణమైన నిర్బంధాన్ని, ఎదురుదెబ్బలను, తీవ్ర భౌతిక, ఆయుధ సంపత్తి నష్టాల్ని ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీ, దాని నేతలు కకా వికలమై ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి కీలకమైన సమయంలో కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో, ఆ పార్టీ అగ్రనేత కరీంనగర్ చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ సోదరుడు, వేణుగోపాల రావు అలియాస్ సోనూ తన ఫోటోతోపాటు ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సోనూ తన ఫోటోతోపాటు లేఖను విడుదల చేయడం, అందులో సమాచారం నెల రోజుల వ్యవధిలో ఆలస్యంగా బయటకు రావడం, పార్టీ అంతర్గత వ్యవహారాలు, లోపాలపై విమర్శిస్తూ రకరకాల కామెంట్లు ఉండటంతో ఆ లేఖ వివాదాస్పదం అయింది. మరోవైపు ఆలేఖకు విరుద్ధంగా, అదంతా తప్పంటూ విమర్శిస్తూ, తాజాగా మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో మరో లేఖ రావడం చర్చనీయాంశమైంది. అసాధారణంగా మావోయిస్టు పార్టీలో పరస్పర విరుద్ధ భావాలు, విమర్శలతో కూడిన ఆ లేఖలు సహజంగానే అటు విప్లవోద్యమాల అభిమానులు, పోలీసులు, ప్రభుత్వాలు, ప్రజల్లోనూ తీవ్రవాదోపవాదాలకు దారి తీశాయి.
ఆయుధమా? అస్త్ర సన్యాసమా?
అనే శీర్షికతో మావోయిస్టు లేఖపై వ్యక్తమవుతోన్న పలు అనుమానాలపై ‘అడుగు’ ఇటీవలే ప్రత్యేక కథనాన్ని కూడా వెలువరించింది. మావోయిస్టులకు ఆయుధమే అసలైన సిద్ధాంతం, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాన్ని, దాని హింసను అవసరమైన మేరకే ప్రతిహింస ద్వారానైనా సరే, నిలువరిస్తూ, సమసమాజ స్థాపన మావోయిస్టుల మూల సూత్రం. అలాంటప్పడు అది ప్రస్తుత నిర్బంధ పరిస్థితుల్లో ఆ ఆయుధాన్ని అలాగే ఉంచుకోవడమా? లేక అస్త్ర సన్యాసం చేయడమా? అన్న ఆలోచన చేస్తున్నదా? చేస్తే అది నిజమేనా? దాని వెనుక పోలీసులేమైనా ఉన్నారా? అనే కోణాల నుంచి కూడా ఆ కథనం ఉంది. సరిగ్గా మావోయిస్టుల పేరిట ఆ లేఖను ఖండిస్తూ మరో లేఖ వెలువడటం గమనార్హం.
మావోయిస్టుల్లో సిద్ధాంత విభేదాలా?
ఇంత నిర్బంధం, ఎన్ కౌంటర్లల్లో, కష్ట నష్టాల్లో చెల్లా చెదురైన పార్టీ నేతలు కలిశారా? ఎక్కడ కలిశారు? చర్చించారా? నిర్ణయాలు తీసుకున్నారా? తీసుకుంటే ఆ నిర్ణయాలేంటి? వంటి పలు అంశాలకు సమాధానంగా ఈ లేఖ ఉన్నట్లుగా ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. అంతేగాక, పార్టీలో అభిప్రాయ భేదాలు, సిద్ధాంత విభేదాలు సహజమే అయినప్పటికీ, ఇలా బహిరంగ పరచడం అనేది ఉండదంటున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ లేఖలు రావడమే విచిత్రంగా ఉందని వారు తమదైన వాదన వినిపిస్తున్నారు.
కేంద్రంతో చర్చలకు రాయబారం?
మావోయిస్టులు తెలంగాణకు చెందిన ఓ కేంద్రమంత్రితో చర్చలకు కేంద్ర ప్రభుత్వంతో రాయబారం నెరిపారన్న చర్చ కూడా ఇదే సమయంలో బయటకు వచ్చింది. ఆ మంత్రి నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడారని, మావోయిస్టుల లొంగుబాటు ప్రతిపాదనను, తాత్కాలిక విరమణను కూడా ఆయనకు చెప్పారని అంటున్నారు. సరిగ్గొ కొద్ది రోజుల క్రితం అమిత్ షా మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని అనూహ్యంగా స్పందించారు. బహుషా అంతకు కొద్ది రోజుల ముందు ఈ ప్రతిపాదన వెళ్ళి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, మావోయిస్టు పార్టీ, ఆ పార్టీ నేతలు దాదాపు తుడిచి పెట్టుకుపోయిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనను షా నిరాకరించి ఉంటారని చర్చ జరుగుతోంది.
అభయ్ ఎవరు? ఎక్కడ?
కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఆయన లేఖను ఎక్కడి నుండి విడుదల చేశారు? అది నిజమైనదేనా? లేక పార్టీకి సానుభూతిపరైన, లీగల్ టీమ్ ఏమైనా పని చేస్తుందా? అన్న కోణంలోనూ ఇంటలీజెన్స్ ఆరా తీస్తోంది. అయితే, అభయ్ పోలీసుల అదుపులోనే ఉండి ఉంటారని ప్రజా సంఘాలు అనుమానిస్తున్నాయి. పోలీసులే ఈ విధంగా మావోయిస్టులపై ప్రజల్లో గందరగోళం కల్పించడానికే ఈ విధంగా లేఖను విడుదల చేయించి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే నిజంగా పార్టీ తీసుకున్న నిర్ణయమా? లేక పోలీసుల పనా? అన్నది తేలాల్సి ఉంది. ఇది మళ్ళీ మావోయిస్టుల స్పందించేదాకా, ఓ స్పష్టత వచ్చేదాకా, తెగని, తేలని అంశంగానే మిగిలి ఉండనుంది.
అభయ్ ప్రకటన అబద్ధం!
ఆయధ విరమణ ఆలోచనే లేదు
సాయుధ పోరాటం కొనసాగింపే
మావోయిస్టు నేత జగన్ ప్రకటన!!
కామ్రేడ్ సోను పద్ధతిపై అధికారిక ప్రతినిధి జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు, ఇది పార్టీ ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీస్న్తందని అన్నారు. సోను అనుసరించిన పద్ధతి అర్థం కావటం లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఉద్యమాన్ని విడిచిపెట్టాలని భావిస్తే పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చని చెప్పారు. తన అభిప్రాయాన్ని పార్టీ విభాగాలకు పంపించి ఉంటే జవాబులు దొరికేవి అన్నారు. అది చేయకుండా, ఈ విధంగా బహిరంగంగా ప్రకటిస్తే పార్టీ శ్రేణుల్లోనూ, విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుతుందని, ఈ పద్ధతి ఉద్యమానికి నష్టమే తప్ప ఉపయోగపడదని పార్టీ తేల్చి చెప్పింది. ‘‘దేశంలోని ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని చూస్తారా.’’ అని జగన్ ప్రశ్నించారు. అటువంటిది, రహస్య పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ, తీవ్రమైన యుద్ధ చర్యలు అమలు అవుతున్న వేళ మంచిగా ఆలోచించేవారు ఇలా చేయరని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యపై పార్టీలోపై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారని, అనవసరంగా నష్టపోవాలని ఎవరూ అనుకోవడం లేదని పార్టీ తెలిపింది. అయితే, ఈ సమస్యకు పరిష్కారం బహిరంగ ప్రకటనలతో అయ్యేది కాదని, భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు సహజంగానే జరుగుతాయని అర్థం చేసుకోవాలని సూచించింది. కామ్రేడ్ సోను ప్రకటన పార్టీ అధికారిక ప్రకటన కాదని, విప్లవ శిబిరం, మిగిలిన రాజకీయ పార్టీలు దీనిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదని, దీనితో గందరగోళ పడాల్సిన అవసరం లేదని అధికార ప్రతినిధి తేల్చిచెప్పారు. 2024లో పొలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ను అమలు జరపటమే తక్షణ కర్తవ్యం అన్నారు. ఫాసిస్ట్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను మరింత తీవ్రతరం చేయాలి అని పార్టీ తన శ్రేణులకు, విప్లవ అభిమానులకు పిలుపునిచ్చింది. కాగా.. గత కొన్నేళ్లుగా దేశంలోని మావోయిస్టు విప్లవోద్యమ శిబిరాన్ని కకావికలం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ శిబిరమే చీలిపోయిందన్న వాదన బలంగా వినిపించే ఘటన చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మావోయిస్ట్ పార్టీని 2026 మార్చి నాటికి సమూలంగా నిర్మూలిస్తామని బహిరంగంగా ప్రకటిస్తోంది. ఆ దిశగానే నిర్మూలన చర్యలు తీవ్రతరం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ కేంద్ర కమిటీ కీలక నాయకుడు ‘సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు’ ప్రకటించడం విప్లవ శిబిరంలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ఈ ప్రకటనపై మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి ‘జగన్’ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, అది పార్టీ నిర్ణయం కాదని, ఈ పద్ధతి ఉద్యమానికి నష్టం కలిగిస్తుందని ఒక ప్రత్యేక పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నాయకత్వంపై యుద్ధ దాడులు తీవ్రంగా కొనసాగుతున్న ఈ క్లిష్ట సమయంలో వచ్చిన ఈ తాజా ప్రకటన పార్టీలో అంతర్గత విబేధాలు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విప్లవోద్యమ నిర్మూలనకు చాలా ఏళ్ల నుంచి పథకాలు రచిస్తోంది. ‘కగార’ అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలను అమలు చేస్తోంది. ఈ చర్యల లక్ష్యం కేవలం క్యాడర్ మాత్రమే కాదు, నాయకత్వాన్ని, సహకరించే ప్రజలను కూడా నిర్మూలించడమేనని మావోయిస్టులు ఆరోపిస్తోంది.ఈ ఆపరేషన్ ఫలితంగా మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. మే 21న జరిగిన దాడిలో ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా 28 మంది కామ్రేడ్స్ చనిపోయారు. అంతేకాకుండా, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ఘటనలలో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గజరల్ రవి, మోడెం బాలకృష్ణ, పరేవశ సోరెన్ కూడా మృతి చెందారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతమ్, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ వంటివారు కూడా కన్నుమూశారు. ఈ భయంకరమైన దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, కొంతమంది రాష్ట్ర కమిటీ సభ్యులు, కింది స్థాయి కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితోనే సరెండర్ అయ్యారని ప్రస్తుతం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు జగన్. విప్లవ శిబిరంపై జరుగుతున్న యుద్ధ చర్యలను ఆపాలని దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు, సంఘాలు, ప్రముఖులు విజ్ఞప్తులు చేశారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనూ ‘కగార’ యుద్ధ కాండను నిలుపుదల చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.2025 మార్చిలో కొంతమంది ప్రజాస్వామిక మేధావులు ‘పీస్ డైలాగ్ కమిటీ’గా ఏర్పడి, ప్రభుత్వానికి, మావోయిస్ట్ పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలని ప్రతిపాదన చేశారు. దీనికి జవాబుగా కేంద్ర కమిటీ స్పందిస్తూ కూంబింగ్లు, హత్యకాండను ఆపాలని, కొత్త క్యాంపుల నిర్మాణం నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలోనే చర్చలు జరపాలని స్పష్టంగా ప్రకటించింది. అని లేఖలో పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను పట్టించుకోకుండా, ఎటువంటి సడలింపులూ లేకుండా యుద్ధ చర్యలను కొనసాగిస్తూనే ఉంది. బీజేపీ నాయకులు అయితే, తాము మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచిపెట్టి సరెండర్ కావాలని పదే పదే ప్రకటిస్తున్నారని జగన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఫాసిస్ట్ భావజాలంతో, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని బీజేపీ నాయకత్వం ప్రకటిస్తోందని ఆరోపించారు. ఈ ప్రతికూల వాతావరణంలోనే, కీలకమైన అంతర్గత సంక్షోభం తెరపైకి వచ్చింది. కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోను, సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటిస్తూ, తమ అభిప్రాయాలను తెలుసుకోవడానికి నెల రోజులు సమయం ఇవ్వాలని కోరారు. సుదీర్ఘంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను తాను ఇచ్చిన ఇమెయిల్ అడ్రస్కు పంపాలని ఆయన కోరారు. ఇది సరైన పద్ధతి కాదని అని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు జగన్. ఒక సీనియర్ నాయకుడు, అదీ తీవ్ర దమనకాండ జరుగుతున్న సమయంలో, ఇంటర్నెట్ మాధ్యమంగా పార్టీ మౌలిక సిద్ధాంతమైన సాయుధ పోరాట విరమణ గురించి బహిరంగంగా ప్రకటించడం ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో పార్టీ శ్రేణులలో తలెత్తిన గందరగోళాన్ని తగ్గించడానికి జగన్ ఈ కీలక ప్రకటన చేశారు.

