ప్రజా సంక్షేమం, ఆర్థిక నియంత్రణ, పాలనా బాధ్యత..ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగినవి. వీటి మధ్య సమతౌల్యం అవసరం. లేకపోతే పరిపాలన, ప్రజాప్రగతి పడకేసి, దేశమే అల్లకల్లలమయ్యే ఆర్థిక ఇబ్బందుల ఆందోళన తీవ్రమవుతాయి. ప్రభుత్వాల ఖర్చు విధానం, ఉచిత పథకాల విస్తరణ, ఉద్యోగుల బకాయిల పెరుగుదల ఇవి కలిపి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడిని సృష్టిస్తున్నాయి.
తెలంగాణలో ఉద్యోగుల బకాయిలు రూ.6వేల కోట్లకు పైగా ఉన్నాయని అధికార వర్గాల అంచనా. గత దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన ఈ సమస్య, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు. దీనికితోడు, పెన్షనర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది వంటి వర్గాలకు చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. రోజువారీ నిర్వహణ ఖర్చులకే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గత ప్రభుత్వంలో అమలు చేసిన “బటన్ నొక్కుడు” పథకాల కింద లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వమూ ఎన్నికల హామీల మేరకు సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలూ ఆదాయం-వ్యయం మధ్య బ్యాలెన్స్ ను కోల్పోయాయి.
ఈ ఆర్థిక ఒత్తిడిలో ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు, జీతాలు, భత్యాలు, పెన్షన్లపై చర్చ ప్రారంభమవుతోంది. సాధారణంగా ఒక ఎమ్మెల్యేకు నెలకు లక్షల్లో గౌరవ వేతనం, అదనంగా భత్యాలు లభిస్తాయి. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులకు పలుమార్లు ఎన్నికైతే, అతనికి అనేక పెన్షన్లు పొందే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో “ప్రజాప్రతినిధులకు ఇంత అధిక పారితోషికం అవసరమా?” అనే ప్రశ్న సహజంగా తలెత్తుతోంది.
అయితే, ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు, భత్యాలను, పెన్షన్లను పూర్తిగా రద్దు చేయాలని కాదు. కానీ, హేతుబద్ధత అవసరం. ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలి. జీతాలు లేకపోతే ధనవంతులే రాజకీయాల్లో కొనసాగుతారు. లేదా అంతా అవినీతికి పాల్పడతారు. ఇది ప్రజాస్వామ్య సమానత్వాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు, సరైన పారితోషికం లేకపోతే అవినీతి పెరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జీతాల వ్యవస్థ అవసరం. అయితే, అది సమర్థవంతంగా, పారదర్శకంగా ఉండాలి.
ప్రధాన సమస్య ఉచిత పథకాల వితరణలోనే ఉంది. ఎన్నికల సమయంలో ఆకర్షణీయ హామీల కోసం ప్రభుత్వాలు భారీగా ఉచితాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, పెన్షన్లు, గృహ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరమే. కానీ అవి ఆర్థికంగా భరించగలిగిన పరిమితుల్లో ఉండాలి. లేకపోతే ఖజానా ఖాళీ అవుతుంది. ఆ ఖాళీని పూడ్చేందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పులపై వడ్డీలు చెల్లించడం మరింత భారమవుతుంది.
భారత సుప్రీంకోర్టు కూడా ఉచిత పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు సూచించింది. అధిక ఉచితాలు ప్రజల్లో పని చేయాలనే ప్రేరణను తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు ఈ హెచ్చరికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల లాభాల కోసం సంక్షేమాన్ని అతిగా వినియోగిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం. ప్రభుత్వాలు తమ ఖర్చులను ప్రాధాన్యతల ఆధారంగా పునర్వ్యవస్థీకరించాలి. మొదటిగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అవసరమైన సేవలకు చెల్లింపులు సమయానికి చేయడం తప్పనిసరి. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు, చివరగా సంక్షేమ పథకాలను ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా అమలు చేయాలి.
ఇక ప్రజాప్రతినిధుల గౌరవ జీతాలు, భత్యాలు, పెన్షన్లలో సంస్కరణలు అవసరం. పనితీరు ఆధారిత భత్యాలు, ఒకే పెన్షన్ విధానం, పారదర్శక ఖర్చుల వివరాలు వంటి మార్పులు చేయవచ్చు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే ఎన్నికల ఖర్చులను నియంత్రించడం, డబ్బు ప్రభావాన్ని తగ్గించడం కూడా కీలకం.
సంక్షేమం పూర్తిగా తప్పు కాదు. కానీ, అది మోతాదు మించకూడదు. అభివృద్ధి, మౌలిక వసతులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచకపోతే దీర్ఘకాలంలో రాష్ట్రాలు వెనుకబడిపోతాయి. ఎక్స్ ప్రెస్వేలు, పారిశ్రామిక కారిడార్లు, వైద్యశాలలు, పాఠశాలలు ఇవే భవిష్యత్తును నిర్మిస్తాయి.
ప్రజాప్రతినిధుల జీతాలు సమస్యలో చిన్న భాగం మాత్రమే. అసలు సమస్య అసమతౌల్య, అహేతుక, దుబారా ఖర్చులు. ఎన్నికల రాజకీయాలు, ఆర్థిక నియంత్రణ లోపం. ప్రభుత్వాలు తక్షణ ప్రజాప్రియ నిర్ణయాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. లేనిపక్షంలో అప్పుల భారంతో రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలోకి జారిపోవడం అనివార్యం.

