రాహుల్ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి. రాజ్యాంగం ఒక చేతిలో, యువత సమస్యలు మరో చేతిలో పట్టుకుని ముందుకు సాగడం సులభమే. కానీ యువత చేతిలో ఉన్న ఓటు తమ బుట్టలో పడాలంటే మాత్రం మాటలకంటే మించిన రాజకీయ విశ్వసనీయత అవసరం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
రాజకీయాల్లో అవకాశాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండవు. మనమే కల్పించుకోవాలి. అప్పుడప్పుడు పరిణామాల నుంచి కూడా అవకాశాలు పుడతాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అలాంటి అవకాశమే రాహుల్గాంధీ ముందు నిలిచింది. నీట్ పరీక్షల లీకులు, విద్యార్థుల ఆందోళనలు, ప్రభుత్వ జవాబుదారీతనంపై పెరుగుతున్న అసంతృప్తితో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ముందుకొచ్చిన యువత ఉద్యమం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. జులై 20న ఢిల్లీలో జరిగిన ఆందోళనకు వేలాది మంది విద్యార్థులు, జెన్జీ యువత తరలివచ్చారు. ఈ తరుణంలో రాహుల్గాంధీ విద్యార్థుల పక్షాన నిలవడం, పార్లమెంట్లో వారి సమస్యలను ప్రస్తావించడం రాజకీయంగా సహజమైన వ్యూహమే. అయితే, ఈ ఉద్యమాన్ని రాహుల్గాంధీ తన రాజకీయ బలంగా మార్చుకోగలరా? లేక ఇది మరో తాత్కాలిక రాజకీయ అవకాశంగానే మిగిలిపోతుందా?
2024 లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్కు ఊపిరి పోశాయి. 2019లో 52 స్థానాలకే పరిమితమైన పార్టీ 2024లో 99 స్థానాలకు చేరింది. అదే సమయంలో బీజేపీ 303 నుంచి 240 స్థానాలకు తగ్గింది. ఈ ఫలితం బీజేపీ పతనానికి సంకేతం కాకపోయినా, కాంగ్రెస్కు తిరిగి పోరాడే అవకాశం లభించిందనడానికి మాత్రం నిదర్శనం. రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల అంశాలను కాంగ్రెస్ బలంగా ప్రచారం చేయడం కూడా అది పుంజుకోవడానికి కారణమైంది.
కానీ, వచ్చిన 99 స్థానాలు అధికారాన్ని హస్తగతం చేయలేకపోయాయి. రాహుల్ వ్యక్తిగత ప్రజాదరణ, పార్టీ సంస్థాగత బలం, విస్తృత సామాజిక కూటమి అంశాల్లో కాంగ్రెస్ ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోంది. అందుకే యువతను ఆకర్షించడం రాహుల్కు భవిష్యత్తు పోరాటానికి అవసరం.
భారత యువత పరిమాణమే ఇందుకు కారణం. కేంద్ర గణాంకాల ప్రకారం 2021లో 15–29 ఏళ్ల వయసు వారు దేశ జనాభాలో 27.2%. 2036 నాటికి ఈ వాటా 22.7 శాతానికి తగ్గినా, వారి సంఖ్య 34.5 కోట్లుగా ఉంటుందని అంచనా. అంటే రాబోయే దశాబ్దంలో భారత ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసే అతిపెద్ద సామాజిక వర్గం యువతే.
అయితే, యువతను కేవలం నినాదాలతో ఆకట్టుకోవడం సాధ్యం కాదు. ఉద్యోగం, నాణ్యమైన విద్య, పరీక్షల విశ్వసనీయత, పారదర్శక నియామకాలు, అవినీతి నియంత్రణ, ప్రభుత్వ జవాబుదారీతనం అత్యావశ్యం. 2023–24లో 15 ఏళ్లు పైబడిన వారిలో దేశవ్యాప్తంగా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 56.4 శాతంగా ఉంది. మహిళలది 35.6 శాతానికి చేరినా, పురుషుల 77.5 శాతంతో పోలిస్తే అంతరం ఇంకా పెద్దదే. ఈ గణాంకాలు యువతకు అవకాశాలు సృష్టించడం ఎంత కీలకమో చెబుతున్నాయి.
ఇక్కడే సీజేపీ ఉద్యమం ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్షా పత్రాల లీకులు, పరీక్షల రద్దు, సాంకేతిక లోపాలు వంటి అంశాలపై ఏర్పడిన ఆగ్రహం ఒక పార్టీకి చెందినది కాదు. అది విద్యా వ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న యువత అసంతృప్తికి ప్రతీకగా మారింది. అందుకే ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ పూర్తిగా తన రాజకీయ రంగులోకి లాగేందుకు ప్రయత్నిస్తే, యువత దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ఒకటి. ఉద్యమాన్ని స్వాధీనం చేసుకోవడం మరొకటి. ఈ తేడాను రాహుల్గాంధీ గుర్తించాల్సి ఉంటుంది.
తమిళనాడు పరిణామాలు కూడా రాజకీయ పార్టీలకు ఒక పాఠం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 34.92 శాతం ఓట్లతో 108 స్థానాలు గెలుచుకుంది. డీఎంకే 24.19 శాతం ఓట్లతో 59, ఏఐఏడీఎంకే 21.21 శాతంతో 47 స్థానాలకు పరిమితమయ్యాయి. అంటే కొత్త రాజకీయ శక్తికి యువతలో ఏర్పడిన ఆకర్షణను విస్మరించలేమని తమిళ ఫలితాలు సూచిస్తున్నాయి.
విజయ్ విజయాన్ని కేవలం ‘సంక్షేమానికి వ్యతిరేకంగా యువత తీర్పు’గా చూడటం కూడా తప్పే. టీవీకే తన ఎన్నికల ప్రచారంలో యువత, విద్య, మహిళలు, ఆరోగ్యం, రైతులు, పాలన వంటి అంశాలపై విస్తృత హామీలు ఇచ్చే గెలిచింది. కాబట్టి యువత సంక్షేమాన్ని తిరస్కరించడం లేదని తేలిపోయింది. సంక్షేమంతో పాటు గౌరవం, అవకాశాలు, జవాబుదారీతనం, భవిష్యత్తుపై నమ్మకాన్ని కోరుకుంటోంది.
ఇదే కాంగ్రెస్కు అసలైన సవాల్. ఖద్దరు, పాత నినాదాలు, కుటుంబ వారసత్వం మాత్రమే యువతను ఆకర్షించలేవు. అదే సమయంలో జీన్స్, టీషర్ట్ ధరించడం వల్ల కూడా యువత మనసు గెలుచుకోలేరు. రాజకీయ భాష, పార్టీ అంతర్గత సంస్కృతి, అభ్యర్థుల ఎంపిక, ఉద్యోగాలపై విధానం, డిజిటల్ యుగానికి అనుగుణమైన కమ్యూనికేషన్ అన్నీ మారాలి.
మోదీ నాయకత్వంలోని బీజేపీకి కూడా ఇదే హెచ్చరిక వర్తిస్తుంది. దీర్ఘకాలం ఒకే రాజకీయ కథనంతో యువతను నిలబెట్టుకోవచ్చని ఏ పార్టీ భావించినా అది భ్రమే. యువత సోషల్ మీడియాను చూస్తోంది, ప్రభుత్వ పనితీరును పోల్చుకుంటోంది. మంచి చెడులను ఎంచుతోంది. ప్రశ్నిస్తోంది. విమర్శను అణచివేయడం కంటే సరైన సమాధానం చెప్పడం భవిష్యత్తు రాజకీయాల్లో కీలకం.
కాబట్టి, రాహుల్ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి. రాజ్యాంగం ఒక చేతిలో, యువత సమస్యలు మరో చేతిలో పట్టుకుని ముందుకు సాగడం సులభమే. కానీ యువత చేతిలో ఉన్న ఓటు తమ బుట్టలో పడాలంటే మాత్రం మాటలకంటే మించిన రాజకీయ విశ్వసనీయత అవసరం.

