ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా ఫలితం ప్రకృతి, ప్రభుత్వం, వ్యాపారులు, దళారుల చేతుల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి రైతు ఆర్థిక స్థితిని మాత్రమే కాదు, దేశ ఆహార భద్రతనూ ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక. దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ప్రజల జీవనాధారమూ వ్యవసాయమే. అయితే, ఈ రంగం పూర్తిగా వర్షాధారమై ఉండటం వల్ల ప్రతి ఏడాది రైతు ఆశలు ఆకాశం వంక చూస్తూనే ఉంటాయి. ఈసారి ఆ ఆశలను ఎల్నినో ప్రభావం మరింత అడియాశలు చేసి, అనిశ్చితిలోకి నెట్టింది. జూన్లో కురవాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమవడం, జూలైలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ నెలలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే 40 శాతం తక్కువగా నమోదైంది. జూలై మొదటి వారంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో లోటు కొంత తగ్గినా, దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరించింది. జూలై నెలలో వర్షపాతం దీర్ఘకాల సగటులో 94 శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని కూడా అంచనా వేసింది. అంటే కేవలం 6శాతమే వర్షాలన్నమాట.
వర్షాల లేమి ప్రభావం ఇప్పటికే దేశమంతా కనిపిస్తోంది. జూలై మధ్యకు వచ్చినా అనేక ప్రాంతాల్లో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తక మళ్లీ విత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే పోగుంటలకు రైతులు తయారయ్యారు. మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరిలో కొంత ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత ఆందోళన కలిగిస్తోంది. సాగునీటి కొరతతో పాటు తాగునీటి సమస్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా వెనుకబడి ఉంది. జూలై 5 నాటికి గత ఏడాదితో పోలిస్తే 21 శాతం తక్కువ విస్తీర్ణంలోనే విత్తనాలు వేశారు. దీనికి ప్రధాన కారణం వర్షాల వెనుకబాటే. వాతావరణ నిపుణులు తక్కువ నీటితో సాగయ్యే మక్కజొన్న, సజ్జలు, పెసర, కందులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు.
అయితే, రైతు సమస్యలు వర్షాల కొరతతోనే ముగియవు. వ్యవసాయం నేడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, ట్రాక్టర్ల అద్దెలు, కూలీల వేతనాలు… ప్రతి అంశంలో వ్యయం గణనీయంగా పెరిగింది. కానీ పెట్టుబడికి తగిన దిగుబడి రావడం లేదు. వచ్చిన పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. కనీస మద్దతు ధర ప్రకటించినా, కొనుగోలు వ్యవస్థలో ఉన్న లోపాలు రైతును మార్కెట్ దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తున్నాయి.
నకిలీ విత్తనాలు రైతాంగాన్ని మరోవైపు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అధిక దిగుబడుల పేరుతో విక్రయించే నాసిరకం విత్తనాల వల్ల మొలక శాతం తగ్గి, పంటలు దెబ్బతింటున్నాయి. సీజన్ సమయంలో ఎరువుల కొరత రైతులకు మరో శాపంగా మారుతోంది. అవసరమైన సమయంలో ఎరువులు అందకపోవడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశమే లేకుండా పోతోంది.
ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్ల వానలు… వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా ఫలితం ప్రకృతి, ప్రభుత్వం, వ్యాపారులు, దళారుల చేతుల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి రైతు ఆర్థిక స్థితిని మాత్రమే కాదు, దేశ ఆహార భద్రతనూ ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.
ఈ సంక్షోభానికి మరో విషాదకర కోణం రైతుల అప్పులు. బ్యాంకు రుణాలు సకాలంలో అందని చిన్న, సన్నకారు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలు, పంట నష్టాలు, గిట్టుబాటు ధరల లేమి కలిసి వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఆర్థిక, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఇప్పటికీ ఆగకపోవడం దేశానికి సిగ్గుచేటు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి సహాయాలు, పరిహారాలు ప్రకటించడం సరిపోదు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు రూపొందించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, మైక్రో ఇరిగేషన్ విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. నకిలీ విత్తనాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి కఠిన శిక్షలు అమలు చేయాలి. ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఆలస్యం కాకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలి. కనీస మద్దతు ధరను చట్టబద్ధ హామీగా మార్చే అంశాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. వ్యవసాయం నిలబడితేనే ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, దేశ అభివృద్ధి నిలకడగా ఉంటాయి. ఎల్నినో ఒక సహజ వాతావరణ ప్రక్రియ కావచ్చు. కానీ దాని ప్రభావాన్ని విపత్తుగా మారనివ్వకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించడం పాలకుల బాధ్యత. ఈ వర్షాకాలం మరోసారి గుర్తు చేస్తున్న సందేశం ఒక్కటే. వ్యవసాయాన్ని కాపాడటం అంటే రైతును మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును కాపాడటమని గుర్తుంచుకోవాలి.

