ఏపీ, తెలంగాణ రాష్టాల్ల్రో కాంగ్రెస్ ప్రయాణం అగమ్యగోచరంగా ఉంది. ముఖ్యంగా ఎపిలో కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైంది. అక్కడ ఎవరు వచ్చినా ఆ పార్టీ బతికి బట్టకట్టడం కష్టంగా కనిపిస్తున్నది. గత ఎన్నికలకు ముందు షర్మిల పగ్గాలు చేపట్టినా పెద్దగా లాభం లేకుండా పోయింది. చివరకు ఆమె కూడా గెలవలేదు. వైఎస్ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో జగన్ సఫలమైనా..పాలనలో విఫలం అయ్యారు. స్వార్థపూరిత రాజకీయాలు జగన్ పతనాన్ని శాసించాయి. ఇప్పుడు షర్మిల పోరాటం వల్ల జగన్కు నష్టం జరగిందే తప్ప కాంగ్రెస్కు లాభం చేకూరలేదు. తెలంగాణలో బిజెపికి దక్కాల్సిన అధికారం అనూహ్యంగా కాంగ్రెస్కు దక్కింది. రేవంత్ రెడ్డి సిఎం అయ్యాక చేస్తున్న కార్యక్రమాలు కొంతమేర సత్ఫలితాలిస్తున్నా, ఇంకా పూర్తి సమర్థ నేతగా రుజువు చేసుకోవాల్సి ఉంది. బహునాయకత్వం, ప్రతి దానికీ హైకామండ్ ముందు మోకరిల్లాల్సి రావడం వంటి కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో పలచనవుతోంది. మంత్రులతంతా ఎవరికివారు యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు. తమ శాఖల పరిధిలోని కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయలేక పోతున్నారు. దేవాయదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు ఈ రెండు శాఖల్లో ఏం జరుగుతుందో తెలుస్తున్నట్లు లేదు. అడవుల్లో మొక్కల పెంపకం అటకెక్కింది. కోతులు గ్రామాలను పట్టిపీడిస్తున్నా పట్టించుకోవడం లేదు. దేవాలయ భూముల చెరను విడిపించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలకే పరిమితం అయ్యారు. ఎక్కడా రోడ్ల అభివృద్ధి జాడ లేదు. హైదరాబాద్ అంతర్గత రోడ్లు ఏడాది దాటినా అభివృద్ధికి నోచలేదు. గ్రామాల్లో నిధులు విడుదల కాకపోవడంతో పనులు పడకేశాయి. ఇలా ఒక్కోమంత్రి తీరు ఒక్కోలా ఉంది.
కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రజలను పట్టించుకోదు. ప్రతిపక్షంలో ఉంటే విపక్షంగా గట్టి పాత్ర నిర్వహించదు. అధికారం కోసం వెంపర్లాడడం తప్ప అణగిమణిగి ఉండాలన్న ఆకాంక్ష కానరాదు. పార్టీని బలోపేతం చేయడం కోసం ఎవరూ పాటుపడరు. ఎవరైనా ముందుకు వస్తే ముందరి కాళ్ళకు బంధం వేస్తారు. అధికారం వస్తే పదవుల కోసం పాకులాడుతారు. అధికారం లేకుంటే కీచులాటతో పార్టీని భ్రష్టు పట్టిస్తుంటారు. మొత్తంగా కాంగ్రెస్లో ఒకరిపై ఒకరికి విశ్వాసం ఉండదు. నాయకత్వాన్ని సహించే లక్షణం, కార్యకర్తలను పట్టించుకునే దక్షణం కానరాదు. అనే నానుడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టలేక పోతున్నారు. హైదరాబాద్ భూముల విషయాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. నిజానికి భూమిని కోర్టులో పోరాడి దక్కించుకుంటే, దానిని రక్షించాలి తప్ప ఆమ్మకూడదు. కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే అధికార కుంపటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది నిజంగా ఆత్మహత్య సదృశ్యమే. ఇలా జాతీయ స్థాయిలోనూ కనిపిస్తూ ఉంటుంది. తాజాగా తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. రేవంత్ సిఎంగా పటిష్ట నిర్ణయాలు తీసుకుంటూ పని చేసుకుంటూ పోతుంటే, మిగతా వాళ్ళు ఆయనకు అంతగా మద్దతుగా నిలుస్తున్నట్లు లేదు. ఉమ్మడి తనం ఏమాత్రం కనిపించడంలేదు. కేవలం రేవంత్ మాత్రమే అందరినీ కలుపుకుని పోయేలా ఉంటున్నారు. పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పెద్దగా పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేయడం లేదు. పార్టీలో వ్యతిరేకంగా పనిచేయడం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ గా పరిగణించి..రేవంత్ రెడ్డికి పూర్తి అధికారం ఇచ్చి నడిపించడం లేదు. అధిష్ఠానం కర్నాటక, తెలంగాణలను పిండేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ భూముల అమ్మకం వెనకా అద్రుశ్య ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ బలహీన పడితే, ఆ పరిస్థితి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే లాభిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎంత బలహీనపడినా, కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం అనుమానంగానే కనిపిస్తున్నది. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా మారి, బీజేపీకి, కాంగ్రెస్ కి సవాల్ గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన టీ కాంగ్రెస్ గత బిఆర్ఎస్ పాలనకు భిన్నమైన పరిపాలనను అందించాలి. విమర్శలు కట్టిపెట్టి ప్రజల కోసం అంతా కలసికట్టుగా పనిచేయాలి. సున్నితమైన అంశాల వాదవివాదాలను పక్కన పెట్టడమే బెటర్. సొంత, బయటి పార్టీల అభిప్రాయాలను పక్కనపెట్టి, ప్రజాభిప్రాయాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది. కాదంటే కాంగ్రెస్ గతానుభవాలు పునరావృతం కాగలవు. తస్మాత్ జాగ్రత్త!
తీరు మారాలి! మారి తీరాలి!!

