కమలంలో కథనోత్సాహం-1
రకరకాల ఎరలతో కమలనాథుల బేరం?!
ఆశల పల్లకీలో పదవుల పందేరం!?
ఆ వెంటే ఇంటలీజెన్స్ ఆరా?!
ఖంగు తింటున్న ఇరు పార్టీల నేతలు!?
అధికారానికి అడ్డదారులు, నిలువు దారులు అంటూ ఏవీ లేవు. అడ్డమైన దారుల్లో కూడా అధికారం దక్కించుకోవచ్చని ఈ మధ్య అనేక దృష్టాంతాలు నిరూపిస్తున్నాయి. అదే కోవలో ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే, తెలంగాణలో వెంటనే అధికారంలోకి రావాలనే ఆతృత బీజేపీలో కొట్టొస్తున్నది. అందుకు బిజెపి అన్ని పావులూ కదుపుతున్నది. ఇందుకనుగుణంగానే కమలనాథుల మాటలు, చేతలు ఉంటున్నాయి.
మొన్నా మధ్య బిజెపికి చెందిన ఓ బడా నేత నేరుగా ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. ‘‘మీరు బిజెపిలోకి వస్తే, మీరు కోరుకున్నది ఇస్తామన్నాడా నేత. పనిలో పనిగా ఏమిస్తారని ప్రశ్నించాడా ఎమ్మెల్యే. తిరిగి అదే లేదా కోరుకున్న నియోజకవర్గం నుంచి బిజెపి టికెట్ పై పోటీ చేసే అవకాశం ఇవ్వడంతోపాటు, తప్పకుండా గెలిపించుకుంటామని, గెలిచాక తెలంగాణలో అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చాడు. ఇలా ఈ ఫోన్ మాట్లాడిన కొద్ది సేపటికే, మరోసారి ఫోన్ మోగింది. మీకు బిజెపి నుంచి ఎవరైనా ఫోన్ చేశారా? ఫలానా నేత నుంచే ఆ కాల్ వచ్చిందా? ఏం మాట్లాడారు? మీరేమన్నారు?’’ వంటి ప్రశ్నల వర్షం కురిసింది. ఎవరాని ఆరా తీస్తే… అదికాస్తా ఇంటలీజెన్స్ ఆరా! అని తెలిసిపోయింది. ఖంగు తినడం ఆ ఎమ్మెల్యే వంతైంది!
“భవిష్యత్తులో బి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు. ఆ వచ్చేదేదో మా పార్టీలోకి వచ్చేయ్! నీ భవిష్యత్త మా బాధ్యత”
‘‘అసంతృప్త నేతగా పేరున్న ఓ కాంగ్రెస్ నేతకు ఫోన్ వచ్చింది. మీ నియోజకవర్గం నుంచి నీకు బిజెపి టికెట్ ఇస్తాం. పోటీ చేస్తారా? అందుకు ఏం కావాలని ప్రశ్నలు. అంతా మేమే చూసుకుంటామని హామీలు..’’
‘‘నెక్ట్స్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, నీవే మా అభ్యర్థివి. నీకు టికెట్ పూచీ నాది. నిలిచే బాధ్యత నీది. గెలిచే బాధ్యత మాది. ఏమంటావు?’’ వెంటనే ఇంటలీజెన్స్ ఆరాలు… షరా మామూలే!!
ఇవి మచ్చుకు ఒకటి రెండు ఘటనలు. ఇలా ఇటీవలి కాలంలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బిఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలకు ఫోన్లు వెళ్ళాయి. కొందరు నేతలు ఇదే పనిగా ఫోన్లు చేస్తున్నట్లుగా ఇంటలిజెన్స్ ఆరా లో తేలినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
ఇవి బిజెపి నేతల చేతల్లా కనిపిస్తుంటే, ఇందుకనుగుణంగానే ఈ మధ్య కమలనాథుల మాటలు ఉంటున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ‘‘తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ మరో ఐదారు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. అంతటితో ఆగకుండా, ఆ తర్వాత బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ కి బి ఆర్ ఎస్ ఏటీఎం లా మారిందని ఆరోపించారు. సునిశిత రాజకీయ పండితుల పరిశీలన ప్రకారం పొంతన, పొలిక కుదురి, ఒకదానికి ఒకటి మ్యాచ్ అవుతున్న ఈ మాటల, చేతల సారాంశం ఏంటి? సంకేతాలేంటి?
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి రోజుల్లో కూడా.. ఇలాంటి ఒక టోకు బేరాన్ని ఆరా తీసి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, బట్టబయలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో బిజెపి జాతీయ నేతలపై రాష్ట్ర స్థాయిలో కేసులవడం మనమంతా చూశాం. కానీ ఈ సారి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు అలాంటి ప్రయత్నాలను తిప్పికొడుతున్నట్లుగా కనిపిస్తున్నది. పొంచి ఉన్న ఉపద్రవాన్ని, ఊపందుకోక ముందే తుంచి వేస్తున్నది. మరోవైపు పార్టీ మారిన తమ నేతలపై అనర్హత వేటు కోసం పోరాడుతున్న బిఆర్ఎస్, పార్టీ ఫిరాయింపులపై చాలా సీరియస్ గానే ఉంది. పార్టీ ఫిరాయింపుల ప్రస్తుత పరిణామాలు కూడా ఎమ్మెల్యేలకు పాలుపోని విధంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇటీవలి ఢిల్లీ ఎన్నికల గెలుపు తర్వాత కమలంలో నూతన కథనోత్సాహం వెల్లివిరుస్తున్నది. వరసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, 27 ఏళ్ళ తర్వాత ఢిల్లీ పీఠం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఎంతో కాలంగా ఊరిస్తున్న, ఇప్పటిదాకా దక్కని తెలంగాణ ఫీఠంపై బిజెపి కన్నేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలచుకోవడంపై బిజెపి దృష్టి సారించింది. తెలంగాణ తెచ్చిందే మేమన్న బిఆర్ఎస్ జనాగ్రహంతో బురిడీ కొట్టింది. తెలంగాణ ఇచ్చిందే మేమన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రావడానికి కారణమైన మేం అధికారంలోకి కూడా వస్తామన్న పట్టుదలతో బిజెపి ఉంది. అందుకే అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తన్నదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బిజెపి నేత ‘‘అడుగు’’కు చెప్పారు.
రాజనీతిలోనే కాదు రాజకీయాల్లోనూ విలువలు పడి పోతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు సైతం పార్టీ ఏదైనా ఫర్వాలేదు, పదవి దక్కితే చాలన్నట్లుగానే ఉన్నారు. రాజకీయ నేతల స్వార్థం, రాజకీయ పార్టీలకు వరంగా మారుతున్నది. పదవుల ఆశల పల్లకీలో ఉన్న రాజకీయ నేతలు, పదవుల కోసం పెదవులు మూసుకొని, పార్టీలు మారడానికీ సిద్ధంగా ఉన్నారు. దీంతో రకరకాల పదవుల ఎరతో పార్టీలు కూడా సంసిద్ధంగా ఉంటున్నాయి. ఇందుకు అనుగుణంగానే బిజెపి సంస్థాగతంగా బలపడుతూనే, చాప కింద నీరులా ఒక వైపు తమ శక్తి యుక్తులను ధారపోసి, గ్రౌండ్ వర్క్ చేస్తూనే, మరోవైపు మిగతా అన్ని రాజకీయ ప్రక్రియలను ప్రయోగిస్తున్నది.

