‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ సవరణ ప్రక్రియలో పాల్గొనాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలో, ప్రజల వద్దకు వెళ్లాల్సిన బీఎల్వోలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారా? ఓటరు నమోదు సవ్యంగా సాగుతోందా? ప్రవాస భారతీయుల మాటేమిటి? నకిలీ నమోదులు తొలగిపోతున్నాయా? ఎన్యూమరేషన్ గందరగోళం సంగతేంటి?
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ఓటరు జాబితా ఎంత ఖచ్చితంగా ఉంటే ఎన్నికల ప్రక్రియ అంత విశ్వసనీయంగా ఉంటుంది. అదే సమయంలో, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి అన్యాయంగా తొలగిపోకుండా చూడటం ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యత. ఈ నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియ లక్ష్యం ప్రశంసనీయం. అయినప్పటికీ, అమలు తీరుపై అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బూత్ లెవల్ అధికారు (బీఎల్వో)ల పనితీరు, సాంకేతిక ఏర్పాట్లు, విదేశాల్లో ఉన్న ప్రవాసుల ఓటు హక్కు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలి.
హైదరాబాద్ వంటి మహానగరంలోనే అనేక గేటెడ్ కమ్యూనిటీల్లో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లిన ఆనవాళ్లు కనిపించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలను ప్రత్యక్షంగా కలవకుండా కేవలం ఫారాలు సమర్పించాలని విజ్ఞప్తులు చేయడం ద్వారా ఈ ప్రక్రియ లక్ష్యాన్ని పూర్తిగా సాధించడం కష్టమే. చివరి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో డిజిటలైజేషన్ కోసం ముందుగానే ఫారాలు ఇవ్వాలని అధికారులు కోరుతుండగా, ప్రజల్లో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఫారాల రూపకల్పన క్లిష్టంగా ఉందని, అవసరమైన పత్రాలపై కూడా స్పష్టత లేదని రాజకీయ పార్టీలు, పౌరసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు తలెత్తితే వేలాది మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు కావడం ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి, ఒకటికి మించి ఓటరు నమోదులు చేసుకున్నట్లు తేలితే జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధనలను అమలు చేయడంలో కూడా పారదర్శకత, సమన్యాయం అత్యంత కీలకం. ద్వంద్వ నమోదులను గుర్తించడం సులభమే అయినా, రెండు రాష్ట్రాల్లో ఉన్న నమోదులను గుర్తించడంలో భారత ఎన్నికల సంఘం సమన్వయం మరింత బలోపేతం కావాలి.
ప్రవాస భారతీయుల ఓటు హక్కు ఆందోళన కలిగిస్తోంది. భారత విదేశాంగశాఖ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. వారిలో 90 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఏపీ తెలంగాణల నుంచే 20 నుంచి 25 లక్షల మంది విదేశాల్లో ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, నిర్మల్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. హైదరాబాద్ పాతబస్తీతో పాటు అనేక పట్టణ నియోజకవర్గాల్లో కూడా వేలాది కుటుంబాలు విదేశీ ఉపాధిపై ఆధారపడ్డారు.
ప్రస్తుత చట్టం ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ పాస్పోర్టులో ఉన్న చిరునామా ఆధారంగా ప్రవాస ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువ. చట్టపరమైన అవగాహన లేకపోవడం, పత్రాల్లో పేర్లు, వయస్సులో వ్యత్యాసాలు, రేషన్ కార్డు వంటి సంక్షేమ పథకాలపై అపోహలు, దూర ప్రాంతాల్లో కాన్సులర్ సేవలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
సర్ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ సవరణ ప్రక్రియలో పాల్గొనాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేపథ్యంలో, ప్రజల వద్దకు వెళ్లాల్సిన బీఎల్వోలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారా? ఓటరు నమోదు సవ్యంగా సాగుతోందా? ప్రవాస భారతీయుల మాటేమిటి? నకిలీ నమోదులు తొలగిపోతున్నాయా? ఎన్యూమరేషన్ గందరగోళం సంగతేంటి?
డిజిటల్ విధానాలపై పూర్తిగా ఆధారపడటం గ్రామీణులు, నిరక్షరాస్యులు, వృద్ధులు, వలస కార్మికులకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంటింటి ధృవీకరణ, హెల్ప్ డెస్క్ లు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు, బహుభాషా సమాచార వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రవాస సంఘాలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలి.
ఓటు హక్కు కేవలం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు మాత్రమే కాదు. పౌరుడి భాగస్వామ్యానికి ప్రతీక. అందుకే సవరణ పేరుతో అర్హులైన ఓటర్లు అనుకోకుండానైనా సరే, జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల సంఘం వ్యవహరించాలి. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్ళిన లక్షలాది తెలుగు ప్రవాసుల హక్కులను పరిరక్షించేలా స్పష్టమైన విధానాలు, సమర్థవంతమైన అమలు, పారదర్శక వ్యవస్థను రూపొందించడం అత్యవసరం. అప్పుడు మాత్రమే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తన అసలు లక్ష్యాన్ని నెరవేర్చినట్లవుతుంది. ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది.

