HAND|‘చేతు’లెత్తేసిన MINISTER|మంత్రి!?
జూపల్లి కృష్ణా? రామా?
నిర్లిప్తతా? నిర్వేదమా?
అలవికాని అసంతృప్తా?
ఎందుకీ నిరాశావాదం?
తనకు తగిన గుర్తింపు లేకనా?
TWO YEARS|రెండేళ్ళు కాకముందే నిస్సహాయతా?
అధికారం రావడానికి 4 స్తంభాలుంటే,
అందులో మూడో స్తంభం జూపల్లే…
సీఎం గుర్తింపునివ్వడం లేదా?
TELANGANA|‘తెలంగాణ’ కోసం మంత్రిపదవి త్యాగం
గతంలో KCR|కేసీఆర్ నే ఎదురించిన ధైర్యం
స్వతంత్రంగా కూడా గెలిచిన సత్తా సొంతం
మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న ప్రచారమే కారణమా?
‘‘ఎటువంటి హామీ ఇవ్వను. ఎందుకిస్త? నేను గెలుస్తనో లేనో నాకే తెలవదు. నేను గెలిచినా, పోనీ నా పార్టీ గెలుస్తుందో లేదో నాకు తెలవదు. పోనీ మా ప్రభుత్వం వస్తదో రాదో నాకు తెలవదు. పోనీ మా ప్రభుత్వం వచ్చినా, ఈ స్కీమ్స్ ఉంటయో లేదో నాకు తెలియదు. నా జేబుల నుంచి ఇచ్చేదైతే, ఇచ్చేది ఉంటే చెబుతా? మరి ఎవరేమైతరో ఏమైద్దో తెలవని దానికి ఇస్తే, అది మోసం మాట అవుతుంది కాబట్టి, నేను హామీ ఇవ్వను. కాబట్టి ప్రయత్నం చేస్తా. నూటికి నూరు పాల్లు అయ్యేటట్లు చూస్తా…’’ ఇవి ఎవరో మామూలు నేతో, వ్యక్తో అన్న మాటలు కావు. సాక్షాత్తు రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్న మాటలు. అదీ ఓ అధికారిక కార్యక్రమంలో చేసిన సంచలన వ్యాఖ్యలు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో ఇందిరమ్మ నమూనా ఇంటి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
తర్వాత మంత్రి ఆ వ్యాఖ్యలను సమర్ధించకున్నారు కూడా. ‘‘అస్త్ర సన్యాసం చేసిండ్లు. నైరాశ్యంలో ఉన్నరు. అంటూ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నేను వాస్తవమే మాట్లాడిన.’’ అని ఆయన తన మాటలను నిజమేనని కూడా అంటున్నారు. అసలు ఈ మాటల వెనుక మర్మమేంటి? జూపల్లి నిస్సత్తువ, నిర్వేదానికి కారణాలేంటి? అడుగు అందిస్తున్న ప్రత్యేక కథనం.
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
జూపల్లి కృష్ణారావు సీనియర్ నేత. 1999లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004 ఎన్నికల్లో పొత్తులో భాగంగా కొల్లాపూర్ ను టీఆర్ఎస్ కి కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్థిగా రెండోసారి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వై.ఎస్. రాజశేఖరరెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో పౌర సరఫరాలు, వినయోగదారుల వ్యవహారాల మంత్రిగా, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవదాయ శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ కి, మంత్రి పదవికి రాజీనామా చేసి 2011 అక్టోబరు 30న టీఆర్ఎస్ లో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీఆర్ఎస్ నుండి గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2018లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. హర్షవర్దన్ టీఆర్ఎస్ లో చేరడంతో, పార్టీతో విభేదించారు. కేసీఆర్ తో నేరుగా తలపడ్డారు. తనను నిర్లక్ష్యం చేస్తుండటంపై నిలదీశారు.
కొల్లాపూర్ మున్సిపాల్టీని గెలిపించుకున్నారు. 2023 ఏప్రిల్ 09న ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్త గూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో జూపల్లిని, పొంగులేటి లను 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. దీంతో 2023 ఆగష్టు 3న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్లాపూర్ నుండి గెలిచి, డిసెంబర్ 7న రేవంత్రెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
జూపల్లికి సుదీర్ఘమైన 26 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది. అందులో 16ఏళ్ళుగా వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి పలువురు సీఎం ల హయాంలో మంత్రిగా వేర్వేరు శాఖలు నిర్వహించిన అనుభవం ఉంది. కేసీఆర్ ను నిలదీసిన ధైర్యం ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ ఈ సారి అధికారంలోకి రావడంలో కీలకమైన మూడో స్తంభంగా పని చేశారు. పొంగులేటిని కాంగ్రెస్ లోకి తేవడంలో ఆయనదే కీలక పాత్ర. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న నేత ఆ మాటలను ఆశా మాషీగా అన్నారని అనుకోలేం. సరిగ్గా ఆయనే ‘నేను అవాస్తవమేమీ మాట్లాడలేదని’ సమర్థించుకోవడాన్ని బట్టి కూడా ఆయన తాను చేసిన వ్యాఖ్యల మీద నిలబడే ఉన్నారు. అది ఆయన నిజాయితీకి మచ్చుతునక. అయితే, సీనియర్ మంత్రిగా ఉండీ అలా మాట్లాడటానికి కారణాలేమై ఉంటాయన్న దానిపై సహజంగానే సర్వత్రా ఆసక్తి, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నాయి. ఆయన గతంలో ఇలా ఎప్పుడూ మాట్లాడి ఉండకపోవడంతో కూడా మీడియా విశ్లేషణలు మొదలు పెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు కూడా కాలేదు. జూపల్లి అప్పుడే మంత్రిగా ఏమీ చేయలేమని నిర్ధారణకు వచ్చి ‘చేతు’లెత్తేశారా? అప్పుడే కృష్ణారావు కృష్ణా? రామా? అనే స్టేజీకి వెళ్ళిపోయారా? ఇది నిర్లిప్తతా? నిర్వేదమా? లేక అలవికాని అసంతృప్తా? అసలు ఎందుకీ నిరాశావాదం? అలుముకుంది. తనకు తగిన గుర్తింపు లేకనే? ఇలా మాట్లాడుతున్నారా? తన నిస్సహాయత? ను ఈ విధంగా వెళ్ళ గక్కారా? జూపల్లి ఇలా మాట్లాడటానికి కారణాలేమై ఉంటాయి? సీఎం జూపల్లికి గుర్తింపునివ్వడం లేదా? అన్న మీన మేషాలు మీడియా లెక్కిస్తోంది. ‘తెలంగాణ’ కోసం మంత్రి పదవినే త్యాగం చేసి, కేసీఆర్ నే ఎదురించి, నిలదీసిన గుర్తింపు ఉన్న జూపల్లిలో ఈ నిర్వేదం, నిస్సత్తువ ఎందుకు ఆవహించినట్లు? గతంలో స్వతంత్రంగా కూడా గెలిచిన సత్తా ఉన్న జూపల్లి, ఇలా మాట్లాడటానికి కారణం బహుషా ఆ మధ్య మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న ప్రచారమే కారణమా? ఆ ప్రచారం ఎవరు చేశారు? ఎవరు చేయించారు? నిజంగానే ఆయనకు ఆయన మంత్రి పదవి ఊడేదాకా వచ్చిందా? జూపల్లి వ్యాఖ్యల తర్వాత ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవడం మామూలే. పైగా ముక్కు సూటిగా వ్యవహరించే లక్షణమున్న జూపల్లికి, ఉన్నదున్నట్లు మాట్లాడే అలవాటు కూడా ఉంది. 2003లో కొల్లాపూర్ లో విద్యుత్ కోతలపై సంబంధిత అధికారులను నిలదీసి, జైలుకెళ్ళినటువంటి అనుభవాలు ఎన్నో ఆయనకున్నాయి.
ఇప్పుడు ఆయన మాటలపై ఆయనే ‘అందులో తప్పేముంది? వాస్తవమే మాట్లాడిన’ అనడం, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పాజిటివ్ గా చూస్తే, నిజమేననిపిస్తున్నది. కానీ, అందులో నిర్వేదం, నిస్సహాయతలు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి ఉండటం, మంత్రులుగా కూడా ఏమీ చేయలేకపోడం వంటి సమస్యల కారణంగా కూడా ఆయన అలా అనూహ్యంగా అని ఉండవచ్చు. కానీ, మంత్రిగా ఉండి, చేసిన ఆయన వ్యాఖ్యలు అసాధారణంగా అనిపించడం సహజమే. అయితే ఈ అసహనానికి కారణాలు ఏమైనా ఉంటే మంత్రి జూపల్లే చెప్పాలి. లేకపోతే సీఎం అయినా తెలుసుకోవాలి. అదీకాకపోతే అధిష్ఠానమైనా ఆరా తీయాలి. ఇవేవీ కాకపోతే మీడియా పీపీలికలు చేయడం మామూలే! కారణాలేమైనా కచ్చితంగా కాలం తేల్చేస్తుందనడంలో సందేహం అక్కరలేదు.

