వెంటనే నివేదిక కోరిన అటవీ శాఖ
కేంద్ర అటవీ శాఖ మంత్రిని కలిసిన బీజేపీ నేతలు
కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈ భూములపై నిజ నిర్ధారణ నివేదికను వెంటనే సమర్పించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించింది. కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా, అటవీ చట్టానికి అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, భూముల వాస్తవ స్థితిగతులపై నివేదికతో పాటు సంబంధిత శాఖలు ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకున్నాయో వివరించాల్సిందిగా సూచించింది.
కేంద్ర అటవీ శాఖ మంత్రిని కలిసిన బీజేపీ నేతలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.నగేశ్, రఘునందన్ రావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి పర్యావరణ పరిరక్షణకు చాలా కీలకమైనదని, ఇది హెరిటేజ్ జోన్లోకి వస్తుందని తెలిపారు.ఈ భూముల్లో అనేక ఔషధ మొక్కలు, పక్షుల జాతులు ఉన్నాయని, హైదరాబాద్ పర్యావరణ సమతుల్యతకు ఇవి ఎంతో మేలుచేస్తాయని బీజేపీ నేతలు వివరించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను రియల్ ఎస్టేట్కు మార్చి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని చూస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు నగర ప్రజలంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని బీజేపీ నేతలు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు వివరించారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని ఈ భూములను పరిరక్షించాలని కోరారు.

