దేశ విభజన వివాదం ఇంకా రావణ కాష్టంలా మండుతూనే ఉంది. పదవీ లాలస పట్టుదలతో దేశం ముక్కలైనా ఫర్వాలేదన్న రీతిలో ఆనాడు వ్యవహరించారు. సరిగా దేశ విభజన జరగక పోడం, కాశ్మీర్ విషయంలో నాన్చివేత ధోరణి, 370 అధికరణ, యుద్ధాల్లో ఓడిన పాక్ను దయతలచి వదిలి పెట్టడం వంటి ఉదారవాద విధానాల ఫలితాలని నేటికీ అనుభవిస్తున్నాం. ఆనాడే పటిష్టమైన విధానాలు అవంబించి, ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకుని, పక్కాగా విభజన ఒప్పందాలు చేసుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు.
తాజాగా కాశ్మీర్లో జరిగిన నరమేధాన్ని కేవలం ఉగ్రదాడిగా చూడలేం. ప్రత్యక్షంగా కనిపించకపోయినా పాకిస్థాన్ ఇండియాపై జరిపిన దాడిగానే చూడాల్సి ఉంటుంది. దాడి జరిగిన విధానాన్ని బట్టి హిందువులే లక్ష్యంగా చేసిన దాడి. ముస్లిం ఉగ్రవాదుల పనే అయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం దీన్ని ఖండించాలి. ఇలాంటి మూఢ మత ఛాందసాన్ని చూస్తూ ఊరుకోమని ఉగ్రవాదులకు గుణపాఠంగా చెప్పాలి. అలా చేయని వారిని నిజాయితీ లేని వారుగా గుర్తించాల్సి ఉంటుంది. ముందుగా మన దేశంలోని ఎంఐఎం లాంటి ముస్లిం పార్టీలు బహిరంగా ఉగ్రవాదుల దుశ్చర్యలను నిలదీయాలి. నిరసించాలి. పాక్ తీరును ఎండగట్టాలి. ఈ ఉగ్రదాడిని ఏ మాత్రం క్షమించరాని నేరంగా చూడాలి. ఈ భూమ్మీద ఎక్కడైనా ఇలాంటి ఉగ్ర చర్యలను ఉపేక్షించరాదు. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులపై ముష్కర మూక జరిపిన దాడిని ముప్పేట ఖండించాలి. మన సైనిక దుస్తుల్లోనే వచ్చి, ఒక్కొక్కరిని వారి మతాన్ని అడుగుతూ పిట్టల్లా కాల్చేశారు. చివరకు ఓ ముస్లిం పెద్దను కూడా పొట్టన పెట్టుకున్నారు. కొత్తగా పెళ్ళైన జంటల్లో భర్తపోతే, భార్య, భార్యపోతే, భర్తలు మాత్రమే మిగిలారు.
ఇప్పటి వరకు కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా ఈ ఘటనను పరిగణిస్తున్నారు. ఈ ఘటనలో 28 మందిని కాల్చిపారేశారు. మరికొందరు కొనఊపిరితో మ్రుత్యువుతో పోరాడుతున్నారు. కాందహార్ విమానం హైజాక్ చేసినప్పుడు కూడా ఇలాగే ఉగ్రవాదులు ఎందరినో పొట్టన పెట్టుకున్నారు. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్పష్టమయింది. కాల్పుల అనంతరం సవిూప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది వారి కోసం గాలిస్తున్నారు.
ఇప్పుడు ఈ దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందనడానికి వేరే రుజువులు అక్కర్లేదు. మన దేశంలో ఏ దాడి జరిగినా దాని మూలాలు అక్కడే ఉంటున్నాయి. ఇటీవల దాయాది పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ‘అది మా జీవనాడి, దానిని మర్చిపోలేమ’ని వ్యాఖ్యానించారు. ఇంకా ‘విదేశాల్లో నివసిస్తోన్న పాకిస్థానీయులంతా దేశ రాయబారులు. విూరు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోకూడదు. విూరు విూ పిల్లలకు పాక్ స్టోరీ చెప్పాలి. హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారు. మన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. ఈ దేశం ఏర్పాటు- కోసం మన పూర్వీకులు ఎంతో పోరాడారు. ఈ స్టోరీని తర్వాత తరాలకు చెప్పడం మర్చిపోవద్దు. అప్పుడే వారికి పాకిస్థాన్తో ఉన్న బంధం దృఢంగా ఉంటుంద’’ని చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా చూసినా ఉగ్రవాదాన్ని ప్రేరేపించేదిగా ఉన్నాయి. నిజానికి భారత్లో వీరంతా ఎక్కడి వారు? అన్న చరిత్ర కూడా చెప్పివుంటే బాగుండేది. ఓ రకంగా భారత్లో ఉగ్రదాడికి ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలు ఊపిరి పోశాయని చెప్పాలి. అలాగే కాశ్మీర్ గురించి మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో మా వైఖరి స్పష్టం. కాశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయం’ అంటూ బీరాలు పలికారు. నిజానికి కాశ్మీర్, పాక్, భారతదేశ చరిత్ర తెలియని మూర్ఖుడుగా అతడిని గుర్తించాలి. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేసిన వారంలోపే ఈ దాడి జరిగింది. దీంతో పాకిస్థాన్ సైన్యం, పాక్ ప్రభుత్వంపై కూడా అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులను నిందిస్తూ భారతదేశం వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వ్యాఖ్య వెలువడ నప్పటికీ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ముందుగానే స్పందించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఈ ఉగ్రదాడితో పాకిస్థాన్ కు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా ఆదేశంలో పుట్టిందే. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాలు, విప్లవాలు జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. డజన్ల కొద్దీ ఉద్యమాలు జరుగుతున్నాయి. నాగాలాండ్ నుంచి కాశ్మీర్ వరకు, దక్షిణాన ఛత్తీస్గఢ్, మణిపూర్ లాంటి ప్రదేశాలన్నింటిలోనూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయ’ని ప్రకటించారు. ఈ వరుస సంఘటనలన్నీ పాకిస్థాన్ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి.
ఈ నరమేధంతో మనం మరింత అప్రమత్తం కావాలి. ఉగ్రవాదుల ఏరివేతలో మరింత కఠినంగా వ్యవహరించాలి. కాశ్వీర్ లోని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలి. ఉగ్రవాదంపై ఉదారవాదాన్ని వీడాలి. ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. మొత్తం దేశం ఒక్కటిగా నిలబడి బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలి.

