-చరిత్ర
తేదీ:13.09.1948న ఆపరేషన్ పోలో ప్రారంభమైన రోజు. భారత స్వాతంత్ర్యానంతరం దేశంలోని సంస్థానాలన్నీ భారత దేశంలో విలీనమైనప్పటికీ, కేవలం హైదరాబాద్ స్టేట్, కశ్మీర్, జునాగఢ్ లు నిరాకరించాయి. వివిధ కారణాలతో కశ్మీర్, జునాగఢ్, నిజామ్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. దీంతో, జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలోని భారత బలగాలు ‘ఆపరేషన్ పోలో’ ను 1948 సెప్టెంబర్ 13న ప్రారంభించాయి. నిజాంపై దాడికి రెండు ప్రాంతాల గుండా ప్రవేశించాయి. మహారాష్ట్ర లోని షోలాపూర్ మీదగా ఒకటి, విజయవాడ మీదుగా మరో సైనిక బలగాలు దాడిని ప్రారంభించాయి. షోలాపూర్ మీదుగా వచ్చిన భారత బలగాలు అక్కడి సమీపంలోని నల్దుర్గ్ చారిత్రిక ఆదిల్ షా కోట వద్ద మొదటిసారిగా భారత బలగాలు, నిజామ్ సైన్యంపై యుద్ధానికి దిగాయి. అక్కడ, భారత బలగాలతో తట్టుకోలేక నిజామ్ సైన్యం వెనుదిరగడంతో ఔరంగాబాద్ ను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఔరంగాబాద్ నగరం నైజాంలో రెండవ అతిపెద్ద నగరం. ఇలా, భారత్ సైన్యం హైదరాబాద్ కు 115 కిలోమీటర్ల దూరంలోని జహీరాబాద్ కు చేరుకోవడంతో, ఇక తప్పని పరిస్థితిలో నిజాం భారత యూనియన్ లో విలీనానికి అంగీకరించాడు. తమ ప్రధాని లాయక్ అలీని రాజీనామా ఇవ్వాల్సిందిగా నిజాం ఆదేశించాడు. కేంద్ర ప్రతినిధిగా ఉన్న కన్హయ్య లాల్ మున్షీని తన రాజ ప్రసాదానికి ఆహ్వాహించాడు నిజాం. తాను భారత యూనియన్ లో విలీనం కావడానికి ఏమి చేయాలని మున్షీని అడగడంతో, విలీనం చేస్తున్నట్టు బహిరంగ ప్రకటన చేయాల్సిందిగా మున్షీ సూచించాడు. అప్పుడు, 1948 సెప్టెంబర్ 17న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రేడియో కేంద్రానికి వెళ్లి భారత యూనియన్ లో హైదరాబాద్ స్టేట్ ను విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. 18 సెప్టెంబర్ 1948న అధికారికంగా విలీన ప్రక్రియ కార్యక్రమం ముగిసింది.


